ఆంధ్రా మాల్యా..గోల్డ్స్టోన్ ప్రసాద్..!
Publish Date:Jun 1, 2017
Advertisement
హైదరాబాద్ శివార్లలో వెలుగులోకి వచ్చిన భారీ భూకుంభకోణం ప్రభుత్వవర్గాల్లోనూ..అధికారుల్లోనూ తీవ్ర అలజడి రేపుతోంది. సుమారు రూ.10 వేల కోట్ల విలువైన భూమిని అక్రమ రిజిస్ట్రేషన్ల ద్వారా పక్కదారి పట్టించినట్లు దర్యాప్తులో తేలింది. ఈ భూముల మళ్లింపు ద్వారా ప్రభుత్వానికి రూ.587.11 కోట్ల నష్టం వాటిల్లినట్లు అధికారులు పేర్కొన్నారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో రూ.10 వేల కోట్లు ఉంటుందని అంచనా. ఈ కుంభకోణం వెనుక దాగిఉన్న పెద్ద తలకాయలు ఎవరా అన్నది చర్చానీయాంశంగా మారింది. పలువురు రియల్టర్లు, గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు కలిసి రిజిస్ట్రేషన్ శాఖ అధికారులతో కుమ్మక్కై ఈ కుంభకోణానికి తెర లేపినట్లు సమాచారం. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశ్యంతో ప్రవేశపెట్టిన ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానాన్ని తమకు అనుకూలంగా మలుచుకున్న అక్రమార్కులు..తమ బండారం బయటపడకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో ఇందులో పాత్రధారులతో పాటు తెర వెనుక సూత్ర ధారులను పట్టుకునేందుకు పోలీసులు వేట ప్రారంభించారు. ఈ వ్యవహారాన్ని గుట్టు చప్పుడు కాకుండా నడిపించిన వ్యక్తి గోల్డ్ స్టోన్ ప్రసాద్ ఆచూకీ కోసం పోలీసులు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దేశం మొత్తం గాలిస్తున్నారు. అసలు ఎవరీ గోల్డ్స్టోన్ ప్రసాద్..? ఇప్పటి వరకు పోలీసులు చేసిన దర్యాప్తులో ప్రసాద్ చీకటి కోణాలు వెలుగులోకి వచ్చాయి. ఇతని పూర్తి పేరు పొన్నాపుల సంజీవ ప్రసాద్ అలియాస్ పిఎస్ ప్రసాద్ అలియాస్ గోల్డ్స్టోన్ ప్రసాద్. గోల్డ్ స్టోన్ గ్రూప్ ఛైర్మన్గా, మానసిక వైద్యుడిగా చలామణి అవుతూ దాని వెనుకే కబ్జాలు, సెటిల్మెంట్లతో భూదందా సాగిస్తున్న అతని నిజస్వరూపం వెలుగులోకి వస్తోంది. అతని ప్రస్థానం అనేక చీకటి కోణాల మయం. ఏకంగా అమెరికాలోని ఫైనాన్షియల్ సంస్థలకు టోకరా వేసి ఘనత వహించిన అమెరికా దర్యాప్తు సంస్థలనే ముప్పుతిప్పలు పెట్టిన ఘనుడు. లేని ఆస్తులను ఉన్నట్లు చూపించి బీసీసీఐ బ్యాంక్ నుంచి 16.8 మిలియన్ డాలర్లు, 1.4 మిలియన్ డాలర్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి, 1.5 మిలియన్ డాలర్లు బ్యాంక్ ఆఫ్ ఒమన్ నుంచి, బ్రాంచ్ బ్యాంక్ అండ్ ట్రస్ట్ కంపెనీ ఆఫ్ నార్త్ కరోలినా నుంచి 2.5 మిలియన్ డాలర్లు , ఇలా మొత్తం 27 మిలియన్ డాలర్ల లోన్ను మంజూరు చేయించుకున్నారు. బీసీసీఐ బ్యాంక్ నుంచి రుణాన్ని మంజూరు చేయించుకునేందుకు గాను బ్యాంక్ ఛైర్మన్కు 2.50 లక్షల డాలర్లు, చీఫ్ క్రెడిట్ మేనేజర్కు లక్ష డాలర్లు లంచం ఇచ్చినట్లు గోల్డ్స్టోన్ ప్రసాద్పై అభియోగాలున్నాయి. ఇచ్చిన రుణం వెనక్కు రాకపోవడం..