మహానటి కోసం...ఎన్టీఆర్, ఏఎన్నార్లను సృష్టించారు!
on Mar 7, 2018
ఇప్పుడు చిత్రసీమలో అందరి దృష్టీ `మహానటి` సినిమాపైనే ఉంది. సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఇది. సావిత్రి కథ అంటే... అందులో బోలెడన్ని విశేషాలుంటాయి. ఎంతోమంది స్టార్లు కనిపిస్తారు. మళ్లీ మనల్ని మాయాబజార్ నాటి జమానాకి తీసుకెళ్లిపోతారన్నమాట. అందుకే.... ఈ సినిమాపై అంతగా ఫోకస్ పడింది. సావిత్రి జీవిత కథని సినిమాగా తెరకెక్కించడం మాటలు కాదు. అందులో చాలామంది స్టార్స్ని సజీవంగా చూపించాలి. మరీ ముఖ్యంగా ఎన్టీఆర్, ఏఎన్నార్లను. వాళ్ల పాత్రలు పోషించే శక్తి... వారసులకే ఉంది. ఎన్టీఆర్పాత్ర చేయడానికి జూ.ఎన్టీఆర్ వెనుకంజ వేశాడు. అక్కినేనిగా కనిపించడానికి నాగచైతన్య కూడా కాస్త భయపడ్డాడు. దాంతో ఈ రెండు పాత్రల్లో ఎవరు కనిపిస్తారా అంటూ అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
ఇక్కడే.. మహానటి బృందం గ్రాఫిక్స్ జిమ్మిక్కులను నమ్ముకుంది. ఎన్టీఆర్, ఏఎన్నార్ల పాత్రల్ని ఎవరితోనో వేయించడం ఎందుకు? వాళ్లనే కిందకి దింపేస్తే పోలా..? అనుకుంది. అందుకోసం గ్రాఫిక్స్ ని నమ్ముకున్నట్టు టాక్. ఎన్టీఆర్, ఏఎన్నార్ నటించిన పాత సినిమాలోని క్లిప్పుంగులను ఈ సినిమా కోసం యధావిధిగా వాడుకోబోతున్నారన్నమాట. మగధీరలో చిరంజీవిని చూపించడానికి బంగారు కోడి పెట్టలోని స్టెప్పుల్ని వాడుకున్నారుగా. సేమ్ టూ సేమ్ అలాగన్నమాట. ఈ ప్రయత్నం ఫలిస్తే... బయోపిక్ సినిమాల్లో ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినట్టే. ఇక ఎవరి బయోపిక్ తీయాలన్నా.. గ్రాఫిక్స్ని హాయిగా నమ్ముకోవొచ్చు.