వర్మ వెనుక ఉన్నదెవరు..?
on Sep 18, 2017
రామ్ గోపాల్ వర్మ మళ్లీ అగ్గి రాజేశాడు. ఈ దఫా... నివురు గప్పి ఉన్న రావణ కాష్టాన్నే కదిలించాడు. దీన్ని ఇలాగే రాజేశాడా! అది అగ్ని కీలలుగా మారడం ఖాయం. ఆ కీలలు తననే దహిస్తాయో..? లేక ఇంకెవరినైనా బలి తీసుకుంటాయో? అర్థం కాని పరిస్థితి. ఇంతకీ ఏమైంది? అనుకుంటున్నారా? మనోడు సోషల్ మీడియా లో ఓ విషయాన్ని పోస్ట్ చేశాడు. అది మామూలు విషయం కాదు. ప్రభుత్వాలపైనే ప్రభావితం చేసే అంశం.
‘ ‘లక్ష్మీస్ ఎన్టీయార్’ పేరుతో ఓ చిత్రం తీయబోతున్నాను. ఎన్టీయార్ మరణానికి కారణం ఏంటి? మరణానికి ముందు ఏం జరిగింది? ఆయన ఏ విధంగా పదవీచ్యుతుడు అయ్యాడు? ఈ విషయాలన్నీ ఈ సినిమాలో కూలకషంగా వివరిస్తా. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నా దగ్గరుంది’ అని సోషల్ మీడియా ద్వారా తెలియజేసి సంచలనానికి తెరలేపాడు వర్మ. దీనిపై ఇప్పుడు రకరకాల సందేహాలు. అసలు వర్మ ఉన్నట్టుండి ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? అనేది చర్చనీయాంశమవుతోంది. ఈ విషయంపై కాస్త లోతుగా వెళ్తే...
తన తండ్రి ఎన్టీయార్ బయోపిక్ తీయాలనేది బాలకృష్ణ చిరకాల కోరిక. ఈ విషయంపై చాలా మందిని ఆయన కలిశాడు కూడా. ‘పైసా వసూల్’ నిర్మాణంలో ఉన్న సమయంలో ఈ ప్రపోజల్ రామ్ గోపాల్ వర్మ దగ్గరకెళ్లింది. ఆయన ఎగిరిగంతేసి ఒప్పుకున్నాడు. ఆవేశంతో ఎన్టీయార్ మీద ఓ పాటను కూడా తానే స్వయంగా పాడి రికార్డ్ కూడా చేశాడు. అయితే... ‘ఎన్టీయార్ బయోపిక్ కి వర్మ దర్శకుడు’ అనే వార్త బయటకు రాగానే... ఎన్టీయార్ అభిమానుల్లో అసంతృప్తి జ్వాలలు వెల్తువెత్తాయ్. చివరకు ఎన్టీయార్ కుటుంబ సభ్యులు కూడా బాలయ్య నిర్ణయంపై విముఖత వ్యక్తం చేశారు. దాంతో... ప్రస్తుతానికి ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేసి, సినిమాలతో బిజీ అయిపోయాడు బాలయ్య. వర్మ కూడా సైలెంట్ అయిపోయాడు. అయితే... ఈ మధ్య... ఈ ప్రాజెక్ట్ విషయమై ఓ వార్త ఫిలిం సర్కిల్ లో హల్ చల్ చేసింది. ‘ఎన్టీయార్ బయోపిక్ విషయమై... దర్శకుడు తేజాకు కబురంపిన బాలయ్య’ అనే వార్త వెలుగు చూడటంతో.. సోషల్ మీడియాలో కూడా ‘ఎన్టీయార్ బయోపిక్ కి దర్శకునిగా తేజా దాదాపు ఖరారయ్యాడు’ ఫిక్స్ చేసి రాసేశారు. ఈ నేపథ్యంలో వర్మ నుంచి ‘లక్ష్మీస్ ఎన్టీయార్’ అంటూ ప్రకటన రావడంతో.. ఒక్కసారిగా వాతావరణం అంతా హాట్ హాట్ గా మారిపోయింది.
ఎన్టీయార్ జీవితం నిజంగా అద్భుతం. అయితే... ఆయన చివరి రోజులు మాత్రం..బాధాకరంగా సాగాయ్. అందుకే... ఎన్టీయార్ బయోపిక్ లో ఆ అంశాన్ని మాత్రం బాలయ్య పక్కన పెట్టినట్లు సమాచారం.
‘తాను ఈ సినిమాకు దర్శకుడ్ని కాలేను.’ అని వర్మ ఎప్పుడైతే అనుకున్నాడో... ఈ సినిమాకు దర్శకునిగా తేజాను సెలక్ట్ చేసినట్టు వార్త ఎప్పుడైతే విన్నాడో... వెంటనే... వర్మ నుంచి ‘లక్ష్మీస్ ఎన్టీయార్’ స్టేట్మెంట్ రావడం.. చాలామందిలో పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. దానికి కారణం లేకపోలేదు. బాలయ్య అనుకున్న ఎన్టీయార్ బయోపిక్ సబ్జెక్ట్ లో ఎన్టీయార్ బ్యాడ్ పిరియడ్ ఉండదు. ఈ విషయం బాలయ్య ద్వారానే వర్మకి కూడా తెలిసి ఉంటుంది. సో... ఏదైతే.. బయోపిక్ లో లేదో.. ఆ మేటర్ నే హైలైట్ చేస్తూ వర్మ సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు. దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? అనేది ఇప్పుడు చర్చ.
‘ఎన్టీయార్ బయోపిక్ కి నేనే దర్శకుడ్నవ్వాలి. లేకపోతే... ఆ సినిమానే తీయడానికి వీల్లేదు. ఒకవేళ తీస్తే... నేను ఆయన బ్యాడ్ పిరియడ్ ని తెరపై చూపిస్తా’ అని బాలయ్యను బెదిరించడం కోసమే వర్మ.. ఈ విధమైన స్టేట్మెంట్ ఇచ్చాడా? అనేది చాలామంది అనుమానం. ఇంకొందరైతే... ‘ఎన్నికలు రానున్న సమయంలో వర్మ ఈ సబ్జెక్ట్ పై ఫోకస్ పెట్టాడంటే.. ఈ వ్యవహారంలో వైయస్ జగన్మోహనరెడ్డి హస్తం ఏమైనా ఉందా?’ అని కూడా అనుకుంటున్నారు.
మరి ఈ విషయంపై బాలయ్య స్పందన ఎలా ఉండబోతోంది? లక్ష్మీపార్వతి ఈ విషయాన్ని ఎలా తీసుకుంటుంది? అధికార, ప్రతిపక్ష పార్టీల మనోగతమేంటి? ఎన్టీయార్ అభిమానులు వర్మ నిర్ణయాన్ని సమర్దిస్తారా? ఒక వేళ ఈ సినిమాను వర్మ తీసి విడుదల చేస్తే.. ఆ ప్రభావం ఎవరిపై.. ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి?