శివరాత్రి స్పెషల్ - సగ్గుబియ్యం ఖీర్ 

 

 

కావలసినవి:
సగ్గుబియ్యం - ఒక కప్పు 
పాలు - రెండు కప్పులు 
బెల్లం - పావు కేజీ  
యాలుకల పొడి - ఒక స్పూను 
బాదం పప్పు - పది
జీడిపప్పు - కొద్దిగా 
కుంకుమ పువ్వు - చిటికెడు 

 

తయారుచేసే విధానం:
ఖీర్ కోసం సన్నటి రకం సగ్గుబియ్యాన్ని ఎంపిక చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యం ట్రాన్స్‌పరెంట్‌గా వుంటాయి. ముందుగా సగ్గుబియ్యాన్ని ఒక గంట ముందు నీటిలో నానబెట్టాలి. ఇప్పుడు ఒక గిన్నెలో  నీళ్ళు పోసి మరుగుతుండగా బెల్లం వేసి రెండు నిముషాలు ఉడికించి, బెల్లం పూర్తిగా కరగబెట్టుకోవాలి. తరువాత మరొక గిన్నెలో పాలు పోసి బాగా మరిగించాలి. పాలు మరుగుతుండగా ముందుగా కరగబెట్టుకున్న బెల్లం పానకాన్ని పాలలో కలుపుకోవాలి. తర్వాత అందులో ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వేసి పది నిమిషాలు పాటు ఉడికించాలి. ఇప్పుడు ఒక బౌల్ స్టౌ మీద పెట్టి జీడిపప్పు, బాదం పప్పును వేయించుకోవాలి. వీటిని సగ్గుబియ్యం మిశ్రమంలో వేసుకోవాలి. అలాగే చిటికెడు కుంకుమ పువ్వు, యాలుకల పొడి కూడా వేసుకోవాలి. అంతే  ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం ఖీర్ రెడీ. మహా శివరాత్రి నాడు ఉపవాసం ముగించిన తర్వాత ఈ ఖీర్‌ను తింటే నోటికి రుచిగా వుండటం మాత్రమే కాదు... శక్తి కూడా తక్షణం వస్తుంది.