తెలుగువారి ఆత్మగౌరవ పతాక తెలుగుదేశం!

తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే లక్ష్యంగా నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి శుక్రవారం నాటికి (మార్చి 29) సరిగ్గా 42 ఏళ్లు.  ఈ 42 ఏళ్లుగా ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నా.. తెలుగువాడి, వేడికి అండగా, దండగా, దక్షతగా నిలిచిన పార్టీ తెలుగుదేశం. తెలుగు దేశం పార్టీ తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి  సాక్షీభూతం.  దేశాన్ని ఏకపక్షంగా పాలిస్తూ రాష్ట్రాల హక్కులు కాలరాస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఆవిర్భవించిన తెలుగుదేశం, ఆవిర్భావంతోనే సంచలనం సృష్టించింది.  తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారని గర్జించి  పార్టీని స్థాపించిన నందమూరి తారకరామారావు, పార్టీని స్థాపించిన  తొమ్మిది నెలలలోనే అధికారంలోకి తీసుకువచ్చారు.  పార్టీ ఆవిర్భవించిన తొమ్మిది నెలల స్వల్ప వ్యవధిలో అధికారాన్ని చేజిక్కించుకున్న తెలుగుదేశం పార్టీ అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  ప్రతిసారి ముఖ్యమంత్రులను మార్చే కాంగ్రెస్ తీరును ఎండగడుతూ ఎన్టీఆర్ చేపపట్టిన చైతన్యరథ యాత్ర నభూతో నభవిష్యతి. 1982 మార్చి 29న పార్టీని  ప్రకటించారు తారకరామారావు.  ఎన్టీఆర్  చైతన్యరధం బయలుదేరగానే.. తెలుగు దేశం పార్టీకి బ్రహ్మరథం మొదలైంది. పల్లెలన్నీ ఆయన వెంట కదిలాయి. ఎన్టీఆర్ ఎక్కడికెళ్లినా జన నీరాజనమే. ఇసుక వేస్తే రాలనంత జనమే.  గ్రామాలు గ్రామాలే ఆయనకు జై కొట్టాయి. ముందు లీడర్లెవరు ఆయనకు మద్దతుగా నిలవలేదు. రాజమండ్రిలో గోరంట్ల రాజేంద్రప్రసాద్ తమ్ముడు పార్టీ జెండా కట్టారు. కడియంలో  వడ్డి వీరభద్రరావు  సభ్యత్వ పుస్తకాలు పట్టుకుని  రాజ్ దూత్ బండి మీద తిరిగారు.  బూరుగుపూడి పెందుర్తి సాంబశివరావు పార్టీ జెండా ఎత్తారు. ఇలా ఒక్కొక్కరు అన్నగారికి తోడయ్యారు. మండు వేసవిలో అన్నగారి పర్యటన సాగుతున్నా.. జన జాతర ఆగలేదు. ఆయన ప్రత్యర్ధులు మాత్రం సినిమా ఆకర్షణగానే భావించారు .. అలాగే వ్యాఖ్యానించేవారు. వేషాలు వేసుకునేవాళ్లకు ఓట్లు పడతాయా అంటూ అవహేళన చేశారు. ఎన్టీఆర్ పర్యటనకు ఆటంకాలు కల్పించారు. వసతి దొరక్కుండా చూసేవారు.  అయినా అన్నగారి జోరు తగ్గలేదు. అప్పడు ఏ బండికి చూసినా తెలుగుదేశం పిలుస్తుంది రా  కదలిరా  స్టిక్కర్లే.  వేలాది మంది కార్యకర్యలే సొంత డబ్బులతో జెండాలు కొని మోసారు. చైతన్య రథంపై నుంచి ఖాకీ డ్రెస్ లో ఎన్టీఆర్ మాటల తూటాలు..ఉర్రూతలూగించే ప్రసంగాలకు జనాలు ఫిదా అయ్యారు. చైతన్యరధయాత్ర సాగుతుండగానే ఎన్నికలు వచ్చేశాయి. కొంత మందిని ఎన్టీఆర్ పిలిచి టిక్కెట్లు ఇస్తానంటే.. వద్దని కాంగ్రెస్ తరుపున నిలిచారు. అలాంటి వారిలో నీరుకొండ నారయ్య చౌదరి..రాయవరం మునసబు ఉండవల్లి సత్యనారాయణమూర్తి లాంటి నేతలు ఉన్నారు. ఎన్నికలు ముగిశాయి. అయినా కాంగ్రెస్ నేతలకు దింపుడు కళ్ళం ఆశ చావలేదు. సినీ గ్లామరుకి ఓట్లు పడవని వారికి నమ్మకం. అమ్మ బొమ్మకే ఓటేస్తారని వాళ్ల విశ్వాసం.  కౌంటింగ్ మొదలైంది. సాయంత్రం మొదటి ఫలితం షాద్ నగర్... కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ శ్రేణుల ఉత్సాహంగా ఉన్నారు. రేడియో వార్తల్లో ఫలితాల సరళి వెల్లడవుతున్నది. ఒక్కో జిల్లా వారీగా వరుసగా ఆధిక్యతలు చెబుతూ వస్తున్నారు. జిల్లాలకు జిల్లాలు తుడుచిపెట్టుకుపోయాయి. ఎన్టీవోడి దెబ్బకు వేళ్ళూనుకున్న కాంగ్రెస్ మహావృక్షాలు కూలిపోయాయి. ఒక్కో నియోజక వర్గం ఆధిక్యతలు చెబుతుంటే జనం స్పందన జేజేలు..