సోషల్ మీడియా పోస్టులతో మత ఉద్రిక్తతలను రేకెత్తిస్తున్నారనే ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ముంబై పోలీసుల ముందు హాజరవ్వాలని కంగనా రనౌత్, ఆమె అక్కయ్య రంగోలి చందేల్లను బాంబై హై కోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. అప్పటి వరకు ఆ అక్కాచెల్లెళ్లపై ఎట్లాంటి నిర్బంధ చర్యలూ తీసుకోరాదని ముంబై పోలీసులను కోర్టు ఆదేశించింది.
తమ సోషల్ మీడియా పోస్టుల ద్వారా హిందువులు, ముస్లింల మధ్య మధ్య ఉద్రిక్తతలను రేకెత్తిస్తున్నారనీ, వైషమ్యాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారనీ ఆరోపిస్తూ కంగన, రంగోలీలపై క్యాస్టింగ్ డైరెక్టర్, ఫిట్నెస్ ట్రైనర్ అయిన మున్నావర్ అలీ సయద్ ముంబై పోలీసుల దగ్గర ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలని కోరుతూ ఆ అక్కాచెల్లెళ్లు సోమవారం బాంబే హైకోర్టును ఆశ్రయించారు. మున్నావల్ ఎఫ్ఐఆర్పై దర్యాప్తు చేయాల్సిందిగా పోలీసులను బాంద్రా మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది.
కంగన, ఆమె సోదరిపై 153ఎ (వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని పెంపొందించడం), 295ఎ (ఒకరి మతాన్ని అవమానించడం ద్వారా వారు ఏ తరగతి వారైనా వారి మత భావాలను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే, హానికరమైన చర్యలకు పాల్పడటం), భారతీయ శిక్షాస్మృతిలోని 124ఎ (దేశద్రోహం) కింద కేసు నమోదు చేశారు.