RELATED NEWS
NEWS
ఘనంగా ముగిసిన టాంటెక్స్ 73వ నెలనెలా తెలుగువెన్నెల

 

 

 

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక సమర్పించిన "నెల నెలా తెలుగు వెన్నెల" 73 వ సదస్సు ఆదివారం, ఆగస్ట్  18 వ తేది స్థానిక మయూరి రెస్టారెంటులో సాహిత్యవేదిక సమన్వయకర్త శ్రీమతి సింగిరెడ్డి శారద అధ్యక్షతన నిర్వహించబడినది. ప్రవాసంలో నిరాటంకంగా 73 నెలల పాటు ఉత్తమ సాహితీ వేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించడం ఈ సంస్థ విశేషం. డాల్లస్ ప్రాంతీయ భాషాభిమానులు, సాహితీ ప్రియులు అధిక సంఖ్యలో అత్యంత ఆసక్తితో ఈ సమావేశానికి విచ్చేసారు.

 

 

 

నంది పురస్కార గ్రహీత, స్థానిక గాయని శ్రీమతి నాగ సాహితి   ప్రార్థనా గీతంతో సభను ప్రారంభించారు. సాహిత్య వేదిక సమన్వయకర్త శ్రీమతి సింగిరెడ్డి శారద తమ స్వాగాతోపన్యాసంలో ప్రతి నెలాజరపు కొనే నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమానికి అందరికీ స్వాగతం తెలిపారు. వచ్చే నెలలో జరగబోయే నెలా తెలుగు వెన్నెల వార్షికోత్సవానికి అందరినీ ఆహ్వానించారు. సాహిత్యవేదిక మొదటి భాగం నవరసభరితమయిన కవితాపఠనంతో అత్యంత ఆసక్తికరంగా జరిగింది.  ప్రస్తుతం ప్రవాసంలో పర్యటిస్తున్న బి చుక్కయ్య గారు అల్లసాని పెద్దన కవితను చదివి వినిపించారు. శ్రీమతి పాలూరి సుజన గారు తన స్వీయ కవిత ‘అలలకు ఆవల’ ను వినిపించారు. యార్లగడ్డ లక్ష్మీనారాయణ గారు ‘సమాజం కోసం సాహిత్యం’ అనే విషయంపై మాట్లాడి సాహిత్యానికి గల భాద్యతను వివరించారు. రెండు రోజులలో జరుగబోయే రాఖీ పౌర్ణమి పండుగ గురించి ఒక చక్కటి కవితను శ్రీమతి నిమ్మగడ్డ సుబ్బలక్ష్మి గారు వినిపించారు. ఆ తరువాత  మద్దుకూరి విజయ చంద్రహాస్ గారు, అతి తక్కువ కాలం లోనే మహాకవి గా పేరొందిన గజ్జెల మల్లారెడ్డి గారు మూడనమ్మకాలపై వ్రాసిన  “భక్తి రసం” కవితను సభాసదులందరికి వినిపించారు.  సినారె గారి ‘తెలుగు వాడు’ పద్యాన్ని డా.జువ్వాడి రమణ గారు రాగయుక్తం గా పాడి అందరి మన్ననలు పొందారు.  వచ్చే నెలలో జరగబోయే నెల నెలా తెలుగు వెన్నెల వార్షికోత్సవానికి ఇదే మా ఆహ్వానం అంటూ శ్రీమతి సింగిరెడ్డి శారద  గారు మరొక్కసారి అందరికీ పేరు పేరునా ఆహ్వానాన్ని అందజేశారు.

 

 

 



