ఎన్టీఆర్ మహానాయకుడు మూవీ రివ్యూ
on Feb 21, 2019
నటీనటులుః నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్, నందమూరి కళ్యాణ్ రామ్, రానా దగ్గుపాటి, సుమంత్
సాంకేతిక నిపుణులు:
దర్శకుడు: క్రిష్ జాగర్లమూడి
బ్యానర్స్: NBK ఫిల్మ్స్, వారాహి చలనచిత్రం, విబ్రి మీడియా
నిర్మాత: నందమూరి బాలకృష్ణ
సంగీతం: MM కీరవాణి
సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్
మాటలు: సాయి మాధవ్ బుర్రా
లిరిక్స్: సిరివెన్నెల సీతారామశాస్త్రి
విడుదల తేది: 22-2-2019
నందమూరి బాలకృష్ణ, విద్యాబాలన్ జంటగా నటించిన సినిమా `ఎన్టీఆర్ మహానాయకుడు`. ఎన్టీఆర్ బయోపిక్ లో రెండో భాగంగా వస్తున్న ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 22న విడుదలైంది. ఎన్టీఆర్ రాజకీయ జీవితం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. `ఎన్టీఆర్ కథా నాయకుడు` లో ఆయన సినిమా హీరోగా ఎదగడం , ప్రజా సమస్యలు చూసి చలించి పాలిటిక్స్ లోకి రావాలనుకోవడం ...పార్టీ స్థాపిస్తున్నా అంటూ ప్రకటించడం వరకు మొదటి భాగం సాగింది. అది పబ్లిక్ కు అంతగా కనెక్ట్ కాలేదు. ఇక రెండో భాగం పూర్తిగా ఎన్టీఆర్ పొలిటికల్ జర్నీని మాత్రమే చూపించారు. రెండో భాగంలో ఒక డైలాగ్ ఉంటుంది...ఎన్టీఆర్ మొదటి సినిమా పెద్దగా ఆడలేదంటా...రెండో సినిమాకు తిరుగులేదంటా...మరి రెండో భాగానికి నిజంగానే తిరుగులేదా ? అసలు ఎన్టీఆర్ `మహానాయకుడు` ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం....
స్టోరి:
`రామన్న కథ `అంటూ ఎన్టీఆర్ బాల్యాన్ని, విద్యాభ్యాసాన్ని, వివాహం, సినిమాల్లోకి రావడం దీన్నంతా ఒక పాటలో ఆరేడు నిమిషాల్లో చూపించి ఆ తర్వాత `ఎన్టీఆర్ కథానాయకుడు` కథ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ నుంచి `ఎన్టీఆర్ మహానాయకుడు` చిత్రాన్ని ప్రారంభించారు దర్శకుడు క్రిష్. ఎన్టీఆర్ పార్టీ పేరు ప్రకటించడం... ప్రజలకు కనీస అవసరాలు గుర్తించి... వారికి అవసరమైన పథకాలు ప్రారంభించి పబ్లిక్ ని అతి తక్కువ సమయంలోనే ఆకట్టుకోని.... పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారాన్ని చేజిక్కించుకుంటాడు. పార్టీ ప్రారంభ దశ నుంచి ప్రతి విషయంలో వెన్నంటే ఉంటూ ఎన్టీఆర్ బాగా నమ్మిన వ్యక్తి నాదెండ్ల భాస్కరావు ఎన్టీఆర్ భార్య బసవతారకం క్యాన్సర్ వైద్యంతో పాటు, తన హార్ట్ ఆపరేషన్ కోసం అమెరికా వెళ్లిన క్రమంలో ఎమ్మెల్యేలందర్నీ తన వైపు తిప్పుకొని ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడుస్తాడు. ఇది తెలుసుకుని రగిలిపోయిన ఎన్టీఆర్ ఢిల్లీ పీఠాన్ని కదిలించి రాష్ట్రపతిని కలిసి తిరిగి ముఖ్యమంత్రి పదవి ని చేపట్టడంతో రెండో పార్ట్ పూర్తవుతుంది. ఆఖరి దశలో బసవతారకం, ఎన్టీఆర్ మధ్య నడిచే ఎమోషనల్ సీన్స్ , చంద్ర బాబు పాత్ర, నాదెండ్ల భాస్కరరావు పన్నిన పన్నాగాలు ఇవన్నీ తెరపై చూడాల్సిందే...
