దర్శకత్వానికి మాత్రమే కొరటాల శివ పరిమితం కారు... ఆయన సినిమా నిర్మాణ వ్యవహారాల్లోనూ చురుగ్గా పాల్గొంటారని ఇండస్ట్రీ వర్గాలు అంటుంటాయి. సినిమా మేకింగ్లో ఖర్చు ఎక్కువ కాకుండా చూసుకుంటారని, డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడి నిర్మాతకు నాలుగు రూపాయలు ఎక్కువ వచ్చేలా చూడటంతో పాటు డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకుండా చూసుకుంటారని కొరటాలకు మంచి పేరుంది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆయన 'ఆచార్య' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ ఫైనలైజ్ చేసే పనిలో పడ్డారట.
నిజం చెప్పుకోవాలంటే 2020 వేసవిలో విడుదల చేయాలనుకున్న సినిమా 'ఆచార్య'. కరోనా వల్ల చిత్రీకరణ కూడా పూర్తి కాలేదు. ఈ నెలలో మళ్ళీ పునఃప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. చిత్రీకరణ మొదలు పెట్టేలోపు థియేట్రికల్ బిజినెస్ డీల్స్ అన్నీ క్లోజ్ చేయాలని కొరటాల భావిస్తున్నారట. డిస్ట్రిబ్యూటర్లలో ఆయనకంటూ ఓ కోటరీ ఉంది. కొంతమంది స్నేహితులు ఉన్నారు. కొరటాల ప్రతి సినిమాను వాళ్ళే డిస్ట్రిబ్యూట్ చేస్తారు. 'ఆచార్య' సినిమాను కూడా వాళ్లకు ఇస్తున్నట్టు సమాచారం.