RELATED EVENTS
EVENTS
సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం సందర్శించిన శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి....

 

సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం సందర్శించిన శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి....

సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం భారతీయుల కీర్తిపతాకం అవుతుంది - శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి

క్యాలిఫోర్నియా : అంతర్జాతీయ ప్రమాణాలతో భారతీయ కళలలో శిక్షణ  అందించాలనే ఆశయంతో ఏర్పడిన సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం భారతీయుల కీర్తి పతాకం గా ప్రపంచ యవనిక పై రెపరెప లాడాలని  శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి మంగళాశాసనాలందించారు.  అమెరికా పర్యటనలో భాగంగా క్యాలిఫోర్నియా విచ్చేసిన స్వామివారు సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం సందర్శించారు. ఈ సందర్భంగా సిలికానాంధ్ర మనబడి ద్వారా ప్రవాస బాలలకు తెలుగు నేర్పే విధానాలని, సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం కార్యాచరణ ప్రణాళికలను సిలికానాంధ్ర సంస్థాపక అద్యక్షులు ఆనంద్ కూచిభొట్ల, మనబడి దీన్ రాజు చమర్తి, లు జీయర్ స్వామి వారికి వివరించారు.
 


ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ భవనం లో  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  మంగళా శాసనాలు అందిస్తూ జియర్ స్వామి వారు, తెలుగు భాష అత్యంత ప్రాచీనమైనదని, అందుకు ఎన్నో సాక్షాలున్నాయని, మాతృ భూమికి దూరంగా ఉన్నా, సిలికానాంధ్ర కుటుంబ సభ్యులందరూ చక్కటి తెలుగు సంప్రదాయ వస్త్రధారణతో రావడం, మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఆనందం కలిగించిందని, వీరు ప్రవాస తెలుగు వారందరికీ ఆదర్శప్రాయులని అన్నారు. అనంతరం త్రిదండి చిన జీయర్ స్వామి వారు  సిలికానాంధ్ర విశ్వవిద్యాలయం కర పత్రాలను, మనబడి కార్ స్టికర్ లను విడుదల చేసి మనబడి మరియు విశ్వవిద్యాలయాలు నిరంతరం అభివృద్ధి చెందుతాయని మంగళాశాసనాలందించారు.    కార్యక్రమంలో జెట్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారి ప్రజ్ఞ విద్యార్ధులు విష్ణు సహస్ర నామ అవధానం నిర్వహించి ప్రేక్షకుల ప్రశంసలందుకున్నారు. అడిగిన వెంటనే సహస్రనామం లోని శ్లోకాలను వల్లించి ఆశ్చర్యపరిచారు.  ఈ సందర్భంగా ఆనంద్ కూచిభొట్ల మాట్లాడుతూ, నడిచే నారాయుణుడు గా పిలవబడే జీయర్ స్వామి వారు, ఈ పవిత్ర ధనుర్మాసంలో విశ్వవిద్యాలయం ప్రాంగణం లో కాలు మోపడం ద్వారా విశ్వవిద్యాలయానికి మరింత పవిత్రత చేకూరిందని,  జెట్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలకు సిలికానాంధ్ర ఎల్లప్పుడూ సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని చెప్తూ, షమ్షాబాద్ లో తలపెట్టిన రామానుజుల వారి విగ్రహ స్థాపనలో అందరూ భాగస్వాములు కావాలని అభ్యర్దించారు.   ఈ సందర్భంగా ప్రఖ్యాత కళాకారులు మాస్ట్రో గజల్ శ్రీనివాస్ - తమ గజల్స్ తో ఆహూతులను పరవశింపజేసారు. కార్యక్రమం లో సిలికానాంధ్ర కార్యవర్గ సభ్యులు  దిలీప్ కొండిపర్తి, దీనబాబు కొండుభట్ల, ప్రభ మాలెంపాటి, గజల్ శ్రీనివాస్ ను సత్కరించారు.

 

TeluguOne For Your Business
About TeluguOne