నాలుగు రాజధానులకు జై కొట్టిన మమత!
posted on Jan 23, 2021 @ 4:42PM
పశ్చిమ బెంగాల్ లో పాగా వేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీతో పోరాటం చేస్తున్న మమతా బెనర్డీ దూకుడు పెంచారు. బెంగాల్ లో అధికారంలో నరేంద్ర మోడీ, అమిత్ షా ద్వయం వేస్తున్న ఎత్తులను చిత్తు చేసేలా కొత్త ఎత్తులు వేస్తున్నారు. నేతాజి సుభాష్ చంద్ర బోస్ ను ఎన్నికల్లో తమ అస్త్రంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్న కమలనాధులను ఇరుకున పెట్టేలా ఆమె కొత్త నినాదం తెరపైకి తెచ్చారు. భారత దేశానికి నాలుగు రొటేటింగ్ రాజధానులు ఉండాలన్నారు మమతా బెనర్జీ. కోల్కతాను రాజధానిగా చేసేకొని అప్పట్లో ఆంగ్లేయులే పాలించారని, అలాంటప్పుడు దేశవ్యాప్తంగా ఒకే రాజధాని ఎందుకు ఉండాలని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125 జయంతి ఉత్సవాల్లో భాగంగా మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. నేతాజీ జయంతిని పురస్కరించుకొని కేంద్రం జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని ఆమె డిమాండ్ చేశారు. దేశ్నాయక్ దివాస్గా జరుపుకునే నేతాజీ పుట్టిరోజు గురించి మనందరికీ తెలిసినా, ఆయన మరణం గురించి మాత్రం ఎవరికీ తెలియదని అన్నారు. మాతృభూమిపై సమానంగా నేతాజీపై ప్రేమ ఉన్నది కొద్ది మందికే అన్నారు బెంగాల్ సీఎం. కొందరు మాత్రం ఎలక్షన్స్ను దృష్టిలో ఉంచుకొని అధికారం కోసం ఆయన సంబరాలు నిర్వహిస్తున్నారంటూ బీజేపీని పరోక్షంగా విమర్శించారు టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ.