ఇద్దరు లక్ష్ములు ఎన్టీఆర్ను వదిలేసినట్లేనా..?
on Jan 12, 2018
తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవిత చరిత్రను బయోపిక్గా తీస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ తండ్రి పాత్రను పోషిస్తుండగా తేజ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఇదే సమయంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో తాను కూడా ఓ సినిమా తీస్తున్నట్లు సంచలన దర్శకుడు రామ్గోపాల్ వర్మ ప్రకటించారు. లక్ష్మీపార్వతి గారు రామారావు గారి జీవితంలోకి వచ్చిన తర్వాత జరిగిన సంఘటనల ఆధారంగా తాను సినిమా రూపొందిస్తానన్నారు. మరోవైపు తమ అభిమాన నటుడి జీవితాన్ని వక్రీకరించేందుకు తెరవెనుక లక్ష్మీపార్వతి కుట్ర చేస్తున్నారని ఆరోపిస్తూ.. చెన్నైకి చెందిన కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి లక్ష్మీస్ వీరగ్రంథం తీస్తానని ప్రకటించి సంచలనం సృష్టించాడు. ఇందులో లక్ష్మీపార్వతి మొదటి భర్తతో పాటు ఎన్టీఆర్ను ఆమె ఎలా వివాహం చేసుకున్నానో చూపిస్తానని చెప్పడంతో రచ్చ రచ్చ జరిగింది.
మాటలు యుద్దాలు, కౌంటర్లు, రీకౌంటర్లతో సినిమా విడుదల కాకముందే కావాల్సినంత మసాల ఇచ్చాయి రెండు వర్గాలు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. బాలయ్య సినిమా మినహా మిగిలిన రెండు సినిమాలు ఇప్పుడు సోదిలో లేకుండా పోయాయి. వర్మ, నాగ్ సినిమాతో బిజీగా ఉంటే.. కేతిరెడ్డి చెన్నైలో పోలిటికల్ ప్రెస్ మీట్లు పెడుతూ కూర్చొన్నాడు. దానికి తోడు కొందరు పెద్దలు వీరి మధ్య రాజీ ఒప్పందం కుదుర్చినట్లు ఫిలింనగర్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అది నిజమేనని అనిపిస్తోంది. అంటే కత్తులు దూసుకున్న లక్షీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ వీరగ్రంధం ఇప్పట్లో ప్రేక్షకుల ముందుకు రావన్న మాట. ఇంతకీ వీరిద్దరి మధ్య రాజీ కుదిర్చిన ఆ కీలక వ్యక్తులు ఎవరు అంటూ టాలీవుడ్ జనాలు చర్చించుకుంటున్నారు.
Also Read