కొడుకు కోసం ఇల్లు అమ్ముకున్న పూరి...
on Apr 18, 2018
టాలీవుడ్లో స్టార్ స్టేటస్ అనుభవించిన, అనుభవిస్తున్న దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకరు. ఇప్పుడైతే ఆ జోరు తగ్గింది గానీ, ఇది వరకు అత్యంత ఖరీదైన దర్శకుడిగా.. జీవితాన్ని ఎంజాయ్ చేశారు. హిట్లు అలానే వచ్చాయి, పారితోషికమూ అలానే తీసుకున్నారు. పూరి ఆఫీసు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. టాలీవుడ్ లో ఏ దర్శకుడికీ లేనంత అధునాతనమైన, ఆకర్షణీయమైన ఆఫీస్ పూరి సొంతం. అలాంటి పూరి ఇప్పుడు తన సొంత ఇంటిని అమ్ముకోవాల్సివచ్చింది. అదీ.. తన తనయుడు ఆకాష్పూరి కోసం. పూరి ఈమధ్య వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. పూరి తో సినిమా చేయడానికి బయటి నిర్మాతలెవరూ ధైర్యం చేయడం లేదు. సొంత బ్యానర్లో తీసిన సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఈ దశలో కొడుకుని హీరోగా ప్రమోట్ చేయడానికి పూరి స్వయంగా రంగంలోకి దిగాల్సివచ్చింది. హైదరాబాద్లోని తన ఇంటికి రూ.21 కోట్లకు పూరి అమ్మేశాడని, ఆ డబ్బుతోనే `మెహబూబా` సినిమా తీశాడని తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఇప్పుడు దిల్ రాజు కొనుక్కున్నారు. ఇప్పటికే పూరికి టేబుల్ ప్రాఫిట్ దక్కిందని సమాచారం. దిల్ రాజు ఇచ్చిన డబ్బులతో పూరి ఇప్పుడు హైదరాబాద్లో మరో ఇల్లు కట్టడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. సినిమా అంటేనే అంత. ఆస్తులు, అప్పులు రెండింటిలో ఏది ఎటువైపు తూగుతుందో తెలీదు. పూరి జీవితం కూడా అంతే.