‘అదిరింది’ని ఆపింది పవనేనా?
on Nov 4, 2017
నిప్పు లేకపోతే పొగ రాదు కదా! పొగ వస్తుందంటే.. కచ్చితంగా నిప్పు ఉందనే కదా అర్థం. ‘అదిరింది’ సినిమా విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది. ఈ సినిమా తమిళ వెర్షన్ ‘మెర్సల్’ దీపావళికి విడుదలై 200 కోట్లు వసూలు చేసింది. తెలుగులో డబ్ చేద్దామనుకునేలోపు.. ఏవో కుంటి సాకులు చెప్పి సినిమాను ఆపేశారు. ఎప్పటికప్పుడు కొత్త డేట్ లు ప్రకటించడం.. మళ్లీ సినిమా ఆగిపోవడం.. ‘మెర్సల్’ విషయంలో ఇది మామూలైపోయింది. ఇప్పటివరకూ చాలా సినిమాలు వివాదాల్లో చిక్కకున్నాయ్. కానీ ఇంత టాపిక్ అయిన సినిమా మాత్రం లేదు. ఎందుకు ‘అదిరింది’కి ఇంత ఆటంకాలు.. అనేదానిపై ఇప్పుడు చర్చ మొదలైంది. అసలు ఈ సినిమా విడుదల అవుతుందా? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నే. అయితే.. ఈ సినిమా విషయంలో ఓ కొత్త రూమర్ వినిపిస్తోంది. పరిస్థితుల్ని బట్టి చూస్తే అది రూమర్ కాదు.. నిజమేనేమో అనిపిస్తుంది. ‘మెర్సల్’ను తెలుగులో ‘అదిరింది’గా విడుదల చేసే హక్కులను శరత్ మరార్ సొంతం చేసుకున్నాడు. అయితే.. ప్రస్తుతం ఆయన సోదిలో లేడు. మీడియా కంట పడకుండా తిరుగుతున్నాడు. మరో విషయం ఏంటంటే.. ఈ సినిమా రీమేక్ రైట్స్ ని అ్లలు అరవింద్ సొంతం చేసుకున్నాడట. ‘అదిరింది’ ఆగడానికి కారణం అది కూడా అని చాలామంది అనుకుంటున్నారు.
అనువాద కార్యక్రమాలు పూర్తి చేసుకొని థియేటర్ల దాకా వచ్చేసిన సినిమాను ఆపడం సాథ్యమేనా? ఇంతకు ముందెన్నడూ ఇలాంటివి జరగనేలేదు. అయితే.. అరవింద్ తలచుకుంటే ఎంత? అనేది చాలామంది వాదన. మరో ఆసక్తి కరమైన విషయం ఏంటంటే.. గీతా ఆర్ట్స్ పతాకంపై పవన్ కల్యాణ్ హీరోగా ఈ సినిమాను నిర్మించనున్నారట. ‘మెర్సల్’ సామాజిక సమస్యలపై విమర్శలు గుప్పించిన సినిమా. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ పోకడలను యండగడుతూ ఇందులో డైలాలు కూడా ఉన్నాయ్. జీయస్టీ, నోట్ల రద్దు అంశాలు కూడా ఇందులో ప్రస్తావించారు. అంతేకాదు.. గవర్నమెంట్ డాక్టర్ల నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టడం కూడా జరిగిందట. రాబోతున్న ఎన్నికల ముందు పవన్ హీరోగా ఈ సినిమా విడుదలైతే.. అతని రాజకీయ జీవితానికి ఈ సినిమా హెల్ప్ అవుతుందని అరవింద్ ఆలోచన కావొచ్చు. అసలు ఇందులో నిజం ఎంతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.