"ఎప్పుడో" చేసిన తప్పులు..తప్పడంలా తిప్పలు..!
on May 26, 2017
స్నేహితులతోనో, బంధువులతోనో సరదాగా కబుర్లు చెబుతున్నప్పుడు ఎప్పుడో మనం చేసిన పనులో, అన్న మాటలో గుర్తొచ్చి నవ్వుకుంటూ ఉంటాం. ఒకవేళ అవి బాధపెట్టే మాటలైతే నువ్వు అప్పుడు అలా అన్నావు రా..ఇలా అన్నావు రా అని కాస్త ఫీలవుతాం. ఇప్పుడు ఆ "ఎప్పుడో" అన్న పదం సత్యరాజ్కు అదేనండి మన కట్టప్పకు లేనిపోని కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. తొమ్మిదేళ్ల క్రితం కావేరీ నదీ జలాల విషయంలో తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్న సమయంలో సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయన ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురుచూసిన కన్నడ సంఘాలకు బాహుబలి రూపంలో అవకాశం వచ్చింది.
సత్యరాజ్ క్షమాపణ చెబితే కానీ బాహుబలి-2ని కర్నాటకలో విడుదల కానిచ్చేది లేదని కన్నడ పరిరక్షణ వేదికలు హెచ్చరించాయి. దీంతో చేసేది లేక సత్యరాజ్ బహిరంగంగా క్షమాపణలు చెప్పాడు. ఆ వివాదం ముగిసిందో లేదో కట్టప్ప మళ్ళీ చిక్కుల్లో పడ్డాడు. ఆయన "ఎప్పుడో" అన్న మాటలు గుర్తొచ్చిన కొందరు తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ఇప్పుడు కోర్టును ఆశ్రయించారు. 2009లో జర్నలిస్టులను కించపరిచే విధంగా దూషించారంటూ దాఖలైన కేసులో విచారణకు హాజరు కానందున సత్యరాజ్, సూర్య, శరత్ కుమార్ సహా 8 మంది నటీనటులపై నీలగిరి కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఇప్పుడు దీనిని రద్దు చేయాలంటూ సత్యరాజ్ నీలగిరి కోర్టులో పిటిషన్ వేశారు. ఇది చూసిన వారంతా కట్టప్ప ఎప్పుడు ఏమన్నాడో గుర్తు తెచ్చుకుని ఇప్పుడే క్షమాపణలు చెబితే మంచిదంటున్నారు.