Facebook Twitter
నేనెవరు

నేనెవరు

 

కుందేలు పిల్లకు నిస్పృహ కలిగింది. అది నిరాశగా తల వంచుకొని పోతూంటే దానికో కోయిల ఎదురైంది- పాటలు పాడుకుంటూ. "నేనెవరు?" అని కుందేలు అడిగితే అది సంతోషంగా కూసింది. "నువ్వే నేను, నేనే నువ్వు! నిన్ను నువ్వు నేనంటే, నేను నిన్ను నిన్నంటా" అని పాడుతూ ఉత్సాహపడిందది. కుందేలుకి ఆ పాట విని నవ్వైతే వచ్చింది కానీ, తన ప్రశ్నకు సమాధానం మాత్రం దొరకలేదు.

ఆ పైన దానికి ఓ నెమలి ఎదురైంది. వాన గాలి చల్లగా వీస్తూంటే, దూరం నుండి తియ్యగా మట్టి వాసనని మోసుకొస్తుంటే ఆగలేక, అది నాట్యం మొదలెట్టింది. ముఖం చిన్నగా చేసుకొని కుందేలు `నేనెవరు?' అని అడిగింది దాన్ని. నెమలి నవ్వింది. "అరే, ఇది ఆలోచించే సమయం కాదురా, ఆనందించాల్సిన సమయం! చూడు చుట్టూతా, ప్రకృతి ఎంత బాగుందో!? ఇలాంటి సమయం ఎప్పుడూ ఉండదు. సంతోషపు ఘడియల్ని ఆలోచనల్తో వృధా చేసుకోవద్దమ్మా, నాట్యంచెయ్ నవ్వుతూ! దా, కావాలంటే నీకు నేను నాట్యం నేర్పిస్తాను!" అన్నది నెమలి, నాట్యం ఆపకుండానే.

కుందేలు చికాకు పడి, `వీళ్లను కాదు, అడగాల్సింది!' అనుకున్నది. "నీళ్లలో నిలబడి నిశ్చలంగా తపస్సు చేసుకొనే కొంగే ఈ ప్రశ్నకు జవాబివ్వగలిగేది." అలా అనుకుని, అది కొంగను వెతుక్కుంటూ పోయింది. అనుకున్నట్టుగానే కొంగ నీళ్లల్లో నిలబడి కనిపించింది దానికి. చాలా సార్లు పిలిస్తే కానీ దాని ఏకాగ్రత తెగలేదు. అప్పుడు కూడా అది కుందేలుకేసి ఓ సారి అలా చూసి, మళ్లీ నీళ్లలోకి చూడటం మొదలుపెట్టింది. కుందేలు చాలాసార్లు అడిగిన తరువాత, అది అన్నది మెల్లగా - "చూడు నాయనా, మనందరం చేపలమే. ఎటొచ్చీ అవి నీళ్లల్లో ఉంటాయి. మనం మాత్రం గాలిలో ఉంటాం. అవి నీళ్లలో తిరుగుతై, మనం గాలిలోనూ, నేలమీదా తిరుగుతాం" అని.

కుందేలుకు ఆ సమాధానమూ తృప్తినివ్వలేదు. చివరికి అది ఓ ఋషి ఆశ్రమానికి చేరింది. అక్కడ ఋషి కూర్చొని ఏవో ధర్మ గ్రంథాలు చదువుకుంటున్నాడు. "నేనెవరు స్వామీ" అడిగింది కుందేలు చేతులు జోడిస్తూ. "అది కనుక్కునేందుకే నేను ఇన్నేళ్లుగా తపస్సు చేస్తున్నానమ్మా కుందేలూ! నాకు ఇంకా ఈ జీవితం ఏంటో అర్థం కాలేదు" అన్నాడు ఋషి, విచారంగా.

అయితే కుందేలు సంతోషంగా ఎగిరి, నమస్కారాలు పెట్టి, ఉత్సాహంగా ఇంటి వైపుకు పరుగులు తీసింది. దానికి అర్థమైపోయింది- తను వేరెవరో కాదు, తను కుందేలు!" అని. అడవి మూల నుండి మరికొన్ని క్యారెట్లు పెరుక్కొని తింటూ అది ఉత్సాహంగా అనుకున్నది మళ్లీ మళ్లీ - "నేను కుందేలును! నేను కుందేలును!" అని.

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో