‘మహానటి’లో మహాదర్శకుడు ఎవరు?
on Oct 16, 2017
ప్రస్తుతం బయోపిక్ లు రాజ్యమేలుతున్నాయ్. ఈ కారణంగా... కొందరు మహనీయులుగా నేటి నటులు నటించాల్సిన పరిస్థితి. జనాల్లో కూడా ఆయా వ్యక్తులుగా ఎవరు కనిపిస్తారు? అనే ఆసక్తి మెండుగా ఉంది. ప్రధాన పాత్రలంటే ఎవరో ఒకర్ని సెలక్ట్ చేసేస్తారు. కానీ.. వాటిల్లో కీలకమైన ఇంకొన్ని పాత్రలుంటాయ్. అవి కూడా బహుళ ప్రజాదరణ పొందిన పాత్రలే అయ్యుంటాయ్. దాంతో ఆ పాత్రల్లో నటించే నటులపై కూడా ఆసక్తి ఎక్కువగా ఉండటం కామన్. ఇలాంటి విషయంలో అన్ని సినిమాలకంటే ముందు నిలిచిన సినిమా ‘మహానటి’. ఎందుకంటే... సావిత్రి జీవితం రంగుల మయం. అలనాటి మద్రాసు సినీ వైభవం మొత్తం ఆమె కథలోనే ఉంటుంది. మహామహులందరూ ఆమె జీవితంలో భాగస్తులే. మరి వారందరూ ఈ కథలో కనిపించాలి కదా. ఎవరెవరు ఏ ఏ పాత్రలు పోషిస్తున్నారు? అనేది ఇంకా బయటకు రాని విషయం.
ఇందులో సావిత్రిగా కీర్తి సురేశ్ నటిస్తున్న విషయం తెలిసిందే. సావిత్ర భర్త.. ప్రముఖ తమిళ నటుడు జెమినీ గణేశన్ గా మలయాళ స్టార్ దుల్హన్ సల్మాన్ నటిస్తున్నాడు. ఇంకా ఎన్టీయార్ ఎవరూ? ఎస్వీయార్ ఎవరూ? ఏఎన్నార్ ఎవరూ? ఇంకా అతిరథ మహారథులు చాలామంది ఉన్నారు. వారందరూ ఎవరూ..? అనేది ఇప్పుడు అందరి మనసుల్లో మెదులుతున్న ప్రశ్నలు. వాటిలో కొన్నింటికి సమాధానం దొరికింది. ఆ వివరాలను ‘తెలుగువన్’ ఎక్స్ క్లూజివ్ గా మీకందిస్తోంది.
సావిత్రి కథలో ఎన్టీయార్, ఏఎన్నార్, ఎస్వీయార్లకు ఎంత ప్రాముఖ్యత ఉందో... దిగ్దర్శకులు కె.వి.రెడ్డి, ఎల్వీ ప్రసాద్ లకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే.. సావిత్రి తొలి సినిమా ‘సంసారం’ దర్శకుడు ఎల్వీ ప్రసాద్. సావిత్రిని సూపర్ స్టార్ చేసిన దొంగరాముడు, మాయాబజార్ చిత్రాల దర్శకుడు కె.వి.రెడ్డి. మరి ఆ పాత్రలు ఎవరు చేస్తున్నారు? అనే విషయానికొస్తే... ఇందులో ఎల్వీ ప్రసాద్ గా అవసరాల శ్రీనివాస్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఎల్వీ ప్రసాద్, సావిత్రికి సంబంధించిన సీన్లన్నీ చిత్రీకరించడం జరిగిపోయింది.
ఇక కె.వి.రెడ్డి... సావిత్రి జీవితంలో చాలా ప్రముఖమైన పాత్ర ఆయనది. ఆ పాత్రను ఎవరు చేస్తారు? అనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్న ప్రశ్న. అయితే... ఈ పాత్రను నటుడెలెవ్వరూ చేయడం లేదు. ఓ దర్శకుడు కె.వి.రెడ్డి పాత్రను పోషించనున్నారు. ఆయన ఎవరో చెప్పేముందు.. ఆయన గురించి కొన్ని వివరాలు చెప్పాలి. ఆ దర్శకుని కథలు సమకాలీన సమస్యల నేపథ్యంలో సాగుతాయ్. ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనాన్ని చూపించడానికి తపించే దర్శకుడు తను. ఎస్.ఎస్. రాజమౌళి తర్వాత... సాంఘీకేతర చిత్రాన్ని తీసి ఘన విజయం అందుకున్న ఏకైక దర్శకుడు ఆయనే. ఆయన ఎవరో మీకు ఈ పాటికే అర్థమై వుండాలి. ఎస్... జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్).
ఓ మహాదర్శకుని పాత్రను.. ప్రతిభావంతుడైన మరో గొప్పదర్శకుడు పోషించడం ఇక్కడ విశేషం. త్వరలో క్రిష్ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అసలు టెన్షన్ ఇంకా తీరలేదు. అదే.. ఎన్టీయార్, ఏఎన్నార్లుగా ఎవరు చేస్తారు? అని. దానికి తారక్ ఫారిన్ టూర్ ముగించుకొని వచ్చిన తర్వాత కానీ... క్లారిటీ రాదు. ఎన్టీయార్ గా తారక్ తో నటింపజేయాలని దర్శక, నిర్మాతలు చాలా గట్టి పట్టుమీద ఉన్నారు. ఇక అక్కినేనిగా చైతూ ఎలాగూ ఉన్నాడుగా!