నాగార్జున 'నో' చెప్పారు... అఖిల్ 'ఎస్' అన్నాడా?
on Oct 16, 2018
ఓ నాలుగైదు సంవత్సరాల క్రితం ముచ్చట... అక్కినేని నాగార్జున కథానాయకుడిగా ఓ సినిమాకు దర్శకత్వం వహించాలని దర్శకుడు బోయపాటి శ్రీను ప్రయత్నాలు చేశారు. నాగార్జున దగ్గరకు వెళ్లి కథ కూడా చెప్పారు. కానీ, సినిమా సెట్ కాలేదు. ఎందుకంటే... బోయపాటి ఊర మాస్ దర్శకుడు. నాగార్జున మాంచి క్లాస్ హీరో. బోయపాటి కథ తనకు సెట్ కాదని నాగార్జున భావించారు. అతడి ప్రతిపాదనకు 'నో' చెప్పారు. ఇప్పుడు అదే దర్శకుడికి నాగార్జున రెండో కుమారుడు అఖిల్ 'ఎస్' చెప్పారని ఫిల్మ్ నగర్ టాక్. మొదటి నుండి అఖిల్ మాస్ ఇమేజ్ కావాలని కోరుకుంటున్నారు. అందుకనే వీవీ వినాయక్ దర్శకత్వంలో 'అఖిల్' చేశారు. కానీ, అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఎంతో ఆలోచించి ఆలోచించి విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 'హలో' చేశారు. కాస్త పర్వాలేదు అనే పేరు వచ్చింది. ప్రస్తుతం 'తొలిప్రేమ' ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'మిస్టర్ మజ్ను' చేస్తున్నాడు. ఇది పూర్తిగా ప్రేమకథా చిత్రం. అందుకని దీని తరవాత పూర్తి మాస్ సినిమా చేయాలని అఖిల్ నిర్ణయించుకున్నాడని సమాచారం. 'సరైనోడు'తో బన్నీని మాస్ హీరోగా చూపించిన బోయపాటి అందుకు సరైన దర్శకుడు అని ఫిక్స్ అయ్యాడట!! 'మిస్టర్ మజ్ను' తరవాత బోయపాటి సినిమా స్టార్ట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.