నటీనటుల హావభావాలు:
ఎన్టీఆర్ కథానాయకుడులో యంగ్ ఎన్టీఆర్ గా బాలకృష్ణ అసలు సూట్ కాలేదంటూ చాలా విమర్శలు వచ్చాయి. ఇక ఎన్టీఆర్ మహానాయకుడులో ఎటువంటి మేకప్ లేకపోవడం...వయసుకు తగ్గ పాత్ర కావడంతో ఎన్టీఆర్ గా బాలయ్య సరిగ్గా సరిపోయాడు. రెండో పార్ట్ ప్రారంభం నుంచి తిరిగి సిఎమ్ అయ్యే వరకు బాలకృష్ణ ను ఎన్టీఆర్ పూనారా?అన్నంతగా పరకాయ ప్రవేశం చేసి పాత్రకు న్యాయం చేశారు. కాషాయం ధరించి సాక్షాత్తు ఎన్టీఆర్ పైనుంచి దిగివచ్చారా అన్నంగతగా ఇమిడిపోయారు. ప్రజల్లోకి వెళ్లినపుడు ప్రజల మనిషిగా, ఢిల్లీ స్ఠాయిలో తెలుగు వాడి సత్తా చాటే నేతగా , అసెంబ్లీలో అవమానం జరిగినా...ఆ అవమానాన్ని దిగమింగుతూ..లో లోపల రగిలిపోయే సన్నివేశాల్లో అద్భుతమైన నటన ప్రదర్శించారు బాలయ్య. అలాగే తన భార్య బసవతారకం పై ప్రేమను వ్యక్త పరుస్తూ `నన్ను పదకొండు సార్లు ప్రసవించిందంటూ `` చెప్పే సన్నివేశాలు మనసుని కదిలిస్తాయి. ఇక ఎన్టీఆర్ భార్యగా విద్యాబాలన్ బసవతారకం పాత్రకు ప్రాణం పోసారనడంలో సందేహం లేదు. ముఖ్యంగా తను క్యాన్సర్ తో చనిపోయే సీన్ లో విద్యాబాలన్ అందరి చేత కంటనీరు పెట్టిస్తుంది. అలాగే నాదెండ్ల భాస్కరావు గా సచిన్ కేద్కర్ కన్నింగ్ పాత్రలో , ఎన్టీఆర్ పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిచే పాత్రలో ఒదిగిపోయారు. మహానాయకుడు సినిమా మొత్తం ఆయన చుట్టే తిరుగుతుంది. ఇక చంద్రబాబు పాత్రలో రానా నటించాడు. ఎన్టీఆర్ ఢిల్లీ పెద్దలతో పోరాడటానికి వెళ్లినప్పుడు ఎమ్మెల్యేలు చెదిరిపోకుండా తన తెలివితో వారిని కాపాడే సన్నివేశాలలో రానా రాణించాడు. కాకుంటే మొదటి నుంచి ఒకే ఎక్స్ ప్రేషన్ తో తన పాత్రను ముగించేసాడు. హరికృష్ణ పాత్రలో ఎన్టీఆర్ చైతన్య రథసారథిగా కళ్యాణ్ రామ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు.
