RELATED EVENTS
EVENTS
ఘనంగా ముగిసిన టాంటెక్స్ 79వ “నెలనెలా తెలుగువెన్నెల”

 

 

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక సమర్పించిన "నెల నెలా తెలుగు వెన్నెల" 79వ సదస్సు,  ఫిభ్రవరి 16వ తేది స్థానిక రుచి పాలస్ రెస్టారెంటులో అత్యంత వైభవంగా టాంటెక్స్ సంయుక్త కార్యదర్శి మరియు సాహిత్యవేదిక సమన్వయకర్త ఆదిభట్ల మహేష్ ఆదిత్య అధ్యక్షతన నిర్వహించబడినది. ప్రవాసంలో నిరాటంకంగా 79 నెలల పాటు ఉత్తమ సాహితీ విలువల నడుమ సదస్సులు నిర్వహించడం ఈ సంస్థ విశేషం. డాల్లస్ ప్రాంతీయ భాషాభిమానులు, సాహితీ ప్రియులు అధిక సంఖ్యలో అత్యంత ఆసక్తితో ఈ సమావేశానికి విచ్చేసారు.


ఆదిభట్ల మహేష్ ఆదిత్య తమ స్వాగాతోపన్యాసంలో ప్రతి నెలా జరపుకొనే నెల నెలా తెలుగు వెన్నెల కార్యక్రమానికి అందరికీ స్వాగతం తెలిపారు. చిన్నారి  ఏలేశ్వరపు స్నిగ్ధ ఒక అద్భుతమైన పాటతో కార్యక్రమం ప్రారంభమయింది. సాహిత్య వేదిక ద్వారా ప్రతి నెలా సాహిత్యాభిమానులు వారి వారి స్వీయ రచనలు సభాముఖంగా పంచుకోవడం ఆనవాయితీ. మాదిరాజు హరి ఈ సందర్భంగా పోతన భాగవతం నుంచి కొన్ని పద్యాలు వినిపించారు. ఆ తరువాత నందివాడ ఉదయభాస్కర్ వాడుక భాషలో పద్య రచన గురించి తన అభిప్రాయాన్ని ఒక కవితతో క్లుప్తంగా చెప్పారు.

 



శ్రీమతి సింగిరెడ్డి శారద “మాసానికో మహనీయుడు” శీర్షికలో భాగంగా  ఫిభ్రవరి నెలలో స్వర్గస్తులైన తాళ్లపాక అన్నమాచార్య గురించి సభకి వివరించారు. వారు వ్రాసిన అనేక పద్యాలూ, సంకీర్తనలు గురించి సభకు వివరిస్తూ, అన్నమాచార్యులు తెలుగు వారు కావడం మన పూర్వ జన్మ సుకృతం అని భావించాలసిందిగా గుర్తు చేసారు. తదుపరి మహనీయుడు అక్కినేని గురించి వివరిస్తూ సభలో సభ్యులు ఒక నిమిషం మౌనం పాటించడం జరింగింది. అక్కినేని ఒక మహానటుడు అని పేర్కొన్నారు. సిని జగత్తులో ఒక ధ్రువ తార రాలిందని, ఈ గాయం మరపురానిది అని తెలిపారు.



ఆదిభట్ల మహేష్ ఆదిత్య సభకి ముఖ్యఅతిథి శ్రీ. డొక్కా రామ్ గారిని పరిచయ వాక్యాలతో వేదిక పైకి ఆహ్వానించారు. వీరికి పాలేటి లక్ష్మి పుష్పగుచ్చాలతో స్వాగతం చెప్పారు.

 



డొక్కా రామ్ గారు సభని ఉద్దేసించి "వాడుక భాషలో పద్య రచన" అనే అంశం మీద  మాట్లాడుతూ వారు వ్రాసిన అనేక పద్యాలను సభతో పంచుకున్నారు. వారు పంచుకున్న హాస్య పద్యాలు స్థానిక సాహితీ ప్రియులను  విశేషంగా ఆకట్టుకున్నాయి. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా ఉంటూ, పద్యాలు, కవితలకు జీవం పొస్తున్నానన్ని పేర్కొన్నారు. అంతర్జాతీయ తెలుగు బడిని ఆరంభించడం ఒక అదృష్టంగా భావిస్తూ, ఆ బడిలో ఉన్న పాఠ్య ప్రణాళిక, పద్ధతులూ పదిమందికి ఉపయోగపడుతుందని ఆనందం వ్యక్త పరిచారు.

 


టాంటెక్స్ పాలకమండలి సభ్యులు డా. సి.ఆర్.రావు మరియు అధ్యక్షులు కాకర్ల విజయమోహన్ ముఖ్య అతిథి డొక్కా రామ్ గారిని దుశ్శాలువతో  సన్మానించారు.  సాహిత్య  వేదిక కార్యవర్గ సభ్యులు ఆదిభట్ల మహేష్ ఆదిత్య, సింగిరెడ్డి శారద, రొడ్డా రామకృష్ణా రెడ్డి, పున్నం సతీష్, దామిరెడ్డి సుబ్బు, బండారు సతీష్ సంయుక్తంగా  ముఖ్య అతిధిని ఙ్ఞాపికతో  సత్కరించారు. 

 

 


ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) తక్షణ పూర్వాధ్యక్షుడు మండువ సురేష్, ఉత్తరాధ్యక్షుడు డా. ఊరిమిండి నరసింహారెడ్డి, ఉపాధ్యక్షుడు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, కార్యదర్శి ఉప్పలపాటి కృష్ణా రెడ్డి, సంయుక్త కోశాధికారి శీలం కృష్ణవేణి మరియు కార్యవర్గ సభ్యులు చిట్టిమల్ల రఘు, పావులూరి వేణుమాధవ్ ఈ కార్యక్రమములో పాల్గొన్నారు.



తెలుగు సాహిత్య వేదిక సమన్వయకర్త ఆదిభట్ల మహేష్ ఆదిత్య వందన సమర్పణ చేస్తూ "నెల నెలా తెలుగు వెన్నెల" 79వ సదస్సులో ముఖ్య ప్రసంగం చేసిన  శ్రీ డొక్కా రామ్ గారికి కృతఙ్ఞతలు తెలియచేసారు. కార్యక్రమానికి విచ్చేసిన వివిధ సాహితీ ప్రియులకు, వేదిక కల్పించిన స్థానిక  రుచి పాలస్ రెస్టారెంటు యాజమాన్యానికి, ప్రసార మాధ్యమాలైన సతీష్ పున్నం, దేసిప్లాజా, ఏక్ నజర్,  రెడియోఖుషి , టీవీ9, తెలుగువన్ “టోరి” రేడియో, టీవీ5, లకు కృతఙ్ఞతా పూర్వక అభివందనములు తెలియజేసారు.

TeluguOne For Your Business
About TeluguOne
;