మెగా మేనల్లుడి హీరోయిన్ ఎందుకు మారింది?
on May 20, 2019
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా 'ఉప్పెన'. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థతో కలిసి సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్నది. ఇందులో కథానాయికగా ఐదారు కన్నడ సినిమాలలో నటించిన కృతి శెట్టిని ఎంపిక చేసినట్టు మొన్న శనివారం ఒక ప్రకటన వచ్చింది. తెలుగు తెరకు మరో కొత్త భామను సుకుమార్ పరిచయం చేస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో, ఇటు వెబ్ మీడియాలో కొందరు రాసుకొచ్చారు. అనుష్క, ప్రణీత, నభా నటేశ్, శ్రద్ధా శ్రీనాథ్ బాటలో మరో కన్నడ భామ తెలుగు తెరపైకి వస్తుందని కొందరు సంబరపడ్డారు. అయితే, చాలామంది మరచిపోయిన విషయం ఏంటంటే... ఈ సినిమాలో కథానాయికగా కృతి శెట్టిని ముందు అనుకోలేదు. దర్శక నిర్మాతల ఫస్ట్ ఛాయిస్ మనీషా రాజ్. సినిమా ప్రారంభోత్సవంలోనూ ఆమె సందడి చేసింది. అయితే ఆమెను తప్పించి కృతి శెట్టిని తీసుకున్నారు. సినిమాలో హీరోయిన్ ఎందుకు మారింది? అంటే... గోదావరి నేపథ్యంలో సాగర తీరం లో జరిగే కథతో 'ఉప్పెన' తెరకెక్కుతోంది. సముద్రంలో చేపల్ని వేటాడే జాలరి పాత్రలో పంజా వైష్ణవ్ తేజ్ నటిస్తున్నాడు. కథానాయికది కూడా పల్లెటూరి అమ్మాయి పాత్రే. మనీషా రాజ్ ఆ పాత్రకు సూట్ అవ్వలేదు అని, హీరో పక్కన కాస్త పెద్ద అమ్మాయిగా కనిపించిందని.... అందుకే కృతి శెట్టిని తీసుకున్నారట.