సాంకేతికి నిపుణుల పనితీరు:
మొదటి భాగం ఇచ్చిన షాక్ తో దర్శకుడు అనవరమైన ఆర్భాటాలకు వెళ్ళకుండా చెప్పాల్సింది సూటిగా సుత్తి లేకుండా చెప్పే ప్రయత్నం చేసాడు. దీనికి కీరవాణి అందించిన పాటలు, నేపథ్య సంగీతం మంచి హెల్పయ్యాయి. సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అతిశయోక్తులతో కాకుండా అన్నగారిలోని శక్తియుక్తులను తెలిపేలా ఉన్నాయి. సినిమాలో చాలా డైలాగ్స్ కు క్లాప్స్ పడ్డాయి. ఎన్ బీకే సంస్థ నిర్మాణలు విలువలు కూడా బావున్నాయి. తక్కువ టైమ్ తీసినా కూడా బహిరంగ సభలు, ఆ క్రౌడ్ చాలా రిచ్ గా అనిపించాయంటే ఆ క్రెడిట్ అంతా దర్శకుడి కే దక్కుతుంది.
విశ్లేషణ:
మొదట భాగానికి వచ్చిన నెగిటివ్ టాక్ తో రెండో భాగం పై దర్శకుడు చాలా శ్రద్ద పెట్టాడు. కాకుంటే పార్ట్ టు అంతా కూడా నాదెండ్ల భాస్కరావు, చంద్రబాబు నాయుడు చుట్టూనే తిరిగినట్లు గా అనిపిస్తుంది. ఈ సినిమా చూసాక నిజంగా నాదెండ్ల భాస్కరరావు ఇంత కన్నింగ్ పర్సనా అనిపిస్తుంది. ఆయన్ను ఇందులో విలన్ గా చేసి చూపించారు. అది ఎంత వరకు నిజమనేది పెద్దలకే తెలియాలి. అలాగే చంద్రబాబు ,ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచాడు అంటూ ఇప్పటి వరకు ఎన్నో కథనాలు ఉన్నాయి. ఆ అపోహలు అన్నీ తొలిగిపోవాలనే ప్రయత్నంలో భాగంగా ఇందులో చంద్రబాబును హీరోగా చూపించే ప్రయత్నం చేసినట్టుగా అనిపిస్తుంది. మొదటి నుంచి కూడా తెలుగు దేశం పార్టీకోసం, ఎన్టీఆర్ కోసం పాటుపడే వ్యక్తిగా చూపించారు. దీన్నీ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి మరి. ఇక ఎన్టీఆర్ లైఫ్ అంతా ఎంతో సాఫీగా సాగిపోయేదే. ఆయన ఆఖరి దశే ఎంతో కీలకం అని చెబుతుంటారు. చంద్రబాబు పార్టీలో ప్రధాన వ్యక్తిగా మారడం, లక్ష్మీ పార్వతి ఎంట్రీ , తన వారే తనను మోసం చేయడం, ఇలా చివరి రోజుల్లో ఎంతో మానసిక వేదన అనుభవించాడు ఎన్టీఆర్... అవేమీ చూపించకుండా నాదెండ్ల భాస్కర్ రావు, ఢీల్లీతో చేసిన వార్ మాత్రమే చూపించి, అసంపూర్ణంగా ముగించి ప్రేక్షకులను కొంత నిరాశ పరిచారనే చెప్పాలి. ఒకవైపు ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని, మరోవైపు ఫ్యామిలీ అంశాలను , భార్యపై ప్రేమను చూపిస్తూ ఎమోషనల్ టచ్ ఇచ్చాడు దర్శకుడు. ఇది కమర్షియల్ గా ఎంత వరకు వర్కవుట్ అవుతుందనే అంశాన్ని పక్కన పెడితే.... కిలో బియ్యం రెండు రూపాయలకే , ఆస్తిలో ఆడబిడ్దలకు సగంవాటా అంటూ ఆడబిడ్డలను ఆకట్టుకుని ఇలా ప్రజలకు ఉపయోగపడే పలు పథకాలు ప్రవేశ పెట్టి, ప్రతి క్షణం ప్రజల హితం కోరే నాయకుడుగా, తెలుగు వాడి సత్తాను జాతీయ స్థాయిలో చాటి, ఢిల్లీనే కదిలించిన తెలుగువాడిగా ఓ `మహానాయకుడు`గా మనం ఎన్టీఆర్ ని మరోసారి తెరపై చూసి గర్వపడాల్సిందే..
రేటింగ్ః 3/5