రిపబ్లిక్ టీవీ ఎడిటర్-ఇన్-చీఫ్, న్యూస్ యాంకర్ అర్నబ్ గోస్వామిపై ఓ ఫిల్మ్ తీయనున్నట్లు రామ్గోపాల్ వర్మ ప్రకటించారు. ఆ సినిమా పేరు 'అర్నబ్: ద న్యూస్ ప్రాస్టిట్యూట్' అని వెల్లడించారు. వరుసగా చేసిన పలు ట్వీట్ల ద్వారా అర్నబ్పై తనకెంత కోపముందో తెలియజేసిన వర్మ, ఆయనపై ఎందుకు ఫిల్మ్ తీస్తున్నారో చెప్పారు. బాలీవుడ్ రైజింగ్ స్టార్ సుశాంత్సింగ్ రాజ్పుత్ ఆకస్మిక మృతి ఉదంతం బాలీవుడ్ పనితీరుపై తీవ్ర చర్చకు దారితీసింది.
"అర్నబ్ గోస్వామి బాలీవుడ్ గురించి దారుణంగా మాట్లాడటం నన్ను షాక్కు గురిచేసింది. దానిని ఆయన ఎప్పుడూ చూడని డర్టీయెస్ట్ ఇండస్ట్రీ అనీ, పూర్తిగా రేపిస్టులు, గ్యాంగ్స్టర్లు, సెక్సువల్ ఎక్స్ప్లాయిటర్స్తో నిండి ఉంటుందనీ చెప్పాడు. దివ్యభారతి, జియా ఖాన్, శ్రీదేవి, సుశాంత్ మరణాలను ఒకే గాటన కట్టి, బాలీవుడ్డే వాళ్లను హత్య చేసిందంటాడు. సందర్భవశాత్తూ ఆ నాలుగు మరణాలు సంభవించింది దాదాపు 25 సంవత్సరాల స్పాన్లో.. ఆ నలుగురూ పూర్తిగా భిన్నమైన వ్యక్తులు, వాళ్ల పరిస్థితులు పూర్తిగా భిన్నమైనవి. కానీ అర్నబ్ మైండ్లో ఆ నలుగురూ ఒక్కరే.. వాళ్లను చంపింది బాలీవుడ్డే" అని వర్మ ట్వీట్ చేశారు.
"అర్నబ్ గోస్వామిపై ఫిల్మ్ తియ్యాలని నిర్ణయించుకున్నాను. అతని ముసుగు తొలగించి, అతని అవినీతి గణాంకాల పొడవు వెడల్పులను నగ్నంగా చూపిస్తాను" అని ఆర్జీవీ ప్రకటించారు. "అతనిని నిశితంగా స్టడీ చేశాక ట్యాగ్లైన్గా 'ద న్యూస్ పింప్' అని పెట్టాలా లేక 'ద న్యూస్ ప్రాస్టిట్యూట్' పెట్టాలా అని మల్లగుల్లాలు పడ్డాను. రెండూ అతనికి సరిపోయేవే. చివరకు సౌండ్ బాగుందని ప్రాస్టిట్యూట్ అని పెట్టడానికే నిర్ణయించుకున్నా. ఈ ట్వీట్లలో అతడిని వర్ణించడానికి కొంత కఠినమైన భాషను ఉపయోగించానని నాకు తెలుసు. అర్నబ్ గోస్వామి లాంటి మురికి నోరున్నవాడికి అది కరక్టేనని భావిస్తున్నా" అని చెప్పుకొచ్చారు వర్మ.