ఏపీ బీజేపీ నేతల చీకటి డీల్! ఆ ఇద్దరిపై వేటు ఖాయమేనా...
Publish Date:Mar 1, 2021
Advertisement
దేశం మొత్తం మోడీ నేతృత్వంలోని బీజేపీ తన హవా చాటుకుంటుండగా ఏపీలో మాత్రం బీజేపీ నోటాతో పోటీ పడుతోంది. ఒకపక్క తెలంగాణలో ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తన దూకుడుతో పార్టీకి విజయాలు అందిస్తుండగా ఏపీలో మాత్రం పార్టీని బలోపేతం చేయకుండా.. కొంత మంది నేతలు పార్టీని భ్రష్టు పట్టించే పనులలో బిజీగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఏపీ బీజేపీలో కొత్తగా చక్రం తిప్పుతున్న ఇద్దరు నేతలు ఓ భారీ స్కాంలో పీకల్లోతు మునిగినట్లుగా తెలుస్తోంది. రాయలసీమలోని ఒక ప్రముఖ ఆశ్రమంలో గతేడాది జరిగిన ఐటీ, ఈడీ దాడుల కేసుల నుంచి బయట పడేస్తామంటూ ఆ ఇద్దరు నేతలు రూ. ముఫ్పై కోట్లను వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ స్కామ్ లో ఆ ఇద్దరు నేతల నిర్వాకం పై కేంద్ర నిఘా సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక ఒక కథనం ప్రచురించింది. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్కడెక్కడ సమావేశాలు జరిగాయి.. ఎవరి నుండి ఎంత వసూలు చేశారు.. ఏ బ్యాంక్ నుండి లావాదేవీలు జరిగాయి అన్న అంశాలపై కూడా పూర్తి వివరాలను కేంద్ర నిఘా సంస్థలు సేకరించి… కేంద్రానికి ఒక నివేదిక ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ స్కామ్ పై కేసు నమోదుకు కూడా ఆ సంస్థలు సిద్దమయ్యాయని వార్తలు వస్తున్నాయి. గత ఏడాది చిత్తూరు జిల్లాలో ఉన్న ఒక ప్రముఖ ఆశ్రమంలో ఐటి ఇడి సోదాలు జరిగాయి. ఆ సోదాలలో వందల కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్లుగా గుర్తించి పెద్ద ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. దీంతో ఆయా సంస్థలు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టడంతో.. ఈ కేసుల నుండి ఎలా బయటపడాలా అని ఆశ్రమ నిర్వాహకులు ఆలోచిస్తున్న సమయంలో రాయలసీమకు చెందిన ఒక బీజేపీ నాయకుడు ఈ వ్యవహారంలో తాను సహాయం చేస్తానని కబురు పెట్టాడు. తనకు కేబినెట్ మంత్రి హోదా పదవి ఉందని.. తాను చెబితే ఢిల్లీలో పని అవుతుందని ఆ నేత ఆశ్రమ నిర్వహకులను కన్విన్స్ చేసి.. ఈ కేసునుండి బయటపడేస్తామని చెప్పి మొత్తం 30 కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ఆయనతో పాటు రాష్ట్రానికి తరచూ వచ్చి వెళ్లే మరో ప్రముఖ బీజేపీ నేతతో చర్చించి రాయలసీమ నేత ఈ డీల్ సెట్ చేసుకున్నట్లుగా సమాచారం. ఇది ఇలా ఉండగా ఇప్పటికే కొంత మంది ఏపీ బీజేపీ నేతలు కేంద్రంలో ఉన్న అధికారాన్ని అడ్డుపెట్టుకుని దందాలకు అలవాటు పడ్డారన్న ప్రచారం జరుగుతోంది.. ఈ తాజా వ్యవహారంతో.. తమ సొంత ప్రభుత్వానికే ఆ ఇద్దరు బీజేపీ నేతలు దొరికిపోయినట్లుగా తెలుస్తోంది. మరో నాలుగు రోజుల్లో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా తిరుపతి పర్యటన ఉండడంతో.. అయన పర్యటన ముగిసిన తర్వాత ఆ ఇద్దరు నేతలపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రధాని మోడీ అవినీతిని ఏమాత్రం సహించరని.. దీంతో ఆ ఇద్దరు నేతలను పార్టీ నుండి సస్పెండ్ చేస్తారని కొంత మంది, కాదు కాదు వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపుతారని బీజేపీ నేతలు చెపుతన్నారు. ఈ వ్యవహారంలో బీజేపీ అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో త్వరలోనే తేలనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వస్తే ఆ నేతల రాజకీయ జీవితం ఇక్కడితో ముగిసిపోయినట్లేనని రాజకీయ పరిశీలకులు చెపుతున్నారు .
http://www.teluguone.com/news/content/two-ap-bjp-leaders-in-big-scam-hi-command-will-action-soon-39-110919.html