మెగా ఫ్యామిలీకి బోయపోటు!?
on Jan 17, 2019
సంక్రాంతికి విడుదలైన 'వినయ విధేయ రామ'కు ఎక్కడా పాజిటివ్ టాక్ లేదు. మార్నింగ్ షో నుంచి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. సమీక్షల్లో (రివ్యూల్లో) సినిమాను ఏకిపారేశారు. ఇటువంటి సినిమా విడుదలైన తొలి నాలుగు రోజుల్లో సుమారు 42 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. మెగాభిమానులతో పాటు వ్యాపార వర్గాలు కూడా ఈ వసూళ్లను రామ్ చరణ్ ఖాతాలో వేస్తున్నారు. 'రంగస్థలం' విజయం తరవాత వచ్చిన సినిమా కనుక ఓపెనింగ్స్ ఈస్థాయిలో వచ్చాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ వసూళ్ల వెనుక దర్శకుడు బోయపాటి ఘనత ఏమీ లేదంటున్నారు. అదే సమయంలో అతడి దర్శకత్వ శైలిపై, సినిమాలో తీసిన సన్నివేశాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఈ సంక్రాంతి ముందు వరకూ ట్రైన్ ట్రోలింగ్ సీన్స్ అంటే బాలకృష్ణ 'పల్నాటి బ్రహ్మనాయుడు'లో సీన్ టాప్ ప్లేస్లో నిలిచేది. ఆ సన్నివేశానికి దగ్గర దగ్గరగా 'వినయ విధేయ రామ'లో హీరో ట్రైన్ మీద నిలబడి గుజరాత్ నుంచి బీహార్ వెళ్లే సన్నివేశాన్ని బోయపాటి తీశాడని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అదొక్కటే కాదు... ప్రతినాయకుణ్ణి పాము చనిపోయే సన్నివేశాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు. గాల్లోకి లేచిన తలల్ని గద్దలు పట్టుకోవడం ఏమిటని ప్రేక్షకులు తలలు పట్టుకుంటున్నారు. సినిమా విడుదలైన క్షణం నుంచి ఇవన్నీ ఇంటర్నెట్లో హాట్ టాపిక్గా మారాయి. రామ్ చరణ్ ఖాతాలో 'జంజీర్', 'బ్రూస్ లీ' వంటి ఫ్లాపులు ఉన్నాయి. కానీ, ఇంత ఇలా విమర్శలకు కారణమైన సన్నివేశాలు ఏ సినిమాలోనూ లేవు. బోయపాటి కావాలనే సిల్లీ సీన్స్ తీశాడని మెగాభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 'మెగా ఫ్యామిలీకి బోయపాటు'గా వర్ణిస్తున్నారు. మెగాభిమానుల ఆగ్రహాన్ని పక్కన పెడితే... మహిళా ప్రేక్షకులు కూడా బోయపాటి దర్శకత్వ శైలిపై కోపంగా ఉన్నారు. హీరోయిన్ ఇంట్రడక్షన్ సీన్ తీసిన విధానం పట్ల మహిళా ప్రేక్షకులు సంతోషంగా లేరు. మొత్తానికి విడుదలకు ముందు వసూళ్లతో చరిత్ర సృష్టిస్తుందని అనుకున్న సినిమా కాస్తా విడుదల తరవాత విమర్శలతో వార్తల్లోకి ఎక్కింది.