సాహిత్యవేదిక సభ్యుడు పున్నం సతీష్ నేటి ముఖ్య అతిథి శ్రీ తుర్లపాటి ప్రసాద్ గారు మాట్లాడబోయే “ఆంధ్ర శతక సాహిత్యము – మానవ వనరుల నిర్వహణ” విషయాన్ని సభకు తెలియ చేస్తూ తెలుగు బాష ప్రాచీనతను, అందులో శతకాల విశిష్టతను వివరించారు. శ్రీ గుజ్జు ప్రసాద్ రెడ్డి గారు తన చిరకాల మిత్రుడు మరియు నేటి ముఖ్య అతిథి అయిన  శ్రీ తుర్లపాటి ప్రసాద్ గారిని  సభకు పరిచయం చేస్తూ  “ప్రవాస తెలుగు వారికి సుపరిచితులైన శ్రీ తుర్లపాటిప్రసాద్  గారు నాగపూర్ మరియు ఆంధ్రవిశ్వవిద్యాలయాల నుండి ఇంజనీరింగ్ పట్టాలు పుచ్చుకొన్నఅనంతరము దాదాపురెండు పుష్కరాల కాలం పాటు సమాచార సాంకేతిక రంగంలో ఉన్నత హోదాలలో విధులునిర్వహిస్తున్నారు. ప్రాచీన, ఆధునికకవితా శైలిల  విశ్లేషణ, పద్య పఠనం మీద ఆసక్తితో వివిధ పరిశోధనల ద్వారా తెలుగు సాహిత్యానికి మరింత దగ్గరయ్యారు. తెలుగుచందస్సుకు సంబంధించిన పరిశోధనా పత్రాలను అంతర్జాతీయ సదస్సులలో జనబాహుళ్యానికిపంచిపెట్టారు. శతక సాహిత్యంలో దాగిఉన్న మానవ వనరులను నిజజీవితంలో ఉపయోగిస్తూ, తెలుగుభాషా సాహిత్యాభివృద్ధికిఅత్యున్నతసేవలందిస్తున్నారు” అని కొనియాడుతూ, తుర్లపాటి గారిని వేదికపై ఆహ్వానించగా, ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం పూర్వధ్యక్షుడు రాజారెడ్డి గారు పుష్పగుచ్చంతో ప్రసంగకర్తకు స్వాగతం పలికారు.

 

 



శ్రీ తుర్లపాటి ప్రసాద్ గారు మొదటగా తన ప్రసంగంలో ఆంద్ర సాహిత్యంలో శతకాలను గురించి అందలి వివిధ ప్రక్రియలను గురించి వివరించారు. అందులో ముఖ్యంగా నీతి శతకాలను ప్రస్తావిస్తూ అందులో మన పూర్వీకులు ఎంతటి నిఘూడమైన యాజమాన్య రహస్యాలను పొందు పర్చారో ఉదాహరణలతో సహా తెలియచేసారు. ఆధునిక యాజమాన్య పద్దతులు ఎన్నో మన శతకాలలో దాగివున్నాయని, తను వాటిని అందరికీ పరిచయం చెయ్యడానికి చేస్తున్న ప్రయత్నాన్నీ వివరించారు. వారు ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న కంప్యూటర్ సాఫ్ట్ వేర్ శతకాలను విడమర్చడానికి, వాటి అభివృద్ధికి ఎలా దోహదపడుతుందో సభకు తెలియజేశారు.

 

 


ముఖ్య అతిథిని ప్రసంగానంతరం ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం అధ్యక్షుడు  మండువ సురేశ్, ఉత్తరాధ్యక్షుడు  కాకర్ల విజయమోహన్  మరియు  ఉపాధ్యక్షుడు డా. ఊరిమిండి నరసింహా రెడ్డి ముఖ్య అతిథిని శాలువతో సంయుక్తంగా  సత్కరించారు. తెలుగు సాహిత్య వేదిక కార్యవర్గ సభ్యులు శ్రీమతి సింగిరెడ్డి శారద, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, రొడ్డ రామకృష్ణ రెడ్డి, పున్నం సతీష్, ఆయులూరి బస్వి సంయుక్తంగా తుర్లపాటి గారిని జ్ఞాపికతో సత్కరించారు.  టాంటెక్స్ సంయుక్త కార్యదర్శి ఉప్పలపాటి కృష్ణారెడ్డి, కోశాధికారి శ్రీమతి ఇందు రెడ్డి మరియు కార్యవర్గ సభ్యులు వీర్ణపు చినసత్యం, చామకూర బాల్కి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



తెలుగు సాహిత్య వేదిక కార్యవర్గ బృందం వందన సమర్పణ చేస్తూ ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం వారి నెల నెలా తెలుగు వెన్నెల 73 వ సదస్సులో సాహిత్యం తో పాటు ఈ రోజుల్లో ఎంతో అవసరమైన యాజమాన్య పద్దతుల గురించి, ఉద్యోగాభివృద్ధికి మెలుకువల గురించి తెలియజేసినందుకు శ్రీ తుర్లపాటి ప్రసాద్ గారికి కృతఙ్ఞతలు తెలియచేసారు. కార్యక్రమానికి విచ్చేసిన వివిధ సాహితీ ప్రియులకు, వేదిక కల్పించిన స్థానిక  రెస్టారెంటు మయూరి యాజమాన్యానికి, ప్రసార మాధ్యమాలైన టీవీ5 (నసీం షేక్) లకు కృతఙ్ఞతా పూర్వక అభివందనములు తెలియజేసారు.

TeluguOne For Your Business
About TeluguOne
;