అప్పుడు విశాఖ.. ఇప్పుడు రేణిగుంట.. పోరాట యోధుడు చంద్రబాబు
Publish Date:Mar 1, 2021
Advertisement
ఫిబ్రవరి 27, 2020. విశాఖ విమానాశ్రయం ముందు యుద్ధ వాతావరణం. వైజాగ్ ను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా ప్రకటించాక ప్రజా చైతన్య యాత్ర కోసం విశాఖ పర్యటనకు వెళ్లారు ప్రతిపక్ష నేత చంద్రబాబు. టీడీపీ అధినేతను బలవంతంగా అడ్డుకున్నారు వైసీపీ మూకలు. వైసీపీ శ్రేణులు విధ్వంసకారులుగా మారి చంద్రబాబు కాన్వాయ్ ను విమానాశ్రయం ముందు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులను అడ్డుకోవాల్సిన పోలీసులు చేతులెత్తేశారు. పరోక్షంగా వైసీపీ శ్రేణులకు సహకరించారు. పరిస్థితి అదుపు తప్పుతున్నా.. నిరసనకారుల రూపంలో ఉన్న అధికార పార్టీ కార్యకర్తలను కట్టడి చేయలేదు. పోలీసుల తీరును తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు చంద్రబాబు. విశాఖలో పర్యటించే తన ప్రజాస్వామ్య హక్కును కాలరాస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాకీల తీరుకు నిరసనగా వాహనం దిగి ఎయిర్ పోర్టు ముందు రోడ్డుపై బైఠాయించారు. చంద్రబాబు తీసుకున్న అనూహ్య నిర్ణయానికి ఖాకీలు కంగుతిన్నారు. చంద్రబాబును నిరసన విరమించాల్సిందిగా కోరారు. అందుకు ప్రతిపక్ష నేత ససేమిరా అన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు చంద్రబాబుని అదుపులోకి తీసుకున్నారు. తనను ఎందుకు అరెస్టు చేయాలనుకుంటున్నారో పోలీసు అధికారులు తమకు లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఖాకీలు బలవంతంగా చంద్రబాబును విమానాశ్రయం నుంచి వెనక్కి పంపించారు. అప్పట్లో ఈ ఘటన పెను సంచలనంగా మారింది. తనను ఎయిర్ పోర్టు ముందు అడ్డుకోవడం, విమానాశ్రయం నుంచి బలవంతంగా వెనక్కి పంపించడంపై చంద్రబాబు ఆ తర్వాత కోర్టును ఆశ్రయించారు. ఆ కేసులో పోలీసుల తీరుపై హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏడాది క్రితం విశాఖలో జరిగిన ఘటనపై అప్పట్లో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అయినా వారిలో ఏమాత్రం మార్పు వచ్చ్చినట్టు లేదు. తాజాగా, చంద్రబాబు చిత్తూరు పర్యటన సందర్భంగా రేణిగుంట విమానాశ్రయంలో చంద్రబాబును మరోసారి అడ్డుకొని ఖాకీలు విమర్శల పాలవుతున్నారు. ప్రతిపక్ష నేతను ఇబ్బందుల పాలు చేసేందుకే పోలీసులు ఇలా ఓవరాక్షన్ చేస్తున్నారంటూ టీడీపీ శ్రేణులు, ప్రజలు మండిపడుతున్నారు. ఓ పార్టీ అధినేతగా, ప్రతిపక్ష నేతగా చిత్తూరులో పర్యటించే హక్కు చంద్రబాబుకు ఉంది. ఆ మేరకు ఎన్నికల కమిషన్ నుంచి అనుమతి కూడా తీసుకున్నట్టు చంద్రబాబు తెలిపారు. పోలీసులు SEC పర్మిషన్ గురించి తమకు తెలియదంటూ బాబును అడ్డుకోవడం హాస్యాస్పదంగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. పోలీసులు కావాలనే ఇలా చేస్తున్నారనే చర్చ జరుగుతోంది. ముందస్తు ఏర్పాట్లతో, నోటీసులు సిద్ధం చేసుకొని మరీ పోలీసులు చంద్రబాబును విమానాశ్రయంలో నిర్బంధించారని ఆరోపిస్తున్నారు. చంద్రబాబు సాధారణ వ్యక్తి ఏమీ కారు. ఆంధ్రప్రదేశ్ నుంచి అమెరికా వరకూ సీబీఎన్ అంటే తెలియని వారుండరు. అంతటి స్థాయి ఉన్న నాయకుడిని అడుగు ముందుకు వేయనీయకుండా అడ్డుకోవడం.. ఎయిర్ పోర్టు లాంజ్ లోనే కట్టడి చేయడం పోలీసుల ఓవరాక్షన్ కు నిదర్శనం అంటున్నారు. ఆయనేమైనా సంఘవిద్రోహ శక్తా? చంద్రబాబు నుంచి సెల్ ఫోన్ లాక్కోవడం ఏంటి? ఇదేమైన చిన్న విషయమా? ఇంత కంటే అవమానం ఇంకేముంటుంది? ప్రతిపక్ష నేతకు ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓ జిల్లాలో పర్యటించే అధికారం లేదా? అందులోనూ చంద్రబాబు సొంత జిల్లాలోనే ఆయనను పర్యటించకుండా అడ్డుకొని పైశాచిక ఆనందం పొందడం ఏంటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. బాబు నుంచి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకోవడం మరింత దారుణమని మండిపడుతున్నారు. పోలీసుల తీరును చంద్రబాబు గట్టిగా వ్యతిరేకించారు. తానేమైన హత్య చేయడానికి వెళుతున్నానా? తననెందుకు అడ్డుకుంటున్నారంటూ ప్రశ్నించారు. పదండి కలెక్టర్, ఎస్పీ దగ్గరికే వెళ్దామన్నా అక్కడి వారు వినిపించుకోలేదు. అందుకే, విమానాశ్రయంలో బైఠాయించి నిరసన తెలిపారు చంద్రబాబు. తగ్గేదే లేదు. ప్రజల దగ్గరికి వెళ్లకుండా తనను అడ్డుకోలేరంటూ చంద్రబాబు ట్విట్టర్ లోనూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు స్థాయి వ్యక్తి అలా ఒంటరిగా నేలపై కూర్చొని నిరసన తెలపి దృశ్యాలు అందరినీ కలిచి వేస్తున్నాయి. ఎంతటి నేతను ఎంతలా వేధిస్తున్నారంటూ ప్రజలు మండిపడుతున్నారు. సొంత జిల్లా పర్యటనకు వెళితే అడ్డుకోవడమేంటని ప్రభుత్వం తీరును అసహ్యించుకుంటున్నారు. అంతలోనే చంద్రబాబు పోరాట నైజం, ధైర్యం చూసి అంతా ఆయనకు మద్దతు తెలుపుతున్నారు.
http://www.teluguone.com/news/content/ap-police-over-action-on-chandra-babu-people-fire-on-jagan-govt-39-110913.html