శాతకర్ణిని దెబ్బకొట్టిన క్రిష్ నిర్ణయం
on Jan 24, 2017
ఈ సంక్రాంతి సమరాన్ని చిరంజీవి, నందమూరి బాలకృష్ణ ల వార్ గా అభివర్ణించింది టాలీవుడ్. అనుకొన్నట్టుగానే ఈ ఇద్దరి హీరోల సినిమాలు... బాక్సాఫీసు దగ్గర నువ్వా నేనా అన్నట్టు పోటీ పడ్డాయి. లెక్కలన్నీ తిరగేసి, వసూళ్లన్నీ పరిశీలిస్తే.. బాలయ్యపై చిరు హవా స్పష్టంగా కనిపిస్తోంది. చిరు సినిమా ఎప్పుడో వంద కోట్లు దాటేసింది. బాలయ్య సినిమా రూ.50 కోట్ల మైలు రాయి దగ్గరే ఉంది. అయితే విమర్శకుల ప్రసంశలు, ఇండ్రస్ట్రీ మెచ్చుకోళ్లు బాలయ్య సినిమాకే దక్కుతున్నాయి. అలాంటప్పుడు కూడా చిరు సినిమా వసూళ్లు సాధించడానికి కారణం.. క్రిష్ తీసుకొన్న అనాలోచితమైన నిర్ణయమే అనేది నందమూరి అభిమానుల మాట. ఎందుకంటే చిరు సినిమా జనవరి 11న వచ్చింది. 12న శాతకర్ణి విడుదలైంది. ఒక్కరోజు ముందు తన సినిమాని విడుదల చేసి అడ్వాంటేజ్ తీసుకొన్నాడు చిరు.
తొలి రోజే చిరు సినిమా ఏకంగా నలభై కోట్ల గ్రాస్ సాధించి ఇండ్రస్ట్రీని ఆశ్చర్యపరిచింది. తొలి రోజు రావడం వల్ల కావల్సినన్ని థియేటర్లు కూడా దొరికేశాయి. చిరు సినిమా 11న వస్తుందని ఎప్పుడైతే తెలిసిందో.. అప్పుడే క్రిష్పై ఒత్తిడి పెరిగింది. `మన సినిమానీ 11నే విడుదల చేద్దాం` అని అభిమానులు పట్టుపట్టారు. అలా చేస్తే... చిరుకి కావల్సినన్ని థియేటర్లు దొరికేవి కావు. వసూళ్లూ ఈ స్థాయిలో ఉండేవి కావు. చిరుతో పోటీగా బాలయ్య సినిమాకి వసూళ్లు దక్కేవి. కానీ క్రిష్ ఫ్యాన్స్ మాట వినలేదు. అందుకే.. వసూళ్ల పోటీలో చిరు ఎక్కడో ఉంటే.. బాలయ్య ఇంకెక్కడో ఉండాల్సివచ్చింది. తమ హీరోకి అద్భుతమైన విజయాన్ని అందించినా... తమ మాట వినలేదన్న కోపం క్రిష్పై ఉండే ఉంటుంది. మరి దీనిపై క్రిష్ ఎలా స్పందిస్తాడో చూడాలి.