వివాదాల వర్మ
on Nov 28, 2011
మన దేశంలో నూటికి తొంభై మంది ఎలాగోలా ఏదో ఒక ఉద్యోగం చూసుకునో, వ్యాపారం చేసుకునో జీవితంలో ఏదో ఒక విధంగా సెటిలవ్వాలనుకుంటారు. కానీ మిగిలిన పదిశాతం మందిలో ఎనిమిది శాతం మంది విపరీతంగా ధనం సంపాదించాలనుకుంటారు. ఇక మిగిలిన రెండు శాతం మంది కీర్తి కోసం ప్రాకులాడేవారుంటారు. వీళ్ళ కోవలోకి వచ్చే వ్యక్తి ప్రముఖ సినీ దర్శకులు రామ్ గోపాల వర్మ. ఈయన ఆలోచనా విధానం మొదటి నుంచీ విభిన్నంగానే ఉంటూ వచ్చింది. ఈ మధ్య అది మరీ వివాదాలకు దారి తీసేలా తయారయ్యింది.
ఉదాహరణకు వస్తే మొన్న ఆయన రాయల సీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో ఆయన తీసిన "రక్తచరిత్ర" సినిమా రెండు భాగాలు చాలా వివాదాలను రేకెత్తించాయి. పరిటాల రవి, మద్దెల చెరువు సూరిల మధ్య జరిగిన హత్యారాజకీయాల, వర్గ పోరాటాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తీశారు వర్మ. అదొక సంచలనం సృష్టించింది. ఆ తర్వాత "కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పల్రాజు" చిత్రంతో తెలుగు సినిమా పరిశ్రమ మీద విమర్శల వర్షం కురిపించారు వర్మ. ఈ చిత్రంలో ఏకంగ తెలుగు సినీ పరిశ్రమలోని చాలా మంది ప్రముఖ దర్శకులను ఘాటుగా ఒక పాటలో విమర్శించారాయన. అదృష్టవశాత్తూ అందరూ దానికి పెద్దగా స్పందించలేదు గాబట్టి అది సంచలనాన్ని సృష్టించలేకపోయింది.
ఐదు రోజుల్లో సినిమా తీస్తానంటూ "దొంగల ముఠా" సినిమా తీశారు. అదీ ఆశించినంతగా సంచలనం సృష్టించలేదు. ప్రస్తుతం "బెజవాడ" అనే చిత్రం ఆయన ఆధ్వర్యంలో నిర్మించబడుతూంది. ఈ చిత్రం వల్లవిజయవాడలోని రెండు సామాజిక వర్గాల్లో అసహనం, అశాంతి నెలకొంది. కారణం ఈ రెండు సామాజిక వర్గాలకూ ఆధిపత్య పోరు జరిగింది. ఆ ఆధిపత్యపోరులో ఇరువర్గాల నుండీ అనేకమంది నాయకులూ, కార్యకర్తలూ హత్యలకు గురయ్యారు. ఈ చిత్రానికి ముందుగా "బెజవాడ రౌడీలు" అని ఆయన పెట్టిన పేరే వివాదాస్పదమయ్యింది. ముందు ఎవరేమనుకున్నా తాను ఆ చిత్రం పేరు మార్చనని వర్మ అన్నా, ఆ తర్వాత దాన్ని "బెజవాడ" గా మార్చటం జరిగింది. ఈ చిత్రం డిసెంబర్ ఒకటవ తేదీన విడుదల కానుంది. ఇది సినిమాల తాలూకు వర్మ పరిస్థితి.
ఇక తన ట్విట్టర్ లో వర్మ రాసే వ్యాఖ్యలు చూస్తే మరింత వివాదాస్పదంగా ఉంటాయి. ఉదాహరణకు కొన్ని తెలియజేస్తాను. "పుణ్యం చేసిన మగవారి కోసం స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనక వంటి దేవ వేశ్యలుంటారని అంటారు. మరి అదే పుణ్యం చేసిన ఆడవారి కోసం అక్కడ ఎవరుంటారో" అని సందేహం వ్యక్తం చేశారు వర్మ. రజనీకాంత్ ఒక నిమిషం పాటు హీరోగా నటించిన "రావన్" చిత్రంలో షారూఖ్ ఖాన్ రెండు గంటల పాటు అతిథి పాత్రలో నటించాడు"అని షారూఖ్ ఖాన్ మీద సెటైర్ వేశారు వర్మ.
ఇవన్నీ ఎందుకు చర్చించాల్సి వచ్చిందంటే రామ్ గోపాల వర్మ మనస్తత్వాన్ని, ఆలోచనా సరళిని తెలియజెప్పే ప్రయత్నం చేయటానికి. నిజానికి వర్మ దూషణ, భూషణ, తిరస్కారాల వంటి వాటికి అతీతుడని వర్మ అమ్మగారు "నా ఇష్టం" పుస్తకం ఆవిష్కరణ సభలో చెప్పారు. ఏది ఏమైనా సంచలనాలకు, వివాదాలకు కేంద్రబిందువుగా నిలవటం వర్మ ముద్ర అనేది సుస్పష్టం. దయచేసి ఈ ఆర్టికల్ మీద మీ మీ అభిప్రాయాలను తెలియజెయ్యండి....!