Read more!

బిగ్‌బాస్ షో చూపిస్తూ క్లిష్టమైన సర్జరీ! గుంటూరు వైద్యుల ఘనత

గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యులు అద్భుతం చేశారు. ఓ రోగి మెదడులో మాటలు, సంభాషణకు అత్యంత కీలకమైన ప్రాంతంలో శస్త్రచికిత్స చేయాల్సి రావడంతో వైద్యులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించారు. అతడిని మెలకువగా ఉంచి బిగ్‌బాస్ షో, అవతార్ సినిమాను చూపిస్తూ విజయవంతంగా ఆపరేషన్ చేశారు. క్లిష్టమైన సర్జరీని ఈజీగా పూర్తి చేసి ఘనత సాధించారు గుంటూరు డాక్టర్లు. ఈ ఆపరేషన్ చేసిన వైద్యులలో ముగ్గురు గుంటూరు సర్వజన ఆసుపత్రికి చెందిన వారే కావడం మరో విశేషం.

 

గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం పాటిబండ్లకు చెందిన వరప్రసాద్ కు 2016లో హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో బ్రెయిన్ ట్యూమర్‌కు శస్త్రచికిత్స జరిగింది. అయితే గత కొన్ని నెలలుగా అతనికి ఫిట్స్ వస్తుండడంతో గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు మెదడులో కణితి మళ్లీ పెరుగుతున్నట్టు గుర్తించారు. దానిని తొలగించేందుకు మెదడు త్రీడీ మ్యాప్‌ను సిద్ధం చేసుకుని కణితి ఎక్కడుందో గుర్తించి సరిగ్గా అక్కడ మాత్రమే కపాలాన్ని తెరిచి ఆపరేషన్ చేసి తొలగించారు.

 

మనిషి మాట్లాడేందుకు ఎంతో కీలకమైన ప్రాంతంలో ఆపరేషన్ చేయాల్సి రావడంతో డాక్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. రోగిని మెలకువగా ఉంచి, మాట్లాడిస్తూ ఈ సర్జరీ చేయాల్సి ఉంది. దీంతో రోగికి టీవీలో బిగ్‌బాస్ షో, అవతార్ సినిమాను చూపిస్తూ విజయవంతంగా సర్జరీ పూర్తి చేశారు. రోగి వరప్రసాద్‌ పూర్తిగా కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి కూడా డిశ్చార్జ్ చేశారు. వరప్రసాద్ కు బీమా సౌకర్యం ఉండడంతో సర్జరీకి పైసా కూడా ఖర్చు కాలేదని వైద్యులు తెలిపారు. అరుదైన ఘనత సాధించిన డాక్టర్లపై ప్రశంసల జల్లు కురుస్తోంది.