మెగా యంగ్ స్టర్స్ ముగ్గురితో...?
on Jul 26, 2017
లావణ్య త్రిపాఠి అద్భుతమైన ఆఫర్ కొట్టేసిందని ఫిలిం నగర్ టాక్. ఇప్పటికే మెగా కాంపౌండ్ హీరోలతో.. శ్రీరస్తు శుభమస్తు, మిస్టర్ చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ త్వరలో మరో మెగా యంగ్ హీరోతో జతకట్టనుందట. వివరాల్లోకెళ్లే.... సాయిధరమ్ తేజ్, వి.వి.వినాయక్ కాంబినేషన్ లో ఓ చిత్రం రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘దుర్గ’ అనే వర్కింగ్ టైటిల్ ని కూడా నిర్ణయించారు వినాయక్. ఇందులో కథానాయికగా లావణ్య త్రిపాఠి ఎంపిక చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ‘ఖైదీ నంబర్ 150’ తర్వాత వినాయక్ చేయనున్న సినిమా అంటే.. దాని అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాలా? మరి అలాంటి సినిమాలో ఆఫర్ అంటే... లావణ్య నిజంగా లక్కీనే అంటున్నారంతా.
‘శ్రీరస్తు శుభమస్తు’చిత్రం ద్వారా అల్లు శిరీష్ కి తొలి సక్సెస్ ని ఇచ్చిన ఈ బెంగాలీభామ... ఆ తర్వాత మరో మెగా హీరో వరుణ్ తేజ్ తో ‘మిస్టర్’చేసి పప్పులో కాలేసింది. ఇప్పుడు మెగా కాంపౌండ్ లోని మరో యువ హీరో సాయిథరమ్ తేజ్ తో జతకట్టనుంది. ఇదే నిజమైతే... ఈ సినిమాతో మెగా యంగ్ స్టర్స్ ముగ్గురితో నటించిన క్రెడిట్ లావణ్యకు దక్కినట్టే. ఆకుల శివ రచన చేస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం ఆగస్ట్ 9న జరగనున్నట్లు సమాచారం. వి.వి.నాయక్, ఆకుల శివ కాంబినేషన్లో వచ్చిన ‘కృష్ణ’ఎంత హిట్టో తెలిసిందే. ఈ సినిమా కూడా ‘కృష్ణ’తరహాలో కామెడీ మాస్ ఎంటర్టైనర్ గా సాగుతుందని వినికిడి.