కియారా నుంచి తన మనసు ఇంకా కోరుకుంటోందని బయటపడ్డ సిద్ధార్థ్!
on Jul 27, 2021
సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వానీ తమ అనుబంధాన్ని అఫిషియల్గా వెల్లడించకపోయినా, ఆ ఇద్దరూ ప్రేమలో మునిగితేలుతున్నారని లోకమంతా కోడై కూస్తోంది. అప్పుడప్పుడూ ఆ ఇద్దరూ బయట జంటగా కనిపిస్తున్నారు. కొన్నిసార్లు ఒకరి ఇంటికి మరొకరు వెళ్తూ కెమెరా కంటికి దొరికిపోతున్నారు. తాజాగా ఆ ఇద్దరూ తమ సినిమా 'షేర్షా' ట్రైలర్ లాంచ్ నిమిత్తం కార్గిల్కు వెళ్లారు. దానికి ముందు ఆ సినిమా ప్రొడ్యూసర్ కరణ్ జోహార్తో పాటు లైవ్లో మాట్లాడారు. ఈ సందర్భంగా తన గాళ్ఫ్రెండ్పై తన ఫీలింగ్స్ను బయటపెట్టాడు సిద్ధార్థ్.
వాతావరణం బాగోలేకపోవడంతో ఆ ముగ్గురూ జమ్ము ఎయిర్పోర్ట్లో బస చేశారు. ఈ సందర్భంగా "కియారా అద్వానీ గురించి ఏం చెబుతావు?" అని సిద్ధార్థ్ను అడిగాడు కరణ్ జోహార్. దానికి "యే దిల్ మాంగే మోర్" అని జవాబిచ్చాడు సిద్ధార్థ్. అది 'షేర్షా' మూవీలోని ఓ డైలాగ్. ఆ మూవీలో కెప్టెన్ విక్రమ్ బాత్రా పాత్రను చేస్తున్న సిద్ధార్థ్ ట్రైలర్లోని ఓ సన్నివేశంలో "యే దిల్ మాంగే మోర్ సార్ (నా మనసింకా కోరుకుంటోంది సార్)" అని చెప్తాడు. ఇప్పుడు కియారా విషయంలో తన దిల్ ఇంకా కోరుకుంటోందని అతను చెప్పడంతో ఫ్యాన్స్ చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా వారు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలే దీనికి నిదర్శనం.
'షేర్షా' మూవీలో కియారా, సిద్ధార్థ్ జంటగా కనిపించనున్నారు. కార్గిల్ హీరో కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా ఈ సినిమాని రూపొందించారు. విక్రమ్ బాత్రా ఫియాన్సీ డింపుల్ చీమా పాత్రను కియారా పోషించింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఆగస్ట్ 12న 240 దేశాల్లో 'షేర్షా' ప్రీమియర్ కాబోతోంది.
Also Read