Read more!

శశికళతో అమిత్ షా డీల్! స్టాలిన్ టార్గెట్ గా నయా ప్లాన్ 

తమిళనాడు రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. అన్నాడీఎంకేకు షాకిస్తుందని భావించిన శశిక.. సడెన్ గా రాజకీయాల నుంచి అస్త్రసన్యాసం చేయడం సంచలనంగా మారింది. రాష్ట్ర రాజకీయాలను మరో మలుపు తిప్పుతారని భావిస్తున్న చిన్నమ్మ.. అర్థాంతరంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని  ప్రకటన చేయడం తీవ్ర చర్చగా మారింది. 

మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలిగా, చిన్నమ్మగా పరిచయమైన శశికళ.. నాలుగు సంవత్సరాల జైలు శిక్ష అనంతరం గత నెలలో విడుదలైంది. దీంతో అన్నాడీఎంకేలోని ఓ వర్గం తిరిగి తమకు మంచిరోజులు వస్తాయని భావించింది. ఆమె దగ్గరి బంధువు టీటీవీ దినకరన్, ఏకంగా తానే సీఎంను అవుతానన్న ధీమాను కూడా వ్యక్తం చేశారు. అయితే అనూహ్యంగా తాను ఇక రాజకీయాల్లో ఉండబోనని ఆమె స్పష్టం చేయడం అందరిని అశ్యర్యపరిచింది.  అయితే శశికళ సంచలన నిర్ణయం తీసుకోవడం వెనుక బీజేపీ వ్యూహం ఉందని ఇప్పుడు తమిళనాడులో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.

ప్రస్తుతం అధికారంలో ఉన్న పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే ప్రభుత్వం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతుందని, స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే మరోమారు అధికారంలోకి వస్తుందని ఇప్పటికే ఒపీనియన్ పోల్ సర్వేలు వెల్లడించాయి. ఈ దశలో శశికళ తిరిగి రాజకీయాల్లో కొనసాగితే అన్నాడీఎంకేలో చీలిక రావడం ఖాయమని భావించిన బీజేపీ, అన్నాడీఎంకే విడిపోకుండా ఉండాలంటే, తాత్కాలికంగానైనా శశికళను రాజకీయాలకు దూరంగా ఉంచాలని భావించినట్టు వార్తలు వస్తున్నాయి.

గత నెలలో అమిత్ షా తమిళనాడులో పర్యటించిన సమయంలోనే శశికళతో డీల్ కుదిరిపోయిందని తమిళనాడు నెటిజన్లు సోషల్ మీడియాలో  పోస్టులు పెడుతున్నారు. అందులో భాగంగానే ఆమె ఈ ప్రకటన చేశారని అంటున్నారు. అదే నిజమైతే, ఎన్డీయే నేతృత్వంలో అన్నాడీఎంకే తిరిగి తమిళనాడులో అధికారంలోకి వస్తే చాలని భావిస్తున్న బీజేపీ, ఆ మేరకు ప్రస్తుతానికి ఇలా ప్లాన్ చేసిందని తెలుస్తోంది.మరోవైపు డీఎంకే మాత్రం శశకళ నిర్ణయంతో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని చెబుతోంది. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా తమ విజయాన్నిఆపలేరని ప్రకటించారు స్టాలిన్.