మహేశ్, బన్నీల మధ్య "పంతం నీదా నాదా సై"..?
on Feb 17, 2018
సమ్మర్లో ఏప్రిల్ 27కి తమ సినిమా రిలీజ్ డేట్ను ముందే లాక్ చేసి పెట్టుకున్నారు మహేశ్, బన్నీ. కానీ ఊహించని విధంగా సౌతిండియన్ సూపర్స్టార్ రజనీకాంత్ కూడా అదే రోజు తన సినిమాను విడుదల చేస్తానని ప్రకటించడంతో.. సూపర్స్టార్, స్టైలిష్ స్టార్లు ఉలిక్కిపడ్డారు. ఒకేరోజు ముగ్గురు సూపర్స్టార్లు థియేటర్లలోకి వస్తే.. పెట్టుబడి పెట్టిన నిర్మాతలకు.. ఎంతో నమ్మకంతో సినిమాను కొన్న బయ్యర్లకు ఇన్వెస్టిమెంట్ వెనక్కి వస్తుందా...? అన్న భయం వెంటాడుతోంది. నిర్మాత క్షేమాన్ని కోరి మహేశ్, బన్నీల్లో ఎవరో ఒకరు వెనక్కి తగ్గాలనే వాదనలు వినిపిస్తున్నాయి. ఫలానా డేట్కి తమ సినిమాను విడుదల చేస్తామని ముందుగా ప్రకటించిన వాళ్లు.. అదే తేదీకి మరో చిత్రం వస్తే తమ సినిమాను పోస్ట్పోన్ చేసుకోవడానికి ససేమిరా అంటున్నారు. రజనీ రాకతో వారం గ్యాప్ తీసుకుంటారని ట్రేడ్ పండితులు భావించారు.
అయితే ఆశ్చర్యకరంగా ఇద్దరు ఏప్రిల్ 26కి సినిమా పక్కా అంటూ అనౌన్స్ చేశారు. ఇది అటు తిరిగి ఇటు తిరిగి ఇరు వర్గాల మధ్య పంతానికి దారి తీస్తోంది. మీ సినిమాను వెనక్కి జరపొచ్చు కదా అని నా పేరు సూర్య నిర్మాతలు.. భరత్ అనే నేను నిర్మాతలను అడిగితే.. ఆ పనేదో మీరే చేయొచ్చు కదా అని వీళ్లు అంటున్నారు. బాహుబలి టైంలో శ్రీమంతుడు సినిమాని వెనక్కి జరిపి మహేశ్ పక్కా జెంటిల్మెన్గా ప్రశంసలు పొందాడు.. అలాంటి ప్రిన్స్ కూడా ఈసారి ఎందుకో మరి తగ్గనంటే తగ్గను అంటున్నాడు. ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే.. ఇంతవరకు వెనక్కి తగ్గిన చరిత్ర తనకు లేదంటున్నాడు. పైగా ఏప్రిల్ నెల బన్నీకి బాగా కలిసిరావడంతో.. దానిని సెంటిమెంట్గా భావిస్తుండటంతో.. ఏ మాత్రం వదులుకునేందుకు సిద్ధంగా లేడు. ఇద్దరు సై అంటే సై అంటుండటంతో ఏం జరుగుతుందోనని బయ్యర్లు వణికిపోతున్నారు.