బెల్లంకొండ ఆఫీసు తాళాలు మళ్ళీ తెరుచుకున్నాయి!
on Jun 28, 2016
తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ ను కథానాయకుడిగా నిలబెట్టాలన్న తపనతో ఖర్చుకు వెనకాడకుండా కోట్ల రూపాయలు వెచ్చించి బెల్లంకొండ సురేష్ నిర్మించిన "అల్లుడు శీను, స్పీడున్నోడు" సినిమాలు కమర్షియల్ గా వర్కవుట్ అవ్వలేదు. దాంతో పెట్టిన పెట్టుబడి మొత్తం బూడిదలో పోసిన పన్నీరలా తయారయ్యింది. సినిమాకి డబ్బులు తిరిగిరాలేదు కదా అని అప్పు ఇచ్చిన బ్యాంక్ వాళ్ళు ఊరుకోరు కదా.. వెంటనే ఫిలిమ్ నగర్ లో ఉన్న బెల్లంకొండ సురేష్ ఆఫీసుని సీజ్ చేసి సీల్ వేసి వేలానికి వేస్తామని నోటీసులు పంపారు. దాంతో.. ఇక బెల్లంకొండ చాప్టర్ క్లోజ్ అని చాలామంది అనుకొన్నారు. ఇల్లు కూడా వేలానికి రావడంతో బెల్లంకొండ ఫ్యామిలీ మొత్తం ఓ హోటల్ లో ఉంటున్నారని కథనాలు కూడా వెలువడ్డాయి.
అయితే.. నిన్న ఫిలిమ్ నగర్ లోని బెల్లంకొండ సురేష్ ఆఫీస్ తాళాలకు "కోటక్ మహేంద్ర బ్యాంక్" వారు వేసిన సీల్ లేకపోవడంతోపాటు.. ఆఫీస్ కూడా తెరిచి ఉండడంతో చిత్ర పరిశ్రమకు చెందిన చాలా మంది ఆశ్చర్యపోయారు. త్వరలో తన తనయుడు శ్రీనివాస్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా మొదలుకానుండడంతో.. బెల్లంకొండ బ్యాంక్ వారి అప్పు మొత్తం చెల్లించి ఆఫీసును తిరిగి దక్కించుకొన్నాడని టాక్. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన రకుల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ నుంచి సెట్స్ కు వెళ్లనుంది. సో, బెల్లంకొండ ఈజ్ బ్యాక్ అన్నమాట!