హరీశ్, ఈటల జంపేనా! రేవంత్ చెప్పిందే నిజమా?
Publish Date:Mar 1, 2021
Advertisement
రేవంత్ రెడ్డి మాట వెనుక మర్మం దాగుంటుంది. ఆయన నెట్ వర్క్ ఓ రేంజ్ లో ఉంటుంది. రేవంత్ ఒక డైలాగ్ వేశారంటే దానికి ఎంతో లెక్క ఉంటుంది. తెలంగాణ ఆక్టోపస్ రేవంత్ రెడ్డి. గతంలో టీఆర్ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి పార్టీని వీడుతారని అందరికన్నా ముందే చెప్పింది రేవంత్ రెడ్డినే. అచ్చం ఆయన చెప్పినట్టే జరిగింది. అప్పటి వరకూ కొండాపై ఎవరికీ అనుమానం లేకుండే. కానీ, రేవంత్ చెప్పినట్టే జరిగింది. కొన్ని రోజులకే ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ ను వీడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. లేటెస్ట్ గా రేవంత్ రెడ్డి మరో బాంబు వేశారు. టీఆర్ఎస్ లో ఇప్పటికే మంత్రి ఈటల రాజేందర్ పని అయిపోయిందని.. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత హరీశ్ రావు పని కూడా అయిపోతుందని రేవంత్ రెడ్డి సంచలన కామెంట్లు చేశారు. ఈసారి కూడా రేవంత్ రెడ్డి చెప్పినట్టే జరుగుతుందా? అధికార పార్టీలో అలజడి పక్కానా? ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్. హరీశ్ రావు పని అయిపోయిందా? కల్వకుంట్ల ఫ్యామిలీలో జరిగే రాజకీయ డ్రామా ఓ పట్టాన బయటి వారికి అర్థం కాదు. ఒక్క రేవంత్ రెడ్డికి తప్ప. మామకు అల్లుడి గండం ఉందంటూ మొదటి నుంచీ ప్రచారం. హరీశ్ రావు ఎప్పటికైనా ఏకు మేకవుతాడని కేసీఆర్ కు భయం. అందుకే, కొడుకు కేటీఆర్ కు లైన్ క్లియర్ చేసేందుకు.. హరీశ్ ను నెంబర్ టూ పొజిషన్ నుంచి తప్పించారు. నెంబర్ జీరో చేశారు. ఒకప్పటి ట్రబుల్ షూటర్ ఇప్పుడు ట్రబుల్స్ లో ఉన్నారు. హరీశ్ రావు పేరుకే టీఆర్ఎస్ లో ఉన్నారు. పార్టీలో ఆయన రోల్ జీరో. పేరుకే ఆయన ఆర్థిక మంత్రిగా మంచి పదవిలో ఉన్నారు. ప్రభుత్వంలో ఆయనకు జరిగే మంచంటూ ఏమీ లేదు. హరీశ్ రావు కారు పార్టీకి గోడ మీది పిల్లిలా మారారని అంటుంటారు. ఇలా కేసీఆర్ గ్రాఫ్ పడిపోగానే.. పార్టీని చీల్చి అలా జంప్ అయిపోదామనే ఆలోచనతో ఉన్నాడనేది కొందరి మాట. గత ఎన్నికల్లో గజ్వేల్ లో స్వయానా కేసీఆర్ ను ఓడించేందుకు హరీశ్ రావు ప్రయత్నించారని అప్పటి కాంగ్రెస్ పార్టీ అభ్య్రర్థి ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఏకంగా బహిరంగ సభ వేదిక మీది నుంచే ప్రకటించడం సంచలనం. హరీశ్ రావు కుట్రలు ఆ రేంజ్ లో ఉంటాయని చెబుతుంటారు. హరీశ్ రావుతో పడలేకే, ఒకప్పటి టీఆర్ఎస్ కీలక నేత, ప్రస్తుతం బీజేపీలో ఉన్న రఘునందన్ రావు పార్టీని వీడారు. కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సైతం హరీశ్ రావు అంటే వామ్మో అంటారు. అంతటి ఖతర్నాక్ లీడర్ హరీశ్ రావు. అంతకుమించి మాస్టర్ మైండ్ కేసీఆర్. అందుకే మామ ముందు అల్లుడి పప్పులేమీ ఉడకడం లేదట. ఇక మామ చెంతన ఉంటే తనకు భవిష్యత్ ఉండదని భావిస్తున్న హరీశ్.. అదును కోసం ఎదురు చూస్తున్నారని చెబుతుంటారు. దుబ్బాక ఎన్నికతో పార్టీలో హరీశ్ రావు ఇమేజ్ దారుణంగా డ్యామేజ్ అయింది. అందుకే, ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత హరీశ్ రావు పని అయిపోతుందని రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ త్వరలోనే నిజమైనా ఆశ్చర్యపోనక్కరలేదు అంటున్నారు. ఈటల పని కూడా అయిపోయిందా? ఆరోగ్యశాఖ మంత్రి ఈటల. ఉద్యమ సమయంలో పార్టీలో నెంబర్ టూ. ఫస్ట్ టర్మ్ ప్రభుత్వంలోనూ టాప్ ప్లేస్. సెకండ్ టర్మ్ వచ్చే సరికి అంతా ఉల్టా పల్టా. ఈటల పార్టీని వీడిపోతారంటూ ఒకటే ప్రచారం. కేసీఆర్ తో విభేదాలంటూ లీకులు. ప్రచారానికి తగ్గట్టే పరిస్థితులూ కనిపిస్తున్నాయి. కీలకమైన ఆర్ధికం నుంచి ఆరోగ్యానికి డిమోషన్. అంతర్గత సమావేశాల సమాచారం మీడియాకు, విపక్షాలకు లీక్ చేస్తున్నారంటూ ఈటలను దోషిగా నిలబెట్టే ప్రయత్నం. అందుకే, ఒళ్లు మండి, తీవ్ర అసహనానికి లోనై.. కడుపులోని ఆవేశం బయటకు కక్కేశారు ఈటల. గులాబీ జెండాకు అసలైన ఓనర్లం తామేనంటూ గులాబీ బాస్ పై ఎర్రజెండా ఎగరేశారు మంత్రి ఈటల. ఆ తర్వాత నుంచీ పార్టీలో ఆయన ప్రాధాన్యం మరింత తగ్గుతూ వస్తోంది. ఈలోగా కరోనా రావడంతో కేవలం ఆరోగ్య శాఖ కార్యకలాపాలకు మాత్రమే పరిమితమయ్యారు. ఇటు పార్టీ, అటు ప్రభుత్వంలో ఈటల గ్రాఫ్ రోజురోజుకీ పడిపోతోంది. తాజాగా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి టీఆర్ఎస్ సన్నద్ధతపై సీఎం కేసీఆర్ నిర్వహించిన సమీక్షా సమావేశానికి మంత్రి ఈటల రాజేందర్కు ఆహ్వానం అందలేదు. ఆయన ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూరాబాద్ నియోజకవర్గంలోని పలు గ్రామాలు వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలోకి వస్తాయి. అంటే, వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం పరిధిలో ఈటల సొంత నియోజకవర్గం గ్రామాలూ ఉన్నాయి. అయినప్పటికీ.. ఆయనను సీఎం వద్ద జరిగిన భేటీకి పిలవలేదు. ఈటల వైఖరి మారిన కారణంగానే ఆయనను టీఆర్ఎస్ అధిష్ఠానం కొంత దూరం పెడుతున్నట్లు ఇప్పటికే పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో కరీంనగర్ నుంచి టీఆర్ఎస్ తరఫున ఎంపీగా పోటీ చేసిన వినోద్ కుమార్ కు ఈటల రాజేందర్ సహకరించలేదని, ఆయన కుట్రతోనే వినోద్ కుమార్ ఓడిపోయారని.. అప్పటి నుంచి కేసీఆర్ ఈటల రాజేందర్ ను పక్కన పెట్టారని అంటుంటారు. ఈటల సైతం కేసీఆర్ తీరుపై తీవ్ర అసహనంతో రగిలిపోతున్నారని.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం కోసం వేచి చూస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. లేటెస్ట్ గా రేవంత్ రెడ్డి సైతం టీఆర్ఎస్ లో ఈటల పని అయిపోయిందని అనడంతో.. ఇక ఈటల పని అయిపాయ్.. అంటూ అంతా ఫిక్స్ అయిపోతున్నారు. టీఆర్ఎస్ లో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన ఇద్దరు నేతలు ఈటల, హరీశ్ రావుల ప్రభ ఇప్పుడు మసకబారిపోయింది. తెలంగాణ ఆక్టోపస్ రేవంత్ రెడ్డి చెప్పినట్టు త్వరలోనే వారిద్దరి పని అయిపోతుందా? అనే చర్చ మొదలైంది. ఏమో.. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.
http://www.teluguone.com/news/content/harish-rao-etela-rajender-will-quit-trs-soon-39-110923.html