పవన్ అభిమానులు.. నయీమ్తో సమానమా?
on Sep 24, 2016
తమ్మారెడ్డి భరద్వాజా... టాలీవుడ్లో సంచలన వ్యాఖ్యలకు ఈ పేరు ఓ చిరునామా. ప్రచారం కోసమో ఏమో తెలీదు గానీ కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడడం, పెద్ద హీరోల్ని టార్గెట్ చేయడం తమ్మారెడ్డి ఆనవాయితీ. ఈసారీ అదే ఫాలో అయిపోయారు. ఏకంగా పవన్ కల్యాణ్ అభిమానులలపై పడ్డారు. పవన్ రాజకీయాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారీ పెద్దాయన. ప్రత్యేక హోదా కోసం పవన్ రోడ్డుపైకి వస్తే రాష్ట్రం అల్లకల్లోలం అయిపోతుందని పవన్ పై జనాలకున్న మూర్ఘత్వాన్ని అభిమానం అని పిలుచుకొంటున్నారని కౌంటర్లు వేశారు. ఒక్కసారి వవన్ బయటకు వస్తే.. పరిస్థితి చేయి దాటిపోతుందని, అందుకు కాకినాడ సభే ఉదాహరణ అని.. ఈ సభకు హాజరైన ఓ అభిమాని చనిపోయిన ఉదంతాన్ని గుర్తు చేశారు తమ్మారెడ్డి. పవన్ వల్ల ప్రభుత్వాలు తలకిందులైపోయే పరిస్థితి లేదని... వ్రేలు కదిపితే మాట వినే రోజులు పోయాయన్నారాయన. పవన్ అభిమానుల్లో ఎక్కువమంది 18 సంవత్సరాల లోపు వారే. అయితే వాళ్ల వల్లే ఎక్కువ ప్రమాదం ఉందని... ప్రతి నియోజకవర్గం నుంచి 5 వేలమంది రోడ్డుమీద కొస్తే.. పరిస్థితులు అదుపులో ఉండవని.. ఒక్క నయీమ్ పేరు చెప్తేనే రాష్ట్రం అంతా గడగడలాడిందని.. 5 వేల మంది అంటే అర్థం చేసుకోవాలని పవన్ అభిమానుల్ని నయీమ్తో పోల్చడం.. అందరికీ షాక్ ఇచ్చింది. తమ్మారెడ్డి కౌంటర్లు.. కాస్త హద్దు దాటినట్టే అనిపిస్తున్నాయి. అభిమానాన్ని మూర్ఘత్వంగా మార్చడం, నయీమ్తో పోల్చడం ఇవన్నీ ఘాటుగానే అనిపిస్తున్నాయి. మరి... వీటిపై పవన్ అభిమానుల స్పందన ఎలా ఉంటుందో? చూస్తుంటే తమ్మారెడ్డి కావాలనే పవన్ అభిమానులతో పెట్టుకొన్నట్టు తోస్తోంది వ్యవహారం. ఇది ఎంత వరకూ వెళ్తుందో చూడాలి.