తదితర కారణాలతో అనతి కాలంలోనే బీసీసీఐ బ్యాంక్ దివాళా తీసింది. ఉన్నపళంగా ఈ బ్యాంక్ దివాళాకు కారణమేంటో తెలుసుకోవాలని ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఒక దర్యాప్తు కమిటీని నియమించింది. ఇక్కడే ఉంటే తన బాగోతం బయటపడుతుందని భావించిన ప్రసాద్ అమెరికా నుంచి మెల్లగా జారుకున్నాడు. ఈ కేసుతో అతనికి world's most wanted fugitiveగా పేరు వచ్చింది. భారత్కు తిరిగివచ్చిన తన పలుకుబడితో మళ్లీ కంపెనీలు ప్రారంభించాడు..అప్పట్లో ఓ మాజీ ప్రధాని, ఇతర ప్రముఖులతో ఉన్న సాన్నిహిత్యం ఉండటంతో ఇతను ఆడింది ఆట, పాడింది పాటగా సాగింది. మాజీ ప్రధానికి అత్యంత సన్నిహితులుగా ముద్రపడ్డ సతీశ్ శర్మ అతని సోదరుడు గ్యారీ శర్మ గోల్డ్స్టోన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. హైదరాబాద్ను తన కార్యకలాపాలకు కేంద్ర స్థానంగా మార్చిన ప్రసాద్కు ఉమ్మడి ఏపీకి పీసీసీ చీఫ్గా పనిచేసి ప్రస్తుతం టీఆర్ఎస్లో కీలకపాత్ర పోషిస్తున్న నేత బాగా దగ్గరయ్యాడు. ఇంకేముంది రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ ఒకే పార్టీ అధికారంలో ఉండటంతో తనలోని కబ్జాదారుడిని మెల్కొలిపాడు. సాధారణ ప్రజల భూముల నుంచి ప్రభుత్వ భూములను హామ్ ఫట్ చేస్తూ అతని దందా సాగింది..ప్రసాద్ కబ్జాల గురించి శివారు ప్రాంతాల ప్రజలు కథలు, కథలుగా చెప్పుకుంటారు. నిజాం కుటుంబానికి చెందిన అత్యంత విలువైన భూములను కూడా అక్రమంగా ప్రసాద్ అనుచరులు రాయించుకున్నట్లు ఫిర్యాదులున్నాయి. ఖుర్షీద్ జాహి ఎస్టేట్కు చెందిన రూ.40 వేల కోట్ల రూపాయల విలువైన భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని హామీద్ ఉన్నీసాబేగం గతంలో ముఖ్యమంత్రులను కలిసి ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. తాను ఏం చేసినా అడిగేవారు లేరని ఇప్పుడు ఏకంగా అతిపెద్ద భూకుంభకోణానికే తెరదీశాడు. అప్పుడు బీసీసీఐ బ్యాంక్ అధికారులు సహకరించినట్లుగానే ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ రాచకోండ శ్రీనివాస్, అధికారులు, బడా రాజకీయ నేతలు ప్రసాద్ పనిలో తలో చేయ్యి వేసి ప్రభుత్వానికి వందల కోట్లు నష్టం చేకూర్చారు. అడ్డూ అదుపు లేకుండా పెద్ద ఎత్తున భూకబ్జాలు, లావాదేవీలు జరుపుతున్నా ఇంతవరకు ఆయన పేరు గానీ..ఆయన పై ఫిర్యాదు కానీ నమోదు కాలేదంటే ఎంతటి బలమైన వ్యక్తులు ప్రసాద్ వెనుకున్నారో అర్థం చేసుకోవచ్చు. కానీ పాపం పండినప్పుడు ఎంతటి పలుకుబడి ఉన్నా..ఎవరున్నా తప్పించుకోలేరు..
http://www.teluguone.com/news/content/miyapur-land-scam-45-75278.html