'టైమ్స్’ కవర్ పై ఢిల్లీ ఆందోళన
posted on Mar 5, 2021 @ 4:36PM
గత నాలుగు నెలలకు పైగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో సాగుతున్న రైతుల ఆందోళన ఇప్పటికే అంతర్జాతీయ సమాజం దృష్టిని,అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించింది. సోషల్ మీడియాలో సపోర్ట్ సంపాదించింది. అదొక వివాదంగా కూడా మారింది. కోర్టులు,కేసులు, అరెస్టులు విచారణలు సాగుతున్నాయి. ఇప్పుడు మహిళా రైతుల ఆందోళన ఏకంగా ‘టైమ్స్ మ్యాగజిన్’ కవర్ పేజీ ముఖ చిత్రంగా వచ్చింది.
అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా టైమ్స్ మ్యాగజైన్’ ప్రత్యేక సంచికను విడుదల చేసింది. ఆ ప్రత్యేక సంచిక ముఖ చిత్రంగా ఢిల్లీ ఉద్యమంలో పాల్గొన్న మహిళల ఫోటోను, “నన్ను బెదిరించ లేరు ... నన్ను కొనలేరు” అనే మకుటంతో ముఖ్య చిత్ర కథనాన్ని ప్రచురించింది. ఆందోళనలో పాల్గొన్న పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ మహిళా రైతుల అనుభవాలు, అనుభూతులతో పాటుగా, రైతులు వ్యతిరేకిస్తున్న మూడు వ్యవసాయ చట్టాలకు సంబంధించిన విశేషాలను ఫోటోలో ప్రతిబించేలా ఉంది.
మన దేశంలో మహిళలు లింగ వివక్ష, లైంగిక హింస, అత్యాచారాలు,పితృస్వామ్య వ్యవస్థలకు వ్యతిరేకంగా సాగిస్తున్న పోరాటాల గురించి కూడా పత్రిక ప్రస్తావించిందిట. అయితే పత్రిక ప్రచురించిన కథనంలో ఇంకా ఏయే అంశాలు ఉన్నాయో పూర్తిగా తెలియదు, పత్రిక కవర్ పేజీని మాత్రమే ట్వీట్ చేసింది. పత్రిక మార్కెట్ లోకి వస్తేనే కానీ ‘టైమ్స్ మ్యాగజైన్’ ఏ ఉద్దేశంతో ఈ కథనం ప్రచురించిందో తెలియదు.
అయితే మెల్లి మెల్లిగా చల్లారుతున్న రైతు ఉద్యమాన్ని మళ్ళీ రగిల్చేందుకు, జరుగతున్న ప్రయత్నాలలో ఇది కూడా భాగం కావచ్చన్న అనుమానాలు అప్పుడే మొదలయ్యాయి. ఇప్పటికే మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని, ‘కిసాన్ మహిళా దివస్’ గా నిర్వహించాలని ఆందోళనకారులు నిర్ణయించారు. ఈ నేపధ్యంలో ‘టైమ్స్ మ్యాగజిన్’ కథనం విషయంలో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.