సందీప్ కిషన్ దర్శకుడికి అగ్ని పరీక్ష...
on Dec 17, 2018
ప్రస్థానం, స్నేహగీతం, రొటీన్ లవ్ స్టోరీ, గుండెల్లో గోదారి, వెంకటాద్రి ఎక్స్ప్రెస్... ఓ చిత్రానికీ, మరో చిత్రానికీ సంబంధం లేకుండా నటుడిగా, కథానాయకుడిగా ప్రయాణం ప్రారంభించిన తొలినాళ్లలో వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చకున్నాడు సందీప్ కిషన్. తరవాత తరవాత చేసిన సినిమాలు ప్లాప్ కావడంతో ప్రేక్షకుల్లో సందీప్ కిషన్ ఇమేజ్ కిందకు పడింది. ఇటీవల విడుదలైన 'నెక్స్ట్ ఏంటి?' కూడా ప్లాప్ అయ్యింది. ఈ నేపథ్యంలో సందీప్ కిషన్ తప్పకుండా ఓ హిట్ అందుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. అతడు హీరోగా నటిస్తూ, చిత్రనిర్మాణంలో పాలు పంచుకున్న 'నిను వీడని నీడను నేను' కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమాను పక్కన పెడితే... జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో సోమవారం 'తెనాలి రామకృష్ణ' సినిమా స్టార్ట్ చేశాడు. సందీప్ కిషస్తో పాటు దర్శకుడికీ ఈ సినిమా కీలకమే. 'ఆటాడుకుందాం రా', 'ఇంట్లో దెయ్యం నాకేం భయం', 'ఆచారి అమెరికా యాత్ర' సినిమాలతో ముచ్చటగా మూడు ప్లాపులను తన ఖాతాలో వేసుకున్నారు నాగేశ్వరరెడ్డి. అటు హీరోకి విజయాలు లేవు.. ఇటు దర్శకుడికీ విజయాలు లేవు. వీళ్ళిద్దరూ కలిసి చేస్తున్న ఈ సినిమా విజయం సాధిస్తే... ఇద్దరూ హిట్ ట్రాక్ ఎక్కవచ్చు. 'తెనాలి రామకృష్ణ'లో కథానాయికగా హన్సిక, కీలక పాత్రల్లో వరలక్ష్మీ శరత్ కుమార్, భూమిక నటిస్తున్నారు.