బీజేపీ దేశాన్ని అమ్మేస్తోంది! 50 ప్రశ్నలు సంధించిన కేటీఆర్
posted on Nov 24, 2020 @ 3:29PM
బీజేపీకి అవకాశం ఇస్తే హైదరాబాద్ను కూడా అమ్మేస్తారని విమర్శించారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. ఇప్పటికే మోడీ సర్కార్ భారతదేశాన్ని అమ్మేస్తోందని ఆరోపించారు. అన్నింటినీ ప్రైవేట్పరం చేయడమే బీజేపీ పాలసీ అన్నారు కేటీఆర్. రైల్వే రంగాన్ని ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారో చెప్పాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయని హామీలంటూ బీజేపీ విడుదల చేసిన ఛార్జ్షీట్పై మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చాడు. బీజేపీ నేతలు గోబెల్స్ కజిన్స్లా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కేంద్రం మంత్రులు సైతం అస్యతాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల కష్టాలను తీర్చినందుకా టీఆర్ఎస్ ప్రభత్వుంపై చార్జ్షీట్ విడుదల చేశారని బీజేపీ నేతలను ప్రశ్నించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో రైతుబంధు అమలు చేస్తున్నామని చెప్పారు. దేశంలో ఎక్కడలేని విదంగా 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణాయే అన్నారు. తెలంగాణ నెంబర్ వన్ రాష్ట్రమని కేంద్రమంత్రులు చెప్పారని గుర్తుచేశారు.
బీజేపీకి 50 ప్రశ్నలు సంధించారు కేటీఆర్. లోయర్ సీలేరును తీసుకెళ్లి ఏపీలో కలిపింది బీజేపీ కాదా?అని ప్రశ్నించారు. పేకాట క్లబ్లు మూసివేయించినందుకా మాపై ఛార్జిషీట్? లక్షల మంది చిరు వ్యాపారుల పొట్టగొట్టారు.. వారు భాజపాపై ఛార్జిషీట్ వేయాలి. కరోనా సమయంలో చనిపోయిన వలస కార్మికుల ఆత్మలు ఛార్జిషీట్ వేయాలి అన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెడుతున్నందుకు బీజేపీపై రైతులు ఛార్జిషీట్ వేయాలన్నారు. పెట్టు బడుల ఉపసంహరణ దేశ భవిష్యత్ కోసమా.. గుజరాత్ పెద్దల కోసమా? అని ప్రశ్నించారు. ఐటీఐఆర్ రద్దు చేసింది ఎవరు? ఆరేళ్ల లో హైదరాబాద్కు బీజేపీ ఏం చేసిందో చెప్పగలరా? అని బీజేపీ నేతలను నిలదీశారు. ఇంటింటికి మంచి నీళ్లు, వేలాది గురుకులాలు పెట్టి పేద విద్యార్థులను చదివిస్తున్నందుకే టీఆర్ఎస్పై చార్జ్షీట్ విడుదల చేశారా? అని బిజేపీ నేతలను ప్రశ్నించారు కేటీఆర్.