'ఎఫ్3'కి వరుణ్ ఎక్కువ డిమాండ్ చేస్తున్నాడా?
on Nov 26, 2020
కామెడీ ఎంటర్టైనర్ 'ఎఫ్2'కు సంతకం చేయడానికి ముందు వరుణ్ తేజ్కు కొన్ని హిట్స్ ఉన్నప్పటికీ, స్టార్ హీరో అనిపించుకోలేదు. కాబట్టి, 'ఎఫ్2'లో నటించడానికి నిర్మాత దిల్ రాజు అతనికి ఓ మోస్తరు రెమ్యూనరేషన్ చెల్లించాడు. అయితే 'గద్దలకొండ గణేష్' మూవీ వచ్చాక మాస్ ఆడియెన్స్లోనూ బాగా వెళ్లిపోయాడు వరుణ్. ఇప్పుడు అతనికంటూ మార్కెట్ ఏర్పడింది. అతనితో సినిమాలు తీసేందుకు అటు నిర్మాతలు, ఇటు దర్శకులు ఉత్సాహం చూపిస్తున్నారు. అందువల్ల సహజంగానే అతని రెమ్యూనరేషన్ పెరిగింది.
కానీ వరుణ్కు 'ఫిదా', 'ఎఫ్2' లాంటి రెండు భారీ హిట్లు ఇచ్చింది తనే కాబట్టి, 'ఎఫ్3'లోనూ మిగతా సినిమాల నిర్మాతలతో పోలిస్తే, తక్కువకే అతన్ని తీసుకోవాలని దిల్ రాజు అనుకున్నారు. కానీ రాజు ఆఫర్ చేసిన దానికంటే వరుణ్ ఎక్కువ ఆశిస్తున్నట్లు ఫిల్మ్నగర్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
వెంకటేశ్, వరుణ్ తేజ్ తోడల్లుళ్లుగా నటించిన 'ఎఫ్2' సినిమాకు పెట్టిన ఇన్వెస్ట్మెంట్తో పోలిస్తే దిల్ రాజుకు రెట్టింపు డబ్బు వచ్చింది. సహజంగానే అంచనాలు భారీగా ఉండే 'ఎఫ్3'కి మరింత ఎక్కువ రాబడి వచ్చే అవకాశం ఉంది కాబట్టి, తనది సహేతుకమైన డిమాండ్గా వరుణ్ తేజ్ భావిస్తున్నాడు.
ఈ గొడవ ఇలా ఉండగానే 'ఎఫ్3' షూటింగ్ డిసెంబర్ 14న మొదలవుతుందని డైరెక్టర్ అనిల్ రావిపూడి అనౌన్స్ చేశాడు. ఈ సీక్వెల్లోనూ హీరోలు, హీరోయిన్లు తమ పాత్రలను నిలుపుకున్నారు. అంటే వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ఇందులోనూ అవే పాత్రల్లో కనిపించనున్నారు. 2021 సమ్మర్లోనే 'ఎఫ్3'ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనేది దిల్ రాజు ప్లాన్.