మహాలక్ష్మీ... మీ దర్శకుడు ఎవరు?
on Oct 20, 2018
ఓ సినిమాకు ఇద్దరు దర్శకులు పని చేస్తే వచ్చే సమస్య ఇదే! టైటిల్ కార్డ్స్లో ఎవరి పేరు వేయాలో తెలియక నిర్మాత తల పట్టుకోవాలి. తమన్నా మెయిన్ లీడ్గా నటిస్తున్న ‘దట్ ఈజ్ మహాలక్ష్మి’ నిర్మాతకు ఇటువంటి సమస్యే ఎదురైంది. సాధారణంగా మొదటి దర్శకుడితో గొడవల కారణంగా అతణ్ణి సినిమా నుంచి తప్పిస్తే... అతడి స్థానంలో వచ్చి సినిమా పూర్తి చేసిన వ్యక్తి పేరు దర్శకుడిగా ప్రకటించిన సందర్భాలు కొన్ని వున్నాయి. కానీ, ప్రశాంత్ వర్మకు తన పేరు చెప్పుకోవడం సుతరామూ ఇష్టం లేదట! దీనికి తోడు నీలకంఠ దర్శకత్వం వహించిన సన్నివేశాలు సినిమాలో కొన్ని ఉన్నాయి. ఒక దర్శకుడి పేరు వేసి, మరో దర్శకుడిది వేయకపోతే వివాదం అవుతుంది. ప్రశాంత్ వర్మ తన పేరు వేయవద్దని అంటున్నారు. నీలకంఠ పేరు వేయమని అడగరు. అందుకని, తెలివిగా ఇద్దరి పేర్లు వేయలేదు.
మొదట నీలకంఠ దర్శకత్వంలో ‘క్వీన్’ టైటిల్తో ‘దట్ ఈజ్ మహాలక్ష్మి’ మొదలైంది. అతడితో తమన్నాకు చెడింది. తేడాలు రావడంతో నీలకంఠను తప్పించి, ‘అ!’తో దర్శకుడిగా పరిచయమైన ప్రశాంత్వర్మ చేతిలో సినిమా పెట్టారు. అతను వచ్చీ రావడమే టైటిల్ మార్చాడు. కొన్ని సన్నివేశాలు మార్చి తన స్టయిల్లో తీశాడు. ఇదంతా ఓపెన్ సీక్రెట్. నీలకంఠను తప్పించిన తరవాత మిగతా సినిమాను ప్రశాంత్వర్మ పూర్తి చేశాడని పరిశ్రమ వర్గాలతో పాటు ప్రేక్షకులకు తెలుసు. కానీ, దసరా సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్, ప్రెస్నోట్లో దర్శకుడి పేరు లేదు. ఈ విషయమై సినిమా యూనిట్ సభ్యులను మీడియా ప్రశ్నించగా... దర్శకుడి పేరు రాయవద్దనే జవాబు వచ్చింది. మీడియాను రిక్వెస్టు చేశారు.