ఇంతకీ తమ్మినేని చదువు కున్నారా?.. చదువు కొన్నారా? ఎన్నికల అఫిడవిట్ లో ఆయన చెప్పిందేమిటి?

రాజకీయాల్లో రాణించడానికి చదువు అవసరం లేదు. పంచాయతీ  బోర్డు మెంబెర్ మొదలు ప్రధాని పదవి వరకు, ఏ పదవికి విధ్యార్హతలు అక్కరలేదు. ఓటు హక్కున్న ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పోటీ చేయవచ్చును. ప్రజలు గెలిపిస్తే చాలు,  ఎమ్మెల్ల్యే, ఎంపీ , మంత్రి,  ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, ప్రధాన మంత్రి  ఏదైనా కావచ్చును. ఏ పదవికీ చదవు సంధ్యలు అవసరం లేదు, డిగ్రీలు అక్కరలేదు. అయినా,  రాజకీయ నాయకుల విధ్యార్హతలు, డిగ్రీలు తరచూ వివాదం అవుతూనే ఉంటాయి.  ప్రధాని నరేంద్ర మోదీ డిగ్రీలపై వివాదం నడిచిన సంగతి తెలిసిందే. మోదీ విద్యార్హతలు, డిగ్రీలకు సంబంధించిన సమాచారం కోసం సమాచార హక్కు చట్టం కింద తెలుసుకునేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్  చేసిన ప్రయత్నాలు ఫలిచలేదు.   అలాగే కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ..మరి కొందరు ముఖ్య నేతలకు సంబందించిన  డిగ్రీ  విషయంలోనూ వివాదాలు, విచారణలు జరిగాయి. జరుగుతున్నాయి. ఇప్పడు ఆ జాబితాలో  ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని  సీతారం పేరు కూడా చేరింది.  ఆయన డిగ్రీ చదువు కోలేదనీ, చదువు కొన్నారనీ తెలుగుదేశం గతంలో ఆరోపించింది.  సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ కూడా చేసింది. అదలా ఉంచితే ఇప్పుడు స్వయంగా తమ్మినేని సీతారాం తాను డిగ్రీ చదువు కోలేదని అంగీకరించారు. అంగీకరించడమంటే మౌఖికంగా చెప్పడం కాదు.. ఆముదాలవలస వైసీపీ అభ్యర్థిగా పోటీకి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఆ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ లో ఆయన విద్యార్హతకు సంబంధించిన వివరాలు కూడా ఉన్నాయి. తమ్మినేని ఎన్నికల అఫిడవిట్ లో డిగ్రీ డిస్ కంటిన్యూ అని ఉంది. మరి డిగ్రీ పూర్తి కాకుండా తమ్మినేని లా ఎలా చేశారు.    తాను డిగ్రీ పూర్తి చేశానని చెప్పి హైదరాబాద్ లో ఓ లా కాలేజీలో అడ్మిషన్ పొందారు. డిగ్రీ సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. గత ఏడాది ఈ అంశంపై పెద్ద దుమారం కూడా రేగింది. అదలా ఉండగానే ఇప్పుడు ఆయన తన ఎన్నికల అఫిడవిట్ లో  డిగ్రీ డిస్ కంటిన్యూ అని పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని స్పీకర్ నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ పెట్టి లా కోర్సులో చేరారని గత కొంత కాలం కిందట తెలుగుదేశం బయట పెట్టింది.  దీనిపై కిమ్మనని తమ్మినేని ఇప్పుడు తాను డిగ్రీ పూర్తి చేయలేదంటూ ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఇక ఇప్పుడు ఆయనకు లా కాలేజీలో అడ్మిషన్ ఎలా లభించింది. ఆయన నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ సమర్పించి ఉంటే చట్టపరంగా చర్యలకు రెడీ అవ్వాల్సిందే అని పరిశీలకులు అంటున్నారు. 
Publish Date: Apr 23, 2024 4:13PM

కేసీఆర్ కట్టడం మరోటి కూలింది!

కేసీఆర్ కట్టడం కూలిందంటే, ఆయన ఫామ్‌హౌస్‌లో వున్న కట్టడం కూలిందనో, హైదరాబాద్ నంది నగర్లో ఆయనకు చెందిన 5 వందల గజాల్లో కట్టుకున్న  పేద కుటీరం కూలిందనో అనుకోవద్దు. ఆయన ప్రభుత్వంలో నిర్మాణం చేపట్టిన మరో కట్టడం కూలిపోయింది. కేసీఆర్ తన ఇంజినీరింగ్ ప్రతిభతో, మెదడుని, రక్తాన్ని రంగరించి డిజైన్ చేసిన మేడిగడ్డ రిజర్వాయిర్ మేడిపండును తలపిస్తూ ముక్కలు చెక్కలు అయిపోయింది. ఇప్పుడు ఆ అదృష్టం ఓ బ్రిడ్జికి పట్టింది. పెద్దపల్లి జిల్లాలో మానేరు వాగు మీద నిర్మాణంలో వున్న వంతెన సోమవారం రాత్రి కూలిపోయింది. 2016లో ఈ బ్రిడ్జి నిర్మాణం ప్రారంభమైంది. దీని నిర్మాణంలో కూడా ఇంజనీర్లకే ఇంజనీర్ కేసీఆర్ ప్లానుందేమో తెలియదు. 2016 నుంచి ఇప్పటి వరకు అంటే, ఎనిమిదేళ్ళపాటు ఈ బ్రిడ్జిని కడుతూనే వున్నారు. ఇంతవరకు నిర్మాణం పూర్తి కాలేదు. జనం ఈ బ్రిడ్జిని నమ్ముకోకుండా ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి బ్రిడ్జి కూలిపోయింది. పోన్లే.. ఎవరికీ ఏమీ కాలేదు!
Publish Date: Apr 23, 2024 4:08PM

కల్వకుంట కవితమ్మకి చాలా టాలెంట్ ఉందండోయ్!

తిమ్మిని బమ్మిని చేసి, మాటలతో మాయ చేసే తండ్రి సపోర్టు బాగా వుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏం మాట్లాడినా నడిచింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆడింది ఆట, పాడింది పాట. మరి ఇలాంటి  పరిస్థితిలో వున్న వారికి తెలివితేటలు సహజంగానే బాగా పెరిగిపోతాయి. ప్రస్తుతం తీహార్ జైల్లో రెస్టు తీసుకుంటున్న కల్వకుంట్ల కవితకి కూడా అలాగే తెలివితేటలు పెరిగిపోయాయి. అందుకే, ఓ ఇంటర్వ్యూలో తాను ముఖ్యమంత్రి అయితే లిక్కర్ని బంద్ చేస్తానని చెప్పిన ఈమె ఆ తర్వాత చక్కగా లిక్కర్ వ్యాపారంలోకే దిగారు. ఆ లిక్కర్ వ్యాపారం ఇక్కడా అక్కడా కాకుండా ఏకంగా ఢిల్లీలో చేయాలని అనుకున్నారు. వందకోట్లు పెట్టుబడి పెట్టి, వెయ్యికోట్లు సంపాదించాలని అనుకున్నారు. అయితే ఆప్లాన్స్ అన్నీ బెడిసికొట్టి ప్రస్తుతం శ్రీకృష్ణ జన్మస్థానానికి చేరుకున్నారు.  జైలుకు వెళ్ళక ముందు నుంచి దర్యాప్తు సంస్థలకు సహకరించే విషయంలో చాలా తెలివితేటలు ప్రదర్శించిన కల్వకుంట్ల కవిత, ఓ సందర్భంలో తనకు సంబంధించిన 10 సెల్ ఫోన్లను దర్యాప్తు అధికారులకు అందించారు. తాను చాలా పారదర్శకంగా వున్నానని, అందుకే సెల్ ఫోన్లు దర్యాప్తు సంస్థలకు ఇచ్చానని ప్రచారం చేసుకున్నారు. తాను తాను సంప్రదాయినీ, సుప్పినీ, సుద్దపూసనీ కాబట్టే భయం లేకుండా సెల్ ఫోన్లు ఇచ్చానని చెప్పుకొచ్చారు. ఒక మనిషికి పది సెల్ ఫోన్లేంట్రా బాబూ అని చాలామంది అనుకున్నప్పటికీ, ఏమోలే డబ్బున్నవాళ్ళు కదా అనుకుని ఊరుకున్నారు. ప్రస్తుతం తీహార్ జైల్లో వున్న కవిత బెయిల్ కోసం చేయని ప్రయత్నాలు లేవు. తన కొడుకు టెన్త్ పరీక్షలు రాస్తున్నాడు కాబట్టి నేను తల్లిగా పక్కనే వుండాలనే పాయింట్ పైకి తెచ్చారు. వర్కవుట్ కాలేదు. ఎలక్షన్లు వచ్చాయి కాబట్టి, తన పార్టీలో తాను స్టార్ కాంపైనర్ కాబట్టి, తాను ప్రచారం చేస్తే జనం కళ్ళు మూసుకుని తమ పార్టీకి ఓటేస్తారు కాబట్టి బెయిల్ ఇవ్వాలని కోరారు.. ఇదీ వర్కవుట్ కాలేదు.. కవితకి చాలా పెద్ద నెట్ వర్క్ వుందని, ఆమెకి బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తును ప్రభావితం చేసే ప్రమాదం వుందని దర్యాప్తు సంస్థలు కోర్టు ముందు వాదిస్తున్నాయి. సోమవారం నాడు ఢిల్లీ కోర్టులో ఇదే తరహా వాదన జరిగింది. ఈ వాదన సందర్భంగా, ఇప్పటి వరకు కల్వకుంట్ల కవితమ్మ సెల్‌ఫోన్లకు సంబంధించిన ఒక రహస్యం బయటపడింది.  కల్వకుంట్ల కవితమ్మ తన పది సెల్ ఫోన్లను దర్యాప్తు సంస్థలకు ఇచ్చారు కాబట్టి, ఆమె చాలా పారదర్శకంగా వుందని అనుకుంటూ వస్తున్నాం కదా.. అంత సీన్ లేదు.. కవితమ్మ తన ఫోన్లను దర్యాప్తు సంస్థలకు ఇచ్చేముందు ఆ ఫోన్లన యాసిడ్ వేసి క్లీన్ చేసినంత నీట్‌గా ఫార్మాట్ చేసి ఇచ్చారట. సెల్ ఫోన్లు ఎవరైనా ఎందుకు అడుగుతారు? వాటిలో వుండే డేటా ఆధారంగా కేసును దర్యాప్తు చేయడానికి. మరి, సెల్ ఫోన్లని చక్కగా ఫార్మాట్ చేస్తే అందులో ఇంకేం వుంటుంది బూడిద? ఏ తప్పూ చేయకపోతే ఆ ఫోన్లను ఎందుకు ఫార్మాట్ చేసినట్టు? ఈ విషయాన్నే దర్యాప్తు సంస్థలు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇక్కడ కూడా కవిత అండ్ కో తన తెలివితేటల ప్రదర్శన చేసింది. కవితగారు తన ఫోన్లను ఫార్మాట్ చేయలేదని, ఆమె తన 10 ఫోన్లను తన దగ్గర పనిచేసేవారికి ఇచ్చారని, వారు ఫార్మాట్ చేసి ఉపయోగించుకుంటున్నారని చెప్పుకొచ్చారు. అబద్ధం చెప్పినా అతికినట్టు వుండాలన్న విషయం కవిత అండ్ కో మర్చిపోయినట్టుంది. ఫోన్ల విషయంలోనే ఇంత టాలెంట్ చూపించిన కవిత, ఇంకా ఎన్నెన్ని విషయాల్లో తన టాలెంట్ చూపించారో.. ముందు ముందు ఇంకెన్ని బయటపడనున్నాయో!
Publish Date: Apr 23, 2024 3:54PM

శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులుకు హైకోర్టులో దక్కని ఊరట

శిరోముండనం కేసులో విశాఖ కోర్టు తనకు విధించిన శిక్షను నిలుపుదల చేయాలంటూ వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ విచారణను మే 1కి వాయిదా వేసింది. వైసీపీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ మండపేట అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి అయిన తోట త్రిమూర్తులుకు విశాఖ కోర్టు శిరోముండనం కేసులో 18 నెలల జైలు శిక్ష, రెండు లక్షల రూపాయల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.  అసలింతకీ ఈ శిరోముండనం కేసు ఏమిటి? ఎప్పుడు జరిగింది అన్న వివరాలలోకి వెడితే..  1982 ఎన్టీఆర్  తెలుగుదేశం పార్టీని  స్థాపించినప్పుడు   తోట త్రిమూర్తులు ఆ పార్టీలో చేరారు. అసెంబ్లీకి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేశారు. అయితే అప్పట్లో ఎన్టీఆర్ ఆయనకు అవకాశం ఇవ్వలేదు. దీంతో తోట త్రిమూర్తులు 1994లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా రామచంద్రపురం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అప్పుడు ఆయనకు ఎన్నికల సంఘం గంట గుర్తు కేటాయించింది. అప్పట్లో రామచంద్రపురం నియోజకవర్గంలో త్రిముఖ పోటీ జరిగింది. తెలుగుదేశం, బీఎస్పీ అభ్యర్థులకు తోట త్రిమూర్తులు గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా మూడు వేల ఓట్లపైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు. అయితే పోలింగ్ సమయంలో తోట త్రిమూర్తులు రిగ్గింగుకు పాల్పడుతున్నారంటూ ఐదుగురు యువకులు (వీరు బీఎస్సీ బూత్ ఏజెంట్లు) అభ్యంతరం తెలిపారు.  అప్పట్లో పెద్ద ఎత్తున వాగ్వాదం జరిగింది.  పోలింగ్ ముగిసింది. తోటత్రిమూర్తులు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.  రిగ్గింగ్ అంటూ అభ్యంతరం వ్యక్తం చేసిన యువకులపై మాత్రం తోట త్రిమూర్తులు ఆగ్రహం పెంచుకున్నారు.  వారిపై వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే 1996 డిసెంబర్ 29న ఆ ఐదుగురు యువకులనూ తోట త్రిమూర్తులు అనుచరులు పట్టుకుని ఈవ్ టీజింగ్, ఫెన్సింగ్ ధ్వంసం వంటి ఆరోపణలతో వారిని ఊళ్లో ఊరోగించారు. ఆనంతరం వారిలో ఇరువురికి శిరోముండనం చేయించి, కనుబొమ్మలు కూడా గీయించారు. ఈ సంఘటన అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. శిరోముండనం బాధితులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ద్రాక్షారామం కేసులో 1997 జనవరి 1న తోట త్రిమూర్తులుపై శిరోముండనం కేసు నమోదైంది. అప్పట్లో ఈ కేసులో అరెస్టైన తోట త్రిమూర్తులు మూడు నెలల పాటు జైలులో కూడా ఉన్నారు.   ఐదుగురు దళితయువకులను ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు మనుషులు పట్టుకున్నారు. పొలం చుట్టూ ఫెన్సింగ్ ధ్వంసం, ఈవ్ టీజింగ్ కారణాలు చెప్పి ఆ ఐదుగురు కుర్రాళ్లను ఊళ్లో అవమానిస్తూ ఊరేగించారు. అంతటితో ఆగకుండా అందులో ఇద్దరు కుర్రాళ్లకు గుండు కొట్టించి కనుబొమ్మలు గీయించారు. ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు చేయించిన ఈ పని అప్పట్లో సంచలనంగా మారిపోయింది. ఆ బాధితులైన కుర్రాళ్లు పోలీసులను ఆశ్రయించారు. 1997 జనవరి 1న ద్రాక్షారామం పోలీస్ స్టేషన్ లో మొదటికేసుగా దళితుల శిరోముండనం కేసు నమోదైంది. ఆ తరువాత కేసు దర్యాప్తును పక్కన పెట్టేశారు. అయితే బాధితులు మాత్రం తమకు న్యాయం చేయాలంటూ పోరాటాన్ని కొనసాగించారు. శిరోముండనానికి గురైన ఇద్దరిలో ఒకరు మరణించారు. అయితే మిగిలిన వారు మాత్రం న్యాయపోరాటాన్ని కొనసాగించారు. ఈ కేసుకు సంబంధించి 24 మంది సాక్ష్యులలో 11 మంది మరణించారు. బాధితులు న్యాయం కోసం హైకోర్టును ఇశ్రయించారు. హైకోర్టు కేసును విశాఖ ఎస్సీఎస్టీ కోర్టుకు బదలాయించింది.   ఇలా ఉండగా త్రిమూర్తులు ఆ యువకులు దళితులు కాదంటూ ఎస్సీఎస్టీ కేసులో వాదించారు. వారు దళితులు కానందున కేసు విచారణ ఎస్సీఎస్టీ కోరులో జరగడం సరికాదని చెప్పారు. అయితే కోర్టు మాత్రం యువకుల వాదనతో ఏకీభవించి ఇటీవల సంచలన తీర్పు ఇచ్చింది. తోట త్రిమూర్తులకు 18 నెలలు జైలు, రెండు లక్షల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.  ఈ నేపథ్యంలోనే శిక్ష నిలుపుదల కోరుతూ తోట త్రిమూర్తులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే శిక్ష నిలుపుదల చేయాలన్న తోట త్రిమూర్తులు అభ్యర్థనను కోర్టు తిరస్కరించి కేసు విచారణను మే 1కి వాయిదా వేసింది. 
Publish Date: Apr 23, 2024 3:25PM

