పాతికేళ్ళ తరువాత కమల్, మీనా జోడి?
on Jun 17, 2021
మలయాళంలో ఘనవిజయం సాధించిన `దృశ్యం 2`.. తెలుగులో అదే పేరుతో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో విక్టరీ వెంకటేశ్, అభినేత్రి మీనా జంటగా నటిస్తున్నారు. కట్ చేస్తే.. ఇప్పుడిదే సినిమాని తమిళంలోనూ రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దర్శకుడు జీతూ జోసెఫ్. `దృశ్యం` తమిళ్ వెర్షన్ `పాపనాశం`లో ప్రధాన పాత్ర పోషించిన లోక నాయకుడు కమల్ హాసన్ ఈ సీక్వెల్ లోనూ కొనసాగనున్నారు. అయితే, `పాపనాశం`లో కమల్ కి జంటగా నటించిన గౌతమికి బదులుగా మీనా నటించే అవకాశముందని టాక్.
కమల్, గౌతమి మధ్య సత్సంబంధాలు లేని కారణంగానే.. గౌతమి స్థానంలో మీనాని నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. అదే గనుక నిజమైతే.. మలయాళం, తెలుగు, తమిళ్.. ఇలా మూడు భాషల్లోనూ ఈ సీక్వెల్ లో నటించిన ఘనత మీనాకి దక్కుతుంది. త్వరలోనే `పాపనాశం 2`లో మీనా ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
కాగా, `అవ్వై షణ్ముగి` (తెలుగులో `భామనే సత్యభామనే`) (1996) విడుదలైన పాతికేళ్ళ తరువాత కమల్ హాసన్, మీనా.. మళ్ళీ `పాపనాశం 2` కోసమే జట్టుకట్టనుండడం విశేషం.