ఎన్టీఆర్ బయోపిక్ ని పక్కకు పెట్టేసిన బాలకృష్ణ
on Nov 29, 2017
నందమూరి తారక రామరావుని తెలుగు వారి ఆస్తిగా అభివర్ణిస్తారు. అలాంటి పెద్దాయన కీర్తిని ప్రతి ఒక్కరు వాడుకుంటున్నారు. మంచికి అయితే పర్లేదు గానీ, ఆయన జీవితం పై సినిమాలు తీసి ఏదో ఒక రాజకీయ వర్గం మెప్పు పొందే దిశగా ఈ ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ చేస్తుండగా, కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి అనే దర్శకుడు లక్ష్మీస్ వీరగ్రంధం అనే సినిమా చేస్తున్నాడు. ఒక సినిమా లక్ష్మి పార్వతికి అనుకూలంగా ఉండబోతుంది అని ప్రచారం జరుగుతుండగా, ఇంకో సినిమా ఆమెకు వ్యతిరేకంగా ఉంటుంది అని అంటున్నారు. ఏది ఏమయినా, ఈ సినిమాల వల్ల ఎన్టీఆర్ కీర్తి దెబ్బతింటుంది అని అభియోగాలోస్తున్నాయి.
అయితే సినిమాలేవీ అనౌన్స్ కాకముందు, బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ జీవితగాధని తెరకెక్కిస్తానని ప్రకటించారు. అనుకున్నదే తడవుగా దర్శకుడు తేజని రంగంలోకి దించి కథ సిద్ధం చేయమన్నాడు. ఎన్టీఆర్ వర్ధంతి అనగా జనవరి 18 న ఈ సినిమా మొదలవ్వాల్సింది. కానీ, ఆ రెండు చిత్రాల ప్రభావమో ఏంటో తెలియదు కానీ బాలకృష్ణ ఈ సినిమాని పోస్ట్ పోన్ చేసాడట. ఎన్టీఆర్ వర్ధంతికి బదులుగా, ఎన్టీఆర్ జయంతి అనగా మే 28 కి మొదలు పెడదాం అని డిసైడ్ అయ్యారట. ఈ లోపల లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీస్ వీరగ్రంధం ప్రేక్షకుల్ని పలకరించి వెళ్లిపోతాయి కూడా.
ప్రస్తుతం తేజ ఎన్టీఆర్ బయోపిక్ ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పక్కన పెట్టేసి, వెంకటేష్ తో చేయబోతున్న సినిమా కథా చర్చల్లో బిజీ అయిపోయాడట. మరి, బాలకృష్ణ ఈ గ్యాప్ లో వేరే ఏదయినా సినిమా చేస్తాడా లేదా చూడాలి!