ప్రత్యర్ధుల హాహాకారాలు..ఆర్తనాదాలు. ఎన్టీఆర్ ప్రభంజనాన్ని ...ఈ రీతి విజయాన్ని వారు ఊహించలేదు. దాదాపు అర్ధరాత్రికే మూడింట రెండొంతులు పైగా స్దానాలు కైవసం చేసుకుంది తెలుగు దేశం పార్టీ. డాక్టర్లు..ఇంజినీర్లు.. లాయర్లు..పట్టభద్రులు.. బడుగుబలహీన వర్గాలకు చెందిన కొత్తరక్తం రాజకీయాల్లో అరంగేట్రం చేసారు. ఆంధ్రప్రదేశ్ ఫలితం అప్పుడు దేశ వ్యాప్తంగా పెను సంచలనం. లెక్కింపు మొత్తం పూర్తయ్యేసరికి తెలుగు దేశ పార్టీ 202 స్థానాలు గెలుచుకుని ఘన విజయం సాధించింది.   వేషాలు వేసుకునేవాడంటూ హేళన చేసిన ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు ఏపీ ఫలితాలు చూసి షాకయ్యారు. 1983 జనవరి 9న ఆంధ్రప్రదేశ్ లో తొలి కాంగ్రేసేతర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు నందమూరి తారకరామారావు.  దీంతో తెలుగురాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ తో నవశకం ప్రారంభమయింది. బడుగుబలహీన వర్గాల వేదికయింది. తెలుగు వాడి ఆత్మగౌరవానికి..ఆత్మవిశ్వాసానికి ప్రతీక అయింది.   1983లో దేశం మొత్తం మీద 544 లోక్‌సభ స్థానాలకుగాను 400 స్థానాలను గెలుచుకున్న కాంగ్రెసు హవా కొనసాగుతుంటే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించింది. అప్పటి లోక్‌సభలో  ప్రధాన ప్రతిపక్షమయింది.  అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాకర్షక పథకాలతో జనాల గుండెల్లో చోటు సంపాదించారు నందమూరి తారక రామారావు. ఆయన ప్రవేశపెట్టిన కిలోబియ్యం రెండు రూపాయల పధకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఆయనను పేదవాడి అన్నంముద్దగా మార్చింది. ఇప్పటికీ ప్రజలు రెండు రూపాయల కిలోబియ్యం పథకం గురించి మాట్లాడుకుంటూ అన్నగారిని స్మరించుకుంటున్నారంటే.. ఆ పథకం ఎంతగా పాపులర్ అయిందో ఊహించవచ్చు. పేదల కోసం కూడు, గుడ్డ, గూడు నినాదంతో పాలన సాగించారు ఎన్టీఆర్. వ్యక్తిత్వరీత్యా ఆవేశపరుడిగా కనిపించినా.. తన సంక్షేమ పాలతో పేద ప్రజల గుండెలలో చిరస్థాయిగా నిలిచిపోయారు అన్న ఎన్టీఆర్. "మదరాసీ"లుగా మాత్రమే గుర్తింపబడుతున్న తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఉత్తేజపరిచి, ప్రపంచానికి తెలుగువారి ఉనికిని చాటిన ధీశాలి  నందమూరి తారక రామారావు. రాజకీయ సన్యాసిగా కాషాయ వస్త్రధారణ చేసినా, "ఒక్క రూపాయి" మాత్రమే ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి భృతిగా స్వీకరించినా, అది కేవలం ఎన్.టి.ఆర్.కు మాత్రమే చెల్లింది. నాదెండ్ల భాస్కరరావు 1983 ఆగస్టులో దొడ్డి దారిన ఎన్టీఆర్ పదవిని ఇందిరాగాంధీ సాయంతో లాక్కున్నారు. ఆరోగ్య కారణాలతో అమెరికా వెళ్లి తిరిగి వచ్చిన ఎన్టీఆర్ తీవ్ర ఆగ్రహంతో తన ఏమ్మెల్యే లతో ఢిల్లీలో నిరసన తెలిపారు.తెలుగువారి పౌరుషాన్ని చూపించారు. ఎన్టీఆర్ పోరాటంతో  చేసేది లేక ఇందిరాగాంధీ తిరిగి ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి గా చేశారు . కానీ ఎన్టీఆర్ 1984 లో మధ్యంతర ఎన్నికలకు వెళ్లి 200 పైగా అసెంబ్లీ సీట్లు సాధించి తన సత్తా ఏంటో ఇందిరాగాంధీకి మరో సారి చూపారు. చూపించారు. రెