బాలయ్యతో మీనా.. 22 ఏళ్ళ తరువాత?
on May 7, 2021
నటసింహ నందమూరి బాలకృష్ణ సరసన కనువిందు చేసిన కథానాయికల్లో అభినేత్రి మీనా ఒకరు. 90ల్లో వచ్చిన `అశ్వమేథం` (1992), `బొబ్బిలి సింహం` (1994), `ముద్దుల మొగుడు` (1997), `క్రిష్ణబాబు` (1999) చిత్రాల్లో వీరిద్దరి జోడీ అలరించింది. కట్ చేస్తే.. 22 ఏళ్ళ తరువాత బాలయ్య, మీనా మరోసారి జట్టుకట్టనున్నారట.
ఆ వివరాల్లోకి వెళితే.. `క్రాక్` కెప్టెన్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ఓ యాక్షన్ డ్రామా చేయనున్న సంగతి తెలిసిందే. ఇందులో ఇద్దరు కథానాయికలకు స్థానముండగా.. వారిలో ఒకరిగా శ్రుతి హాసన్ పేరు వినిపిస్తోంది. కాగా, ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్స్ లో మీనా కనిపించనుందని సమాచారం. బాలయ్య, మీనా మధ్య వచ్చే సన్నివేశాలు చిత్రానికే హైలైట్ గా నిలుస్తాయని టాక్. త్వరలోనే బాలయ్య - గోపీచంద్ మలినేని చిత్రంలో మీనా ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
జూన్ నుంచి సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఈ భారీ బడ్జెట్ మూవీ థియేటర్స్ లో సందడి చేసే అవకాశముంది.
కాగా, ప్రస్తుతం బాలయ్య `అఖండ` చేస్తున్నారు. బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్.. చిత్రీకరణ తుదిదశలో ఉంది.