'మహర్షి' తరువాతే 'అర్జున్ సురవరం'
on Apr 25, 2019
పాపం... యువ హీరో నిఖిల్ అదృష్టం అసలు ఏమాత్రం బాగోలేదు. ఇప్పటికే విడుదల కావాల్సిన అతని తాజా చిత్రం 'అర్జున్ సురవరం' మరోసారి వాయిదా పడింది. ఇంతకు ముందు సినిమా యూనిట్ జనాలే సినిమా విడుదలకు అడ్డు పడ్డారు. రషెస్ చూసి మళ్లీ రీషూట్ చేయాలని నిర్ణయించుకోవడంతో విడుదల వాయిదా పడింది. అయితే... అప్పట్లో ఇవేవీ బయటకు చెప్పలేదు. విడుదల వాయిదా పడుతున్న విషయాన్ని మాత్రం ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. 'స్వామి రారా', 'కార్తికేయ' సినిమాల విడుదల కూడా ఇదేవిధంగా వాయిదా పడ్డాయని... విడుదల వాయిదా పడిన తన ప్రతి సినిమా విజయం సాధించిందని నిఖిల్ చెప్పాడు. ఇప్పుడు సినిమా ఫస్ట్ కాపీ రెడీగా ఉంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు విడుదల చేసుకోవచ్చు. కానీ, విడుదల చేయలేని పరిస్థితి. ప్రేక్షకుల్లో భయంకరమైన క్రేజ్ కల హాలీవుడ్ సినిమా 'అవెంజర్స్ ఎండ్ గేమ్'కి రెండు తెలుగు రాష్ట్రాలలో మెజారిటీ థియేటర్లు కేటాయించారు. ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి టాక్ తెచ్చుకున్న 'జెర్సీ', విమర్శకుల సమీక్షలతో సంబంధం లేకుండా వసూళ్లలో దూసుకువెళ్తున్న 'కాంచన 3' కొన్ని థియేటర్లలో ఉన్నాయి. దాంతో నిఖిల్ 'అర్జున్ సురవరం'కి థియేటర్లు దొరకడం లేదు. చేసేదేంలేక సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ విషయమై ముందుగా ఏయషిన్ సినిమాస్ స్పష్టత ఇచ్చింది. దాపరికాలు లేకుండా థియేటర్లో దొరకని కారణంగా విడుదల వాయిదా వేస్తున్నట్టు... మహర్షి విడుదల తర్వాత మంచి తేదీ చూసి విడుదల చేస్తామని ఏషియన్ సినిమాస్ పేర్కొంది. తర్వాత నిఖిల్ స్పందించాడు. "సినిమా విడుదలను వాయిదా వేయడం బాధాకరం అయినప్పటికీ... డిస్ట్రిబ్యూటర్ల నిర్ణయాన్ని గౌరవిస్తున్నాను. నేను కూడా ప్రేక్షకుల గ్రాండ్ రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తున్నా. ఈ సమయంలో నాకు ప్రేక్షకులతో పాటు అత్యవసరం. ఇన్ని రోజులు ప్రేక్షకుల్ని వెయిట్ చేయించినందుకు మనస్ఫూర్తిగా క్షమాపణలు తెలుపుతున్నా" అని నిఖిల్ ఓ లేఖ విడుదల చేశాడు. 'మహర్షి' విడుదల తర్వాత కూడా చాలా సినిమాల్లో లైన్ లో ఉన్నాయి. వాటి మధ్య నిఖిల్ ఎప్పుడొస్తాడో?