ప్రభాస్ హీరోయిన్ కోసం 8 కోట్లా??
on May 16, 2017
బాహుబలి తరవాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో. ఈ సినిమాని బాలీవుడ్లోనూ భారీ ఎత్తున విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. అందుకోసం బాలీవుడ్ భామని దిగుమతి చేసుకోవడం తప్పని సరి. అందుకే... సాహో బృందం బాలీవుడ్ భామల వేట కొనసాగిస్తోంది. కత్రినా కైఫ్ని ప్రభాస్కి జోడీగా తీసుకొద్దామనుకొన్నారు. అయితే కత్రినా కంటే బెటర్ ఆప్షన్ ఎవరైనా దొరుకుతారా? అనే దిశగా సాహో బృందం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.
ఇందులో భాగంగా శ్రద్దా కపూర్ని సంప్రదించారని టాక్. సాహో కథ శ్రద్దాకి వినిపించారని, తనకి బాగా నచ్చిందని, ప్రభాస్ తో కలసి నటించడానికి కూడా రెడీ అందని తెలుస్తోంది. అయితే పారితోషికం గా రూ.8 కోట్లు డిమాండ్ చేసిందట. దాంతో సాహో నిర్మాతలు ఖంగు తిన్నారని టాక్. పారితోషికం విషయంలో అటు శ్రద్దాకీ, ఇటు యూవీ క్రియేషన్ సంస్థకీ మధ్య మంతనాలు జరుగుతున్నాయని, రూ.5 కోట్లు ఇవ్వడానికి నిర్మాతలు సముఖంగా ఉన్నారని, అయితే.. శ్రద్దా మాత్రం రూ.8 కోట్లకి పైసా కూడా తగ్గనంటోందని గాసిప్పులు వినిపిస్తున్నాయి. శ్రద్దాకపూర్ కావాలంటే రూ.8 కోట్లు ఇచ్చుకోవాల్సిందే మరి.