కాస్తయితే చచ్చేవాడు!
on Sep 22, 2017
తాగి వాహనాలు నడపొద్దంటూ ఓ వైపు ప్రభుత్వం మొత్తుకుంటోంది. సెలబ్రిటీలతో ఈ విషయంపై సెమినార్లు కూడా ఏర్పాటు చేస్తోంది. తాగి వాహనం నడిపడం వల్ల జరిగే దుష్ప్రలితాలను వివరిస్తూ... సినిమాల్లో ప్రకటనలు కూడా గుప్పిస్తున్నారు. ఇన్ని చూసైనా... కొందరికి బుద్ధి రావడంలేదు. సామాన్యులు.. కుర్రకారు.. ఇలాంటి వెధవ పనులకు తెగబడుతున్నారంటే... అర్థముంది? పదిమందికి చెప్పాల్సిన సెలబ్రిటీలు కూడా తాగి కార్లని డ్రైవ్ చేస్తుంటే... దీన్ని ఎలా తీసుకోవాలి?
గతంలో కూడా చాలామంది సినిమా సెలబ్రిటీలు మద్యం మత్తులో కారు నడిపి.. పోలీసులతో చీవాట్లు తిన్న సందర్భాలు లేకపోలేదు. రీసెంట్ గా తమిళ హీరో ‘జై’ కూడా.. ఈ ఘనకార్యమే చేశాడు. సాటి నటుడు ప్రేమజీతో కలిసి ఫూటు తాగి.. తమిళనాడులోని మండవల్లి అడయార్ బ్రిడ్జ్ పై యాక్సిడెంట్ చేశాడు. మద్యం మత్తులో.. ఆడీ కారు నడుపుతూ... దాన్ని సూటిగా తీసుకెళ్లి బ్రిడ్జి గోడకు గుద్దాడు. కారు మాత్రం నుజ్జునుజ్జు అయ్యింది కానీ... లోపలున్న ఇద్దరికీ ఏమీ కాలేదు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటన సంఘటనా స్థలానికి వచ్చి... ‘జై’ని కొట్టినంత పనిచేశారు. 500 రూ. జరిమానా విధించి వదిలిపెట్టారు.
కారెళ్లి బ్రిడ్జి గోడకు గుద్దుకుంది కాబట్టి సరిపోయింది. ఎదురుగా వస్తున్న వేరే వాహనానికి గుద్ది ఉంటే... ఆ వాహనంలో చిన్నపిల్లలుంటే.. బాధ్యత ఎవరిది? కుటుంబాలు కుటుంబాలు నాశనమైపోవడమేగా? సినిమాల్లో నీతులు చెబితే సరిపోదు. బయటకూడా రెస్పాన్సిబులిటీగా ఉండాలి. లేకపోతే.. సమాజం క్షమించదు. సెలబ్రిటీలూ... ఖబడ్దార్.