ఏపీలో కాంగ్రెస్ ఎందుకు పోటీ చేస్తోందో ఆ దేవుడికే తెలియాలి!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత, నవ్యాంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ శవంలా మిగిలింది. అడ్డదిడ్డంగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏనాటికీ క్షమించరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇప్పుడున్న దుస్థితికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కారణం. రాష్ట్రం అన్ని రకాలుగా వెనుకబడి పోవడానికి, ఉద్యోగాలు, ఉపాధి లేకుండా పోవడానికి కాంగ్రెస్ పార్టీయే ప్రధాన కారణం. అలా రాష్ట్రంలో సమాధిలోకి చేరిపో్యిన కాంగ్రెస్ పార్టీ అస్థిపంజరం రాష్ట్ర రాజకీయాలను ఏదో ఉద్ధరించాలని, ఊడబొడవాలని ప్రయత్నాలు చేస్తోంది. కానీ అది అసంభవం అని రాష్ట్ర రాజకీయాల మీద ఏమాత్రం అవగాహన ఉన్నవారైనా చెబుతారు. ఈ విషయం కాంగ్రెస్ నాయకత్వానికి కూడా తెలుసు.. కానీ దింపుడు కళ్ళం ఆశకంటే మరింత అడ్వాన్స్ అయిన ఆశతో తన ప్రయత్నాలు చేస్తూనే వుంది. ఈసారి ఎన్నికల సందర్భంగా సరికొత్త తురుఫుముక్క వై.ఎస్.షర్మిలతో రంగంలోకి దిగింది కాంగ్రెస్ పార్టీ. రాష్ట్రంలో తన బలం ఎలాంటిదో తెలిసికూడా అన్ని పార్లమెంట్, అన్ని లోక్‌సభ స్థానాల నుంచి అభ్యర్థులను బరిలోకి దించే వ్యూహంలో ముందుకు వెళ్తోంది. రాష్ట్ర అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్ స్థానాలలో ఇప్పటికే దాదాపుగా చాలావాటికి అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ, ఈసారి తాను రాష్ట్ర రాజకీయాలలో క్రియాశీలకం అవుతానని కలలు కంటోంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన వై.ఎస్.షర్మిల తనను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా భావించకుండా, కేవలం అన్నని వ్యతిరేకిస్తున్న చెల్లెలిలా మాత్రమే రాజకీయాలు చేస్తున్నారు. తాను పోటీ చేస్తున్న కడప పార్లమెంట్ స్థానం గురించి తప్ప మరే స్థానం గురించి ఆమె ఆలోచించడం లేదు.  ఇక పార్లమెంటు బరిలో వున్నావారిలో షర్మిల, కొప్పుల రాజు, పల్లంరాజు, గిడుగు రుద్రరాజు, జేడీ శీలం, చింతా మోహన్ తప్ప మిగతా స్థానాల నుంచి పోటీ చేస్తున్న వారికి ఎలాంటి బలం, బలగం లేదు. ఏదో ఆటలో అరటిపండులా వున్నారే తప్ప బలమైన అభ్యర్థులుగా లేరు. ఆమాటకొస్తే పైన పేర్కొన్న బలం, బలగం వున్నవారు కూడా గెలిచే అవకాశాలు లేవు. ఒక్క షర్మిల అయినా గెలిచే అవకాశం వుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయిగానీ, అదికూడా డౌటే.  ఇక కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేయడానికి పనికిరాని దారిన పోయే దానయ్యలకి కూడా కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు పంచేసి చేతులు దులుపుకుంది. ఫలానా నియోజకవర్గానికి కంటెస్ట్ ఎమ్మెల్యే అని చెప్పుకుని తిరిగే ఉబలాటం వున్నవాళ్ళు కూడా అభ్యర్థులుగా నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీ బలమైన అభ్యర్థులను రంగంలో నిలబెడితే, వాళ్ళు వైసీపీ ఓట్లలో చీలిక తెచ్చి తెలుగుదేశం కూటమికి మేలు జరిగేలా చేస్తారన్న అభిప్రాయం మొదట్లో రాజకీయ పరిశీలకులకు కలిగింది. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తే అలాంటి అవకాశాలేవీ లేనట్టు అర్థమవుతోంది. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏదో ఉన్నాం అంటే ఉన్నాం అన్నట్టే తప్ప ఎన్నికల మీద ఎలాంటి ప్రభావం చూపే అవకాశం లేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
Publish Date: Apr 23, 2024 1:41PM

గాలిలో హెలికాప్టర్ల ఢీ.. 10 మంది మృతి

మలేసియా రాజధాని కౌలా లంపూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మలేసియా నావికాదళానికి చెందిన రెండు హెలికాప్టర్లు ఆకాశంలోనే ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది మరణించారు. రెండు హెలికాప్టర్లూ సైనిక విన్యాసాలు చేస్తూ వుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈనెల 26వ తేదీన మలేసియాలో రాయల్ మలేసియన్ నేవీ దినోత్సవం జరగనుంది. దీనికోసం కౌలా లంపూర్‌లోని పెరక్ లుమల్ ప్రాంతంలో రిహార్సల్స్ నిర్వహించారు. ఈ విన్యాసాల కోసం పదిమంది సైనిక సిబ్బందితో సహా గాల్లోకి ఎగిరిన రెండు హెలికాప్టర్లు కాసేపట్లోనే ఒకదానితో మరొకటి ఢీకొని కిందపడిపోయాయి. ఈ ప్రమాదంలో రెండు హెలికాప్టర్లలో వున్న పదిమంది మరణించారు. వీరందరూ ఆర్మీ ఉన్నతాధికారులే. హెలికాప్టర్లు కూలుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. 
Publish Date: Apr 23, 2024 12:40PM

జగన్ పై మాటల తూటాలు.. ఓ రేంజ్ లో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వి రివెంజ్!

జగన్ పేరు చెప్పగానే ఎవరికైనా ఎం గుర్తుకు వస్తుంది. ముఖ్యమంత్రి హోదా. తననూ తన అధికారాన్ని, తన ప్రభుత్వ విధానాలనూ వ్యతిరేకించిన వారిపై అక్రమ కేసులు బనాయించడం, అరెస్టు చేయించడం, ఇంకా కోపం తగ్గకపోతే రఘురామరాజుపై జరిగినట్లు థర్డ్ డిగ్రీ ప్రయోగించేలా పోలీసులను ఆదేశించడం. కానీ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్ కు మాత్రం జగన్ పేరు చెప్పగానే కోడి కత్తి, గొడ్డలి గుర్తుకు వస్తాయి. ఇంతకీ ఈ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఎవరనుకుంటున్నారా... థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ రాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పాపులర్ కమేడియన్ గా సినిమాలలో ఓ వెలుగు వెలిగారు. ఆ తరువాత రాజకీయాలవైపు గాలి మళ్లడంతో రాజకీయ వేత్త అవతారమెత్తి వైసీపీ గూటికి చేరి.. 2019 ఎన్నికలకు ముందు  ఆ పార్టీ క్యాంపెయినర్ గా ప్రత్యర్థులపై నోరు పారేసుకున్నారు. రాజకీయ విమర్శకు ఉండే మర్యాద హద్దు దాటి మరీ విమర్శలు గుప్పించారు.  పార్టీ ప్రచారం అంటూ  తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు.  నోరున్నది ఎందుకు అంటే రాజకీయ ప్రత్యర్ధులను విమర్శించడానికే  అన్నట్లు పృధ్వివిరుచుకు పడ్డారు. జగన్ మెప్పు పొందడానికీ, ఆయన దృష్టిలో పడటానికీ అదే మార్గం అనుకున్నారు. మొత్తం మీద పృధ్వీ ప్రచారమే పని చేసిందో..  రాష్ట్ర ప్రజల దురదృష్టమో   ఆ ఎన్నికలో వైసీపీ విజయం సాధించింది. జగన్మోహన్  రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు.   సహజంగానే, పార్టీ కోసం అంతగా కష్టపడిన పృధ్విని జగనన్న తనను అందలం ఎక్కిస్తారని ఆశపడ్డారు. అయితే ఆయన ఏమి ఆశ పడ్డారో, ఏమి ఆశించారో ఏమో  తెలియదు కానీ   పృధ్వీ పడిన కష్టానికి తగినదో కాదో  మొత్తం జగన్ మాత్రం పృధ్వికి మొండి చేయి చూపించకుండా ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవి  ఇచ్చారు. అది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయిందనుకోండి అది వేరే సంగతి.   ఒక మహిళా ఉద్యోగితో అసభ్యంగా మాట్లాడిన వాయిస్ రికార్డులు బయటకు రావటంతో ఎస్వీబీసీ ఛైర్మన్‌ బాధ్యతల నుండి  జగన్ పృధ్విని తప్పించారు.   ఎస్వీబీసీ నుంచి  గెంటేసిన తర్వాత  వైసీపీలో ఆయ న్ని పట్టించుకున్నవారు లేరు. మరో వంక నడమంత్రపు సిరి శాశ్వతం నుకుని రెచ్చి పోయి వెనకా ముందు చూసుకోకుండా, చిందులేసిన పాపానికి  ఇండస్ట్రీ కూడా పృధ్విని దాదాపు వదిలేసింది. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవలసిందేమిటంటే..  ఫృధ్వి ఎదుర్కొన్న లాంటి విమర్శలే ఎదుర్కొన్న అంబటి రాంబాబు మంత్రిగా పదోన్నతి పొంది కొనసాగుతున్నారు.  అది పక్కన పెడితే  వైసీపీ వదిలిం చేసుకున్న తరువాత థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి తత్త్వం బోధపడినట్లుంది.   ఈ ఎన్నికల ముందు ఆయన వైసీపీ లక్ష్యంగా జనసేన తరఫున ప్రచారం చేస్తున్నారు. ఆ క్రమంలో ముఖ్యమంత్రి జగన్ ను ఓ ఆటాడేసుకుంటున్నారు.  జగన్ లక్ష్యంగా కొన్ని ఆయన సంధిస్తున్న వ్యంగ్యాస్త్రాలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.  ఇటీవల జగన్ పై జరిగిన రాయిదాడి ఘటన అనంతరం పృధ్వి చేసిన వ్యాఖ్యలు వైసీపీని నవ్వుల పాలు చేశాయి.  జగన్ అంటే ఎవరికైనా కోడి కత్తి, గొడ్డలి, కత్తి గుర్తుకు వస్తాయి కానీ గులకరాళ్లు గుర్తుకురావు అంటూ సెటైర్లు వేశారు.   మొత్తం మీద జనసేన తరఫున ఫృద్వి చేస్తున్న ప్రచారానికి జనం నుంచి స్పందన అయితే వస్తున్నది. పృధ్వీయే నటించిన ఓటుతో జగన్ ను ఇంటికి పంపడం మాత్రమే రాష్ట్ర ప్రజల కష్టాలు తీరడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం అంటూ జనసేన రిలీజ్ చేసిన టీజర్ కు కూడా విశేష స్పందన లభించింది. మొత్తం మీద పృధ్వీ జగన్ పై ఓ రేంజ్ లో రివెంజ్ తీర్చుకుం టున్నారంటూ నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. 
Publish Date: Apr 23, 2024 12:20PM

పాపం రోజా..నామినేషన్ ర్యాలీ వెలవెల!

రోజా.. రాజకీయ నాయకురాలిగా మారిన నటి.  ఏపీ పర్యాటకశాఖ మంత్రి. రెండు సార్లు ఎమ్మెల్యే. ఒకసారి ఏపీఐఐసీ చైర్ పర్సన్. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్. ఆమె తెలుగుదేశంలో ఉన్నా.. వైసీపీలో ఉన్నా.. ప్రత్యర్థులపై విరుచుకుపడడంలో దిట్ట.  విశాఖ విమానాశ్రయంలో   మధ్య వేలు చూపించి జనసైనికులను రెచ్చగొట్టగలరు. అలాంటి రోజాకు ఇప్పుడు సొంత నియోజకవర్గంలోనే  సీన్ సితార అయిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఆ విషయాన్ని గతంలో రోజాయే స్వయంగా అంగీకరించారు. మంత్రినైన తనను నియోజకవర్గంలో బలహీనపరిచే విధంగా ప్రతిపక్షాల వాళ్లు నవ్వుకునేలా సొంత పార్టీ వారే వ్యవహరిస్తున్నారని రోజా దాదాపు ఏడాదిన్నర కిందటే కళ్లనీళ్లు పెట్టుకుని మరీ మీడియా ముందు చెప్పారు.   సొంత నియోజకవర్గంలోనే రోజాకు సొంత పార్టీ నుంచే మద్దతు కరవైందని అప్పట్లోనే  అందరికీ అవగతమైపోయింది.  దీంతో రోజా వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ అభించే అవకాశాలు లేవని కూడా అప్పట్లో బాగా  ప్రచారం అయ్యింది. అయితే ఈమె నగరి నుంచి పోటీ చేస్తున్నారు. పార్టీ టికెట్ దక్కించుకున్నారు. అంత వరకూ ఓకే కానీ తన విజయం కోసం నియోజకవర్గ నేతలు పని చేసేలా సమాయత్తం చేసుకోవడంలో  మాత్రం విఫలమయ్యారని ఆమె నామినేషన్ సందర్భంగా జరిగిన ర్యాలీని చూస్తే అవకగతమౌతోందని పరిశీలకులు అంటున్నారు.  వాస్తవానికి ఆమె గెలిచిన రెండు సార్లూ కూడా నగరిలో రోజాకు స్వల్ప మెజారిటీయే వచ్చింది. 2014 ఎన్నికలలో రోజా తెలుగుదేశం సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడిపై 871 ఓట్ల స్వల్ప మెజారిటీతో విజయం సాధించారు. ఆ తరువాత 2019 ఎన్నికలలో గాలి ముద్దుకృష్ణమ తనయుడు గాలి భాను ప్రకాష్ పై 2,007 ఓట్లు తేడాతో గెలుపొందారు. జగన్ హవా నడిచిన ఆ ఎన్నికలలో ఆ మెజారిటీ స్వల్పమనే చెప్పాలి.   ఈసారి ఎన్నికల్లో  కూడా రోజాకు భాను ప్రకాశ్  ప్రత్యర్థి. గత ఎన్నికలలో  ఓడిపోయిన భాను ప్రకాశ్ పై నియోజకవర్గం ఓటర్లలో సానుభూతి కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  దీనికి తోడు నగరి నియోజకవర్గంలో రోజాకు సొంత పార్టీ నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.  ఈ నేపథ్యంలో ఆమె నగరి నుంచి హ్యాట్రిక్ సాధించాలన్న ఆశలు ఆవిరయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. ఇప్పటికే రోజాను వ్యతిరేకించే వైసీపీలోని బలమైన వర్గం.. తెలుగుదేశం గూటికి చేరిపోయారు. అలా చేరకుండా వైసీపీలోనే ఉన్నవారు ఆమెకు సహాయ నిరాకరణ చేస్తూ లోపాయికారీగా తెలుగుదేశంకు సహకరిస్తున్నారని వైసీపీ వర్గాలే అంటున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ రోజా విజయం కోసం సహకరించే ప్రశక్తే లేదని నియోజకవర్గానికి చెందిన పలువురు వైసీపీ నేతలు కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నారు. రోజాకు నియోజకవర్గ పార్టీ నేతలతో ఉన్న విభేదాలకు ఆమె నామినేషన్ ర్యాలీ అద్దం పట్టిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  సొంత నియోజకవర్గం నుంచి పార్టీకి చెందిన నేతలు ఎవరూ రోజా నామినేషన్ ర్యాలీలో పాల్గొనకపోవడంతో ఆమె బైరెడ్డి సిద్ధార్థరెడ్డి  ముఖ్య అహ్వానించి నామినేషన్  దాఖలు చేయాల్సి వచ్చింది.  గత ఎన్నికలలో రోజా విజయం కోసం కృషి చేసిన రెడ్డివారి చక్రపాణిరెడ్డి,   మురళీనాథరెడ్డి వంటి వారు రోజా ను గెలిపించడం కోసం పని చేసే ప్రశక్తే లేదని ప్రకటించి మరీ  పరోక్షంగా తెలుగుదేశం అభ్యర్థి గాలి భాను ప్రకాష్ కు సహకారం అందిస్తున్నారు. రోజా విషయంలో పార్టీ హైకమాండ్ కూడా లైట్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. అసమ్మతిని బుజ్జగించే పని కూడా చేయడం లేదు. దీంతో రోజా హ్యాట్రిక్ డ్రీమ్ నెరవేరే అవకాశాలు అంతంత మాత్రమేనని అంటున్నారు. 
Publish Date: Apr 23, 2024 11:29AM

ఇరాన్ అధ్యక్షుడు పాకిస్తాన్‌కి ఎందుకు వెళ్ళినట్టో...!

ప్రపంచ రాజకీయాల్లో తాజాగా ఎవరూ ఊహించని ఒక సంఘటన జరిగింది... అదే ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీమ్ రైసీ పాకిస్తాన్ దేశాన్ని సందర్శించడం. నిన్న అంటే, సోమవారం నాడు ఇబ్రహీమ్ రైసీ ఇస్లామాబాద్‌కి వచ్చారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్‌ని  కలిశారు. ఒక దేశ అధ్యక్షుడు మరో దేశ ప్రధానమంత్రిని స్నేహపూర్వకంగా కలిస్తే తప్పేంటన్న సందేహాలు ఎవరికైనా కలగొచ్చు. అయితే పాకిస్తాన్, ఇరాన్ మధ్య స్నేహసంబంధాలు లేవు. మొదట్నుంచీ ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. అగ్నికి ఆజ్యం పోసినట్టుగా గత జనవరిలో రెండు దేశాల సరిహద్దులో పరస్పరం వైమానిక దాడులు జరిగాయి. ఈ దాడుల్లో పాకిస్తాన్‌కి చెందిన ఇద్దరు చిన్నారులు చనిపోయారు. ‘మేమేం పాకిస్తాన్ మీద దాడి చేయలేదు. పాకిస్తాన్‌లో ఆశ్రయం పొందుతున్న జైష్ అల్ అద్ల్ అనే అతివాద గ్రూపు మీద దాడి చేశాం’ అని ఇరాన్ చాలా తెలివిగా చెప్పినప్పటికీ, పాకిస్థాన్‌కి ఆ సంఘటన ఆగ్రహాన్ని తెప్పించింది. నేను మాత్రం తక్కువా అన్నట్టుగా, ఇరాన్ భూభాగంలోకి ఒక క్షిపణిని ప్రయోగించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో వున్న తన రాయబారిని వెనక్కి పిలిపించింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య స్నేహసంబంధాలు పూర్తిగా అడుగంటిపోయాయి. మరి, ఇంతకాలం ఉప్పు, నిప్పులా వున్న ఈ రెండు దేశాల నాయకులు ఇంత అకస్మాత్తుగా ‘స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం’ అంటూ స్నేహగీతాన్నిఆలాపించడం వెనుక కారణాలను అంతర్జాతీయ రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్దంలోకి ఈమధ్య ఇరాన్ కూడా ఎంటరైంది. కొద్ది రో్జుల క్రితమే ఇజ్రాయిల్ మీద ఆయుధాలతో దాడులు కూడా చేసింది. ఇజ్రాయిల్ కూడా తక్కువదేం కాదు కదా.. ఇరాన్‌ని అదను చూసి దెబ్బ తీయడానికి ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో తనకు మద్దతు ఇవ్వడానికి గానీ, ఇంధనం తదితర అవసరాల కోసం గానీ ఇరాన్‌కి పాకిస్తాన్‌తో అవసరం వుంది. అలాగే పాకిస్తాన్ పరిస్థితి కూడా అలాగే వుంది. ఇటువైపు ఇండియాతో గొడవ, అటువైపు ఆఫ్ఘనిస్తాన్‌తో కయ్యం. దానికి తోడు దేశంలో తాండవిస్తున్న కరవు. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్‌కి కూడా అంతర్జాతీయంగా అండ కావలసి వుంది. దాంతో ‘నీకు నీ వారు లేరు.. నాకు నా వారులేరు’ అన్నట్టుగా ఈ రెండు దేశాలు కౌగిలించుకున్నాయి. అయితే ఈ కౌగిలి కాలం గడిచేకొద్దీ మరింత బలంగా మారుతుందా, లేక ధృతరాష్ట్ర కౌగిలిగా మారుతుందా అనేది వేచి చూడాల్సిన విషయం. ఈ పరిణామాలను భారత విదేశాంగ శాఖ గమనిస్తోంది. 
Publish Date: Apr 23, 2024 11:18AM

ఖమ్మం కన్ఫ్యూజన్.. కాంగ్రెస్ క్యాడర్ లో ఆందోళన!

పూర్తిగా సానుకూలంగా ఉన్న పరిస్థితులను కూడా అత్యంత సంక్షిష్టంగా మార్చుకుని ఇబ్బందులు పడటం కాంగ్రెస్ కు పరిపాటి.  గతంలో రాజకీయ పండితులు ఈ గ్రాండ్ ఓల్డ్ పార్టీ గురించి  కాంగ్రెస్ పార్టీని ప్రత్యర్థులు ఓడించలేరు. కానీ ఆ పార్టీయే తనను తాను ఓడించుకుంటుంది అని చెప్పేవారు. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న తరువాత కూడా ఆ పార్టీలో ఆ విషయంలో ఎలాంటి మార్పూ రాలేదనడానికి తెలంగాణ లోక్ సభ ఎన్నికలలో  పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో పడుతున్న మల్లగుల్లాలే నిదర్శనం. రానున్న లోక్ సభ ఎన్నికలలో తెలంగాణలో  కాంగ్రెస్ కచ్చితంగా గెలిచే స్థానం ఏదైనా ఉందంటే అది ఖమ్మం లోక్ సభ స్థానమే అనడంలో సందేహం లేదు . గత ఏడాది డిసెంబర్ లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లాలో దాదాపు క్లీన్ స్వీప్ చేసేసింది. ఒక్క స్థానం వినా జిల్లాలోని అన్ని స్థానాలనూ కైవశం చేసుకుంది. ఒక్క స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించినా... ఆయనా కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. అటువంటి జిల్లాకు కేంద్రమైన ఖమ్మం లోక్ సభ స్థానానికి అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది. పలు దఫాలు హైకమాండ్ రాష్ట్ర నేతలతో చర్చలు జరిపినా అభ్యర్థి విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోయింది. మరో రెండు రోజుల్లో అంటే ఏప్రిల్ 25 నామినేషన్ గడువు ముగుస్తుంది. అయినా ఇప్పటికీ కాంగ్రెస్ ఖమ్మం అభ్యర్థి ఎవరన్నది తేల్చుకోలేని అయోమయ స్థితిలో ఉంది.  తెలంగాణలోని మొత్తం 17 స్థానాలకూ బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని ప్రారంభించినప్పటికీ, ఏప్రిల్ 18న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనా కాంగ్రెస్ మాత్రం ఇంకా  మూడు లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయలేక ఆపసోపాలు పడుతోంది.  ఈ జాప్యం ఆ పార్టీ క్యాడర్ ను అయోమయానికి గురి చేస్తున్నది.   కరీంనగర్, హైదరాబాద్ స్థానాలను పక్కన పెడితే.. ఖమ్మం లోక్ సభ అభ్యర్థి ఎంపిక వ్యవహారం మాత్రం పార్టీ హైకమాండ్ కు సైతం తలనొప్పిగా మారింది. ఈ నియోజకవర్గ పార్టీ అభ్యర్థిత్వం  తమ వారికే ఇవ్వాలంటూ రేవంత్ కేబినెట్ లోని ఇద్దరు కీలక మంత్రులు గట్టిగా పట్టుబట్టడంతో ఇక్కడ అభ్యర్థి ఎంపిక    వివాదాస్పదంగా మారింది.    ఖమ్మం టికెట్ తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి ఇవ్వాలని మంత్రి పొంగులేటి, కాదు కాదు తన సతీమణి నిందినికే అని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గట్టిగా పట్టుబడుతుండటంతో ఎంపికలో జాప్యం జరుగుతోంది.  ఈ విషయంలో ఇహనో ఇప్పుడో హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకుని అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నప్పటికీ ఈ జాప్యం పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపుతుందా అన్న ఆందోళన కేడర్ లో వ్యక్తం అవుతోంది. 
Publish Date: Apr 23, 2024 10:37AM

చంద్ర‌బాబు మాస్టర్ స్ట్రోక్.. స్పీక‌ర్ ఆయనేనా?!

చంద్ర‌బాబు నాయుడు స్కెచ్ వేశారంటే ప్ర‌త్య‌ర్థుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టాల్సిందే.. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన నారా చంద్రబాబునాయుడు..  పార్టీని న‌మ్ముకున్న వారికి.. క‌ష్ట‌కాలంలో పార్టీకి అండ‌గా నిలిచిన వారికి ఏదో ఒక విధంగా న్యాయం చేస్తారని పేరుంది. తాజాగా మ‌రోసారి ఆ విష‌యం రుజువైంది. ప్ర‌త్య‌ర్థులు అడ్డుప‌డినా చంద్ర‌బాబు త‌న మార్క్ రాజ‌కీయంతో ర‌ఘురామ కృష్ణం రాజు ఎన్నిల బ‌రిలో నిలిచేలా చేశారు. బీజేపీ నుంచి పార్ల‌మెంట్ బ‌రిలో ర‌ఘురామ కృష్ణం రాజు పోటీ చేస్తార‌ని అంద‌రూ భావించారు.. కానీ, ప్ర‌త్య‌ర్థులు ప‌న్నిన వ్యూహంతో ర‌ఘురామ‌కు టికెట్ ద‌క్క‌లేదు. దీంతో రంగంలోకి దిగిన చంద్ర‌బాబు.. తెలుగుదేశం అభ్య‌ర్థిగా ఆయ‌నను బ‌రిలోక  నిలిపి   న‌మ్ముకున్న‌వారికి ఎప్పుడూ అండ‌గా ఉంటాన‌ని మ‌రోసారి స్ప‌ష్టం చేశారు. దీనికితోడు నియోజ‌క‌వ‌ర్గంలో తెలుగుదేశం టికెట్ ఆశించిన వారి నుంచి ర‌ఘురామ‌కు ఇబ్బందిలేకుండా రూట్ క్లియ‌ర్ చేశారు. చంద్ర‌బాబు మార్క్ రాజ‌కీయంతో ఊహించ‌ని ప‌రిణామాల‌తో తాడేప‌ల్లి ప్యాలెస్ కంగుతింది. త‌మ వ్యూహాల‌ను చిత్తుచేసి ర‌ఘురామ‌కు చంద్ర‌బాబు టికెట్ ఇవ్వ‌డంతో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిలో కొత్త భ‌యం మొద‌లైంద‌ని వైసీపీ వ‌ర్గీయుల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.  ఏపీ రాజ‌కీయాల‌పై అవ‌గాహ‌న ఉన్న ప్ర‌తిఒక్క‌రికీ ర‌ఘురామ కృష్ణంరాజు గురించి తెలిసే ఉంటుంది. ర‌ఘురామ కృష్ణంరాజు గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ ఎంపీ అభ్య‌ర్థిగా న‌ర‌సాపురం నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీచేసి విజ‌యం సాధించారు. అయితే, మొద‌టి నుంచి సీఎంగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీసుకుంటున్న ఒట్టెద్దు పోక‌డ నిర్ణ‌యాల‌ను వ్య‌తిరేకిస్తూ వ‌చ్చారు. కాల‌క్ర‌మంలో వైసీపీ అధిష్టానానికి, ర‌ఘురామ కృష్ణంరాజుకు దూరం పెరిగింది. క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలిచిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.. సొంత పార్టీ ఎంపీ అయిన‌ ర‌ఘురామ‌పైకూడా   అక్ర‌మ కేసులు బ‌నాయించారు.   పోలీసుల‌తో ధర్డ్ డిగ్రీ ట్రీట్ మెంట్ ఇప్పించారు. ఆ స‌మ‌యంలో ర‌ఘురామ కృష్ణంరాజుకు చంద్ర‌బాబు అండ‌గా నిలిచారు. జ‌గ‌న్ తీరుతో తీవ్ర ఆగ్ర‌హానికిగురైన ర‌ఘురామ‌రాజు వీలుచిక్కిన‌ప్పుడ‌ల్లా ఆయ‌న ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు చేస్తూ వ‌చ్చారు. అయితే, ప్ర‌స్తుతం జ‌రిగే ఎన్నిక‌ల్లో ఏపీలో తెలుగుదేశం, జ‌న‌సేన, బీజేపీ  కూట‌మిగా పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ ఎన్నిక‌ల్లో బీజేపీ త‌ర‌పున ర‌ఘురామ కృష్ణంరాజుకు ఎంపీ అభ్య‌ర్థిగా అవ‌కాశం ద‌క్కుతుంద‌ని అంద‌రూ భావించారు. కానీ  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  తనకు బీజేపీ పెద్ద‌ల‌లో ఉన్న  ‘పలుకుబడి’ని ఉపయోగించి ర‌ఘురామ‌కు టికెట్ రాకుండా అడ్డుకున్నారని విమ‌ర్శ‌లు ఉన్నాయి. ర‌ఘురామ కృష్ణంరాజు సైతం జ‌గ‌న్ వ‌ల్ల‌నే త‌న‌కు బీజేపీ టికెట్ ఇవ్వ‌లేద‌ని చెప్పారు. ప్ర‌భుత్వాన్ని అడ్డుపెట్టుకొని జ‌గ‌న్ చేస్తున్న‌ క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌పై పోరాటం చేస్తున్న ర‌ఘురామ కృష్ణంరాజుకు తొలి నుంచి తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీలు అండ‌గా నిలుస్తూ వ‌చ్చాయి. కూట‌మి నుంచి టికెట్ ఆశించిన ఆయ‌న‌కు జ‌గ‌న్ రాజ‌కీయ వ్యూహంతో పోటీచేసేందుకు అవ‌కాశం లేకుండా పోయింది. దీంతో ర‌ఘురామ విష‌యంలో  తెలుగుదేశం, జ‌న‌సేన‌పై జ‌గ‌న్ విజ‌యం సాధించారన్న అంశం ప్ర‌జ‌ల్లోకి విస్తృతంగా వెళ్లింది. చంద్ర‌బాబు రంగంలోకి దిగి ర‌ఘురామ‌కు టికెట్ విష‌యంలో బీజేపీ అధిష్టానానికి న‌చ్చ‌జెప్పిన‌ప్ప‌టికీ ఉప‌యోగం లేకుండా పోయింది. దీంతో.. తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా ఉండి నియోజ‌క‌వ‌ర్గం నుంచి ర‌ఘురామ కృష్ణంరాజుకు చంద్ర‌బాబు టికెట్ కేటాయించారు. అప్ప‌టికే ఉండి నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంతెన రామ‌రాజు టీడీపీ అభ్య‌ర్థిగా ఉన్నారు. తొలి జాబితాలోనే మంతెన రామ‌రాజును ఉండి అభ్యర్ధిగా చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఆయనకు న‌చ్చ‌జెప్పి ర‌ఘురామకు చంద్ర‌బాబు టికెట్ కేటాయించారు చంద్రబాబు.  మంతెన రామ‌రాజుతో క‌లిసి ర‌ఘురామ కృష్ణంరాజు సోమవారం (ఏప్రిల్ 22) నామినేష‌న్ దాఖ‌లు చేశారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ర‌ఘురామ విష‌యంలో జ‌గ‌న్ ఎత్తుకు చంద్ర‌బాబు పైఎత్తువేసి విజ‌యం సాధించ‌డంతో జ‌గ‌న్ శిబిరంలో కొత్త టెన్ష‌న్ మొద‌లైంద‌ట‌.  ఏపీలో కూట‌మికి ప్ర‌జ‌ల నుంచి పెద్ద ఎత్తున మ‌ద్ద‌తు ల‌భిస్తున్నది.  స‌ర్వేల‌న్నీ తెలుగుదేశం కూటమిదే అధికారం అని విస్పష్టంగా చెబుతున్నాయి.  దీంతో వైసీపీ అభ్య‌ర్థుల‌ను ఓట‌మి భ‌యం వెంటాడుతున్నది. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటు కావ‌టం ఖాయ‌మ‌ని స్ప‌ష్ట‌మ‌వుతున్న వేళ‌..  ఏపీ అసెంబ్లీ  స్పీక‌ర్‌గా ఎవ‌రు ఉంటార‌నే అంశంపై ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. ఉండి నియోజ‌క‌వ‌ర్గంలో ర‌ఘురామ కృష్ణంరాజు విజ‌యం న‌ల్లేరుపై న‌డ‌కేన‌ంటున్నారు. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పడితే అసెంబ్లీ స్పీక‌ర్ గా ర‌ఘురామ కృష్ణంరాజు ఉంటారన్న ప్ర‌చారం జ‌రుగుతుండ‌టంతో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిలో కొత్త టెన్ష‌న్ మొద‌లైంద‌ట‌. దీంతో వైసీపీ అధికారంలోకి రాక‌పోయినా భ‌రిస్తా.. ర‌ఘురామ కృష్ణంరాజు గెల‌వొద్ద‌ని త‌న అనుచ‌రులకు జ‌గ‌న్ సూచించిన‌ట్లు ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది.
Publish Date: Apr 23, 2024 9:59AM

కుడి ఎడమైతే పొరపాటు లేదా.. బయటపడ్డ వెల్లంపల్లి డ్రామా

ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జ‌ల్లో సానుభూతిని పొంద‌డానికి ఎలాంటి డ్రామాలు ఆడేందుకైనా వెనుకాడ‌రు. ఈ విష‌యం గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో రుజువైంది. కోడిక‌త్తి డ్రామాతో ప్ర‌జ‌ల్లో సానుభూతిని పొందిన జ‌గ‌న్‌.. బాబాయ్ హ‌త్య‌ను చంద్ర‌బాబుపైనెట్టి  ప్ర‌జ‌ల సానుభూతి ఓట్ల‌తో అధికారంలోకి వ‌చ్చారు. ప్ర‌స్తుత ఎన్నిక‌ల్లోనూ ఏపీ ప్ర‌జ‌ల‌పై మ‌రోసారి సానుభూతి ఆస్త్రం ప్ర‌యోగించేందుకు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తల్లినీ చెల్లినీ గెంటేసి ఒంటరినయ్యానంటూ బేలకబుర్లు చెబుతున్నారు. అవి పని చేయడం లేదని గ్రహించి  రాయిదాడి డ్రామాకు తెరలేపారు. జ‌గ‌న్‌పై రాయిదాడి ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా విజయవాడ చేరుకున్న జగన్ పై గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు రాయిదాడి చేశారు. ఆ రాయి జ‌గ‌న్ కంటి పైభాగంలో త‌గిలి ప‌క్క‌నే ఉన్న వైసీపీ అభ్య‌ర్థి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ కంటికి త‌గిలింది. అయితే, ఆ రాయి ఎవ‌రికీ క‌నిపించ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం. జ‌గ‌న్‌పై రాయిదాడి ఘ‌ట‌న ఎన్నిక‌ల డ్రామాలో భాగ‌మ‌ని మెజార్టీ ప్ర‌జ‌లు సైతం కొట్టిపారేశారు. దీంతో జ‌గ‌న్ సానుభూతి డ్రామా  ఫెయిల్ అయింది. అయితే, ఎన్నిక‌ల ప్ర‌చారంలో సానుభూతికోసం వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ కంటికి పెద్ద క‌ట్టువేయించుకున్నాడు.. మొన్నటి వ‌ర‌కు ఆయ‌న ఎడ‌మ కంటికి క‌ట్టువేయించుకోగా.. ప్ర‌స్తుతం ఆ క‌ట్టు కుడి కంటికి షిప్ట్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటో  సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. మొత్తం రాయి దాడి అంతా డ్రామా అన్న విషయాన్ని నిర్ద్వంద్వంగా తేల్చి పారేసింది.   ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రాబోతుందని స్ప‌ష్ట‌మ‌వుతోంది. కూట‌మి అభ్య‌ర్థుల‌కు ప్ర‌జ‌ల్లో ల‌భిస్తున్న మ‌ద్ద‌తుతోపాటు..   స‌ర్వేల‌న్నీ కూట‌మి అధికారంలోకి రావ‌డం ప‌క్కా అని తేల్చిచెప్పేశాయి. ఐదేళ్ల కాలంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌తో రాష్ట్రాన్ని అభివృద్దిలో పూర్తిగా వెన‌క్కు నెట్టేశారు. ప్ర‌జ‌ల‌కు క‌నీస సౌక‌ర్యాలు క‌ల్ప‌న క‌రువై.. నిరుద్యోగులకు ఉద్యోగాలు దొర‌క్క ఇత‌ర రాష్ట్రాల‌కు వలః వెళ్లిన‌ ప‌రిస్థితి. దీంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. దీనికితోడు మేమంతా సిద్ధం పేరుతో జ‌గ‌న్ నిర్వ‌హిస్తున్న బ‌స్సు యాత్ర‌ల‌కు ప్ర‌జ‌ల నుంచి స్పంద‌న క‌రువైంది. బ‌స్సు యాత్ర‌కు ప్ర‌జ‌లు ఆశించిన స్థాయిలో రాక‌పోవ‌డంతో స్థానిక నేత‌ల‌పై జ‌గ‌న్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న‌ట్లు వైసీపీ వ‌ర్గీయుల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. మ‌రోసారి ప్ర‌జ‌ల‌పై సానుభూతి అస్త్రాన్ని ప్ర‌యోగించ‌డం ద్వారా తండోప‌తండాలుగా ప్ర‌జ‌లు బ‌స్సు యాత్ర‌ల‌కు త‌ర‌లివ‌చ్చేలా చేయ‌డంతోపాటు.. ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓటు బ్యాంకును మ‌ళ్లీ త‌మ‌వైపుకు తిప్పుకోవ‌చ్చ‌ని వైసీపీ నేత‌లు ప్లాన్ వేశారు. ప్లాన్ ప్ర‌కారం.. జ‌గ‌న్ బ‌స్సు యాత్ర స‌మ‌యంలో జ‌గ‌న్‌పై రాయిదాడి ఘ‌ట‌న జ‌రిగింది. ఈ రాయి జ‌గ‌న్ కంటి పైభాగంలో త‌గిలి, ప‌క్క‌నే ఉన్న వైసీపీ అభ్య‌ర్థి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ కంటికి త‌గిలింది. రాయిదాడి ఘ‌ట‌న‌ను రాజ‌కీయం చేసేందుకు వైసీపీ నేత‌లు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ, గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌గ‌న్ కుట్ర‌ల‌ను గ‌మ‌నించిన ప్ర‌జ‌లు.. ప్ర‌స్తుతం రాయిదాడి ఘ‌ట‌న వైసీపీ రాజ‌కీయ కుట్ర‌లో భాగ‌మేన‌ని తేల్చేశారు.  జ‌గ‌న్ పై రాయిదాడి ఘ‌ట‌న‌ను తెలుగుదేశం నేత‌ల‌పై నెట్టాల‌ని వైసీపీ నేత‌లు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేశారు. ఈ క్ర‌మంలో రాయిదాడి చేసింది వీరే అంటూ కొంద‌రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలుగుదేశం నేత, ఆ పార్టీ అభ్య‌ర్థి బోండా ఉమాను ఇరికించే ప్ర‌య‌త్నం చేశారు. కానీ, వైసీపీ నేత‌ల ప్ర‌య‌త్నాలు విఫ‌ల‌మ‌య్యాయి. రాయిదాడి ఘ‌ట‌న‌లో ఎడ‌మ కంటికి గాయ‌మైంద‌ని వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ కు వైద్యులు పెద్ద క‌ట్టువేశారు. ఎడ‌మ కన్ను మొత్తానికి క‌ట్టు క‌ట్టారు. క‌న్నుకు పెద్ద క‌ట్టుతోనే వెల్లంప‌ల్లి ఎన్నికల ప్ర‌చారంలో పాల్గొంటున్నాడు. త‌న‌పై రాయిదాడి చేశారని ప్ర‌జ‌ల‌కు చెబుతూ సానుభూతి పొందే  ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. తాజాగా వెల్లంప‌ల్లి కంటి గాయం ఒట్టి డ్రామా అని బ‌య‌ట‌ప‌డింది. మొన్న‌టి వ‌ర‌కు వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ ఎడ‌మ కంటికి గాయ‌మైన‌ట్లు క‌ట్టు క‌ట్టుకోగా..   రెండు రోజుల క్రితం త‌న ప్ర‌చారంలో కుడి కంటికి క‌ట్టు క‌ట్టుకుని ప్రచారంలో పాల్గొన్నారు. వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నది. ఈ వీడియోను చూసిన నెటిజ‌న్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ వీడియో చూసిన ప‌లువురు వైసీపీ నేత‌లు జ‌గ‌న్ ప్లాన్ మొత్తాన్ని పాడుచేశావు క‌ద‌య్యా అంటూ సోష‌ల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై రాయిదాడి ఘ‌ట‌న కేవ‌లం వైసీపీ నేత‌లు ఆడిన డ్రామా అని, ఆ విష‌యంపై వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ స్ప‌ష్ట‌త ఇచ్చాడంటూ సెటైర్లు వేస్తున్నారు. అయితే, సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న వీడియో నిజ‌మైంది కాదు.. అస‌లు కుడి కంటికి వెల్లంప‌ల్లి క‌ట్టే క‌ట్టుకోలేదు అంటూ వైసీపీ నేత‌లు పేర్కొంటున్నారు. మొత్తానికి జ‌గ‌న్‌పై రాయిదాడి ఘ‌ట‌న వివాదం కాస్తా వెల్లంప‌ల్లి ఓవరేక్షన్ తో సానుభూతి కోసం ఆడిన డ్రామాగా సందేహాలకు అతీతంగా రుజువైపోయింది. జగన్ బకరాగా మిగిలిపోయారు.  పాపం తగలని గాయానికి కట్టే బ్యాండేజే కదా కుడి ఎడమైతే పొరపాటెందుకౌతుందని ఆ కట్టు కట్టిన వైద్యుడు భావించాడేమో అంటే నెటిజనులు వెటకారం చేస్తున్నారు.  ఇలా ఉండ‌గా వెల్లంప‌ల్లి కంటి బ్యాండేజ్ ఎడ‌మ నుంచి కుడివైపుకి షిప్ట్ అయినట్లుగా వ‌స్తున్న వార్త‌లు ఫేక్ అని వైసీపీ ఖండిస్తోంది.అయినా జ‌నం మాత్రం వెల్లంప‌ల్లి కంటికి తీవ్ర గాయ‌మ‌యిందంటే న‌మ్మ‌డం లేదు.సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న సెటైర్ల‌ని అస‌లు రాయిదాడే ఫేక్ అని చెబుతున్నారు.  
Publish Date: Apr 23, 2024 7:39AM

తొలి దశ పోలింగ్ తీరుతో బీజేపీ షాక్.. కొత్త వ్యూహాలపై మల్లగుల్లాలు!

బీజేపీ హ్యాట్రిక్ ధీమా సడలినట్లు కనిపిస్తోంది. మోడీత్వ మేనిఫెస్టో ప్రజలపై పెద్దగా ప్రభావం చూపలేదని తొలి దశ పోలింగ్  సరళిని బట్టి ఆ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. సార్వత్రిక ఎన్నికలలో మిత్రపక్షాలతో కలిసి నాలుగొందలకు పైగా స్థానాలలో విజయం సాధించి ముచ్చటగా మూడో సారి కూడా మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఆకాంక్షను సాకారం చేసుకోవాలంటే మిగిలిన దశలకు ప్రచార వ్యూహాన్ని మార్చాలని బీజేపీ అగ్రనాయకత్వం యోచిస్తున్నట్లు కనిపిస్తోంది.  వాస్తవానికి కొద్ది కాలం ముందు నుంచే  సార్వత్రిక ఎన్నికలలో   మిత్రపక్షాలతో కలిసి నాలుగొందలకు పైగా స్థానాలలో విజయం అంటూ బీజేపీ చేస్తున్న ప్రచారం ఉత్తుత్తి ప్రచారార్భాటమేనా.. వాస్తవానికి క్షేత్ర స్థాయిలో కమలం పార్టీకి అంత సీన్ లేదా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేశారు. పరిశీలకులు మాత్రమే కాదు బీజేపీ పొలిటికల్ మెంటార్ గా చెప్పుకునే ఆర్ఎస్ఎస్ సైతం బీజేపీ గ్రాఫ్ పడిపోతోందని నివేదికలు ఇచ్చింది.  ఏడు దశలలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలలో తొలి దశ పోలింగ్ ముగిసిన తరువాత బీజేపీ ఖంగారు చూస్తుంటే ఆర్ఎస్ఎస్ చెప్పినట్లుగానే బీజేపీ గ్రాప్  గణనీయంగా పడిపోయిందా అన్న అనుమానాలు కలగక మానవు. ఒక పరిశీలన మేరకు తొలి దశ ఓటింగ్ తరువాత బీజేపీలో కంగారు మొదలైంది. మూడో సారి అధికారం అన్న ధీమా ఒకింత తగ్గినట్లు కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితిపై   పార్టీ అగ్రనాయకత్వానికి ఒక  అవగాహన వచ్చిందంటున్నారు. బీజేపీ విభజన రాజకీయాల ప్రభావం పార్టీ విజయావకాశాలపై ప్రతికూల ప్రభావం చూపిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నెల 19న దేశ వ్యాప్తంగా 102 లోక్ సభ నియోజకవర్గాలలో తొలి దశలో పోలింగ్ జరిగింది. అయితే బీజేపీ పట్ల ప్రజలలో ఉన్న ప్రతికూలత తీవ్రత ఎంతన్నది తొలి దశ పోలింగ్ తీరును బట్టి బీజేపీ అగ్రనాయకత్వానికి అర్ధమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తొలి దశ పోలింగ్ తరువాత అంతర్మథనంలో పడిన బీజేపీ అగ్రనాయకత్వం ఆదివారం అర్ధరాత్రి అత్యవసరంగా సమావేశమైనట్లు చెబుతున్నారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డాలు పాల్గొన్న ఆ సమావేశంలో మిగిలిన విడతలలో పుంజుకునుందుకు అనుసరించాల్సిన  వ్యూహాలపై చర్చించారని అంటున్నారు. మరో వైపు అందుతున్న సమాచారం మేరకు తమిళనాడు, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మహారాష్ట్రలలో ఇండియా కూటమి అనూహ్యంగా పుంజుకుందని తెలుస్తోంది.  నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, పేదరికం, రైతు సమస్యలు బీజేపీకి ప్రతికూలంగా మారాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
Publish Date: Apr 22, 2024 6:33PM

ప్రత్యర్థులను సైతం విస్మయపరిచిన చంద్రబాబు చాణక్యం!

నాయకుడు పార్టీని ముందుండి నడిపించడమే కాదు.. క్లిష్ట సమయాల్లోనూ, సంక్షోభంలోనూ కూడా పార్టీ నేతలూ, క్యాడర్ లో తనపై విశ్వాసం, నమ్మకం కోల్పోకుండా నిలబెట్టుకోవాలి. చంద్రబాబు ఆ విషయంలో ఏ ఇతర రాజకీయ నేతకన్నా ముందు ఉంటారు. ఆయన నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న కాలం కంటే విపక్షంగా ఉన్న కాలమే ఎక్కువ. చంద్రబాబు పార్టీ పగ్గాలు చేపట్టిన తరువాత తెలుగుదేశం 14 ఏళ్లు అధికారంలో ఉంటే పదిహేనేళ్లు విపక్షంలో ఉంది. అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా ప్రజా నేతగా, పార్టీ అధినేతగా ఆయన స్థానం చిక్కబడి గట్టిపడిందే తప్ప బలహీన పడింది లేదు. ఆయన నాయకత్వంపై నేతల్లో కానీ, క్యాడర్ లో కానీ విశ్వాసం సన్నగిల్లిన సందర్భం లేదు. 2019 ఎన్నికలలో పరాజయం తరువాత పార్టీ ఇక పుంజుకోవడం కష్టమన్న భావన రాజకీయవర్గాలలో వ్యక్తమైంది. అయితే ఫీనిక్స్ లా పార్టీ పూర్వ వైభవం సంతరించుకుంది. సామాన్య జనంలో కూడా చంద్రబాబు నాయకత్వమే రాష్ట్రానికి రక్ష అన్న భావన వ్యక్తమయ్యేలా ఆయనపై విశ్వసనీయత పెరిగింది. 2024 ఎన్నికల ముంగిట తెలుగుదేశం పార్టీ విజయంపై దాదాపుగా ఎవరికీ ఎటువంటి సందేహం లేని పరిస్థితి నెలకొంది. అయితే ఈ ఎన్నికలలో జనసేన, బీజేపీలతో తెలుగుదేశం పొత్త పెట్టుకుంది. ఒంటరిగానే అధికారంలోకి రావడం ఖాయమైన పరిస్థితుల్లో పొత్త పేరుతో కొన్ని స్థానాలను త్యాగం చేయడం అవసరమా అన్న భావన పార్టీ కార్యకర్తలలో వ్యక్తం అయ్యింది. అయితే చంద్రబాబు పార్టీ నేతలనూ క్యాడర్ ను పొత్తుకు ఒప్పించారు. పొత్తుపై చర్చలకు ముందు వరకూ జనసేన తమ వాటా కింది 40 నుంచి 50 స్థానాల వరకూ కోరుతోందన్న వార్తలు వినిపించాయి. అయితే చంద్రబాబు పొత్తులో భాగంగా 21 స్థానాలలో పోటీకి జనసేనను ఒప్పించి పార్టీ క్యాడర్ సహా అందరినీ ఆశ్చర్య పరిచారు. అలాగే బీజేపీతో పొత్తు వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ అన్న అభిప్రాయంతో ఉన్న పార్టీ వర్గాలను సముదాయించారు. పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ 144 అసెంబ్లీ స్థానాలలోనే పోటీ చేయాల్సి రావడం, అలాగే పొత్తులో భాగంగా బీజేపీకి పది అసెంబ్లీ స్థానాలు కేటాయించడంతో తెలుగుదేశంలో గత ఐదేళ్లుగా జగన్ పాలనను ఎదిరించి నిలబడి పోరాడిన కొందరు నేతలకు ఈ సారి పార్టీ టికెట్ దక్కలేదు. దీంతో పలు నియోజకవర్గాలలో తెలుగేదేశం రెబల్స్ రంగంలోకి దిగే అవకాశాలు మెండుగా ఉంటాయనీ ఆ మేరకు తెలుగుదేశం నష్టపోయే అవకాశం ఉందనీ పరిశీలకులు విశ్లేషించారు. అయితే  చంద్రబాబు రెబల్స్ బెడదలేకుండా హ్యాండిల్ చేసిన తీరు రాజకీయ పండితులను సైతం విస్మయపరిచింది. మైలవరం, ఉండి నియోజకవర్గాలలో అసమ్మతి లేకుండా ఆయన డీల్ చేసిన తీరే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.   మైలవరం తెలుగుదేశం టికెట్ ను వసంతకృష్ణ ప్రసాద్ కు ఇవ్వడం, అందుకు దేవినేని ఉమను ఒప్పించడంలో చంద్రబాబు రాజకీయ చాణక్యం బోధపడుతుంది. ఇప్పుడు మైలవరంలో వసంత కృష్ణ ప్రసాద్ తరఫున దేవినేని ఉమ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అలాగే ఉండిలో తెలుగుదేశం సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజు ఉన్నారు. గత ఐదేళ్లుగా వైసీపీ వేధింపులను ఎదుర్కొంటూ పార్టీ కోసం గట్టిగా నిలబడ్డారు. అయినే సహజంగా ఉండి తెలుగుదేశం అభ్యర్థి అవుతారు. చంద్రబాబు కూడా ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయనను ప్రకటించారు. అయితే తీరా నామినేషన్ల కు ముందు అనివార్యంగా ఆయనను మార్చి ఆ సీటును రఘురామకృష్ణం రాజుకు ఇవ్వాల్సి వచ్చింది.  దీనిని వ్యతిరేకిస్తూ రామరాజు తిరుగుబాటు చేస్తారనీ, రెబల్ గా రంగంలోకి దిగుతారనీ అంతా భావించారు. కానీ ఇక్కడే చంద్రబాబు చక్రం తిప్పారు.  పార్టీ  సమావేశంలో రామరాజు రఘురామకృష్ణం రాజుతో కలివిడిగా మెలగడమే కాదు, ఆర్ఆర్ఆర్ నామినేషన్ ర్యాలీలో కూడా చురుగ్గా పాల్గొన్నారు. అలాగే ధర్మవరంలో పరిటాల శ్రీరామ్ బీజేపీ అభ్యర్థికి మద్దతుగా చురుగ్గా ప్రచారం చేస్తున్నారు.  దెందులూరులో చింతమనేనినే అభ్యర్థిగా నిలపడం, అనపర్తిలో తెలుగుదేశం అభ్యర్థిగా అవకాశం లేకపోవడంతో నల్లమల్లి రామకృష్ణారెడ్డిని బీజేపీ అభ్యర్థిగా రంగంలోకి దిగేందుకు ఒప్పించడం ద్వారా చంద్రబాబు చాణక్యంలో తనకు ఎవరూ సాటిరారని నిరూపించుకున్నారు. నాయకుడిగా పార్టీపై తన పట్టును మరోసారి సందేహాలకు అతీతంగా నిలుపుకున్నారు. 
Publish Date: Apr 22, 2024 5:15PM