మోడీపై, కొరటాల వ్యాఖ్యల వెనుక మర్మం ఏమిటి?
on Mar 8, 2018
ఢిల్లీ పెద్దలు ఆంధ్రప్రదేశ్ పట్ల వ్యవహరిస్తున్న తీరు తెలుగు వాడు సహనం కోల్పోయేలా చేస్తుంది. ఇప్పటికే కొన్ని ఉద్యమాలతో సెంటర్ పై వత్తిడి తెచ్చే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు దిగిరాకపోవడంతో, టీడీపీ లోని ఇద్దరు కేంద్ర మంత్రులు తమ పదవులకి రాజీనామా చేశారు. ఇక ముందు తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేసే ఆలోచనలో ఉన్నారు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ ప్రతి ఒక్కరిని కలచి వేసింది. ఈ తరుణంలో, దర్శకుడు కొరటాల శివ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పై తీవ్ర విమర్శలు చేసాడు. మోడీకి తాను చేసిన ప్రమాణాలు గుర్తుచేసి ఆయన్ని మగాణ్ణి చేద్దాం అని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
అయితే, కొరటాల వ్యాఖ్యల్ని కొందరు తప్పుపడుతున్నారు. ప్రభుత్వం పై వ్యతిరేకత ప్రదర్శించడం వరకు ఓకే కానీ ప్రధానమంత్రిని మగాడు కాదు అని మాట్లాడటం సరి కాదు అంటున్నారు. కొరటాల ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా మాట్లాడటం లేదు అని, టీడీపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నాడని విమర్శిస్తున్నారు. ఇదంతా, చంద్రబాబు నాయుడు మెప్పు పొందడం కోసం మరియు మహేష్ బాబు తో చేస్తున్న భరత్ అనే నేను సినిమాని ప్రమోట్ చేయడం కోసం చేస్తున్న చర్య అని అంటున్నారు.
భరత్ అనే నేను రాజకీయ నేపథ్యంతో తీస్తున్న సినిమా. ఇందులో మహేష్ బాబు ముఖ్యమంత్రి గా కనిపించనున్నాడు. రాజకీయ నాయకులు చేస్తున్న తప్పుడు ప్రమాణాలు... దానివల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి ఈ సినిమా చర్చిస్తుంది అని అంటున్నారు. చంద్రబాబు లాంటి వారు భారత్ అనే నేనుకి ఏదో విధంగా తన మద్దతు తెలియజేస్తే, బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామి క్రియేట్ చేయడం ఖాయం... సో, బాబు మెప్పు కోసమే శివ ఇదంతా చేస్తున్నాడని వారి వాదన.
అయితే, కొందరు మాత్రం కొరటాల వ్యాఖ్యల్లో తప్పేం లేదని... మోడీ తాను చేసిన ప్రమాణాలు పూర్తిగా మరచిపోయాడని... ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని... అందుకు కేంద్రం ఒప్పుకోకపోతే, దిగివచ్చే వరకు ఉద్యమం చేస్తామని పార్టీల కతీతంగా హెచ్చరిస్తున్నారు.
Also Read