ప్రభాస్.. ముచ్చటగా మూడోసారి?
on Jun 1, 2020
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పటివరకు 19 సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో దక్షిణాది ముద్దుగుమ్మలు, ఉత్తరాది భామలు నాయికలుగా సందడి చేసిన వైనాలే ఎక్కువ. అయితే బాలీవుడ్ స్టార్ బ్యూటీస్ సందడి చేసిన సందర్భాలు మాత్రం రెండే రెండు ఉన్నాయి.
తన కెరీర్లో ఫస్ట్ టైమ్ 'ఏక్ నిరంజన్' (2009) చిత్రం కోసం బాలీవుడ్ హాట్ బ్యూటీ కంగనా రనౌత్తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసిన ప్రభాస్.. ఆపై దాదాపు పదేళ్ల తర్వాత పాన్ ఇండియా మూవీ 'సాహో' (2019) కోసం మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రధ్ధా కపూర్తో జట్టుకట్టాడు. ఈ రెండు సందర్భాల్లోనూ ప్రభాస్కి చెప్పుకోదగ్గ ఫలితాలే దక్కాయి.
'ఛత్రపతి' తరువాత సరైన విజయం లేని యంగ్ రెబల్ స్టార్కి.. కంగనాతో జోడి కట్టిన 'ఏక్ నిరంజన్' ఊరటనిచ్చింది. తొలివారంలోనే పెట్టుబడిని రాబట్టుకుని హిట్ ఫిల్మ్గా నిలిచింది. ఇక 'సాహో' విషయానికి వస్తే 'బాహుబలి' సిరీస్ తరువాత వచ్చిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఆ అంచనాలను అందుకోవడంలో విఫలమైనా.. హిందీనాట కలెక్షన్ల వర్షం కురిపించింది. ప్రభాస్ స్టామినా ఏంటో చెప్పకనే చెప్పింది.
సో.. బాలీవుడ్ స్టార్ బ్యూటీలతో జట్టుకట్టిన ప్రతీసారి ప్రభాస్కి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చాయి అన్నమాట. ఈ నేపథ్యంలోనే.. 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయబోతున్న భారీ బడ్జెట్ మూవీ ('ప్రభాస్ 21స) కోసం ముచ్చటగా మూడోసారి బాలీవుడ్ స్టార్ బ్యూటీతో ప్రభాస్ జోడి కట్టనున్నట్టు కథనాలు వస్తున్నాయి. దీపికా పదుకొణే, కత్రినా కైఫ్, అలియా భట్.. ఇలా పలువురు ప్రముఖ హిందీ కథానాయికల పేర్లు ఈ చిత్రం కోసం వెలుగులోకి వస్తున్నాయి. రీసెంట్ టాక్ ఏంటంటే.. దీపిక ఆల్మోస్ట్ హీరోయిన్గా సెలెక్ట్ అయిందనేది.
మరి.. కంగనా రనౌత్, శ్రద్ధా కపూర్ ఎలాగైతే ప్రభాస్కి కలిసొచ్చారో అలాగే దీపిక కూడా అచ్చొస్తుందేమో చూడాలి.