సీక్వెల్ బాటలో `పీకే`
on Feb 22, 2021
బాలీవుడ్ లో అపజయమంటూ ఎరుగని దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు పొందారు రాజ్ కుమార్ హిరాణి. `మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్`, `లగే రహే మున్నా భాయ్`. `త్రీ ఇడియట్స్`, `పీకే`, `సంజు`.. ఇలా ఈ వెర్సటైల్ డైరెక్టర్ తెరకెక్కించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా పొందాయి.
ఇదిలా ఉంటే.. `మున్నాభాయ్ ఎం.బి.బి.ఎస్`కీ సీక్వెల్ గా `లగే రహే మున్నాభాయ్`ని రూపొందించిన రాజ్ కుమార్.. త్వరలో `పీకే`కి కొనసాగింపుగా మరో చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారట. అయితే `పీకే`లో ప్రధాన పాత్ర పోషించిన అమీర్ ఖాన్ కాకుండా.. సినిమా చివరలో తళుక్కున మెరిసిన రణ్ బీర్ కపూర్ తో ఈ సైన్స్ ఫిక్షన్ సెటైరికల్ కామెడీ డ్రామా కొనసాగింపుని చేయబోతున్నారట రాజ్ కుమార్. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని టాక్.
కాగా, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కాంబినేషన్ లోనూ రాజ్ కుమార్ హిరాణి ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కించనున్నారని కథనాలు వస్తున్నాయి. `పీకే` సీక్వెల్ కంటే ముందే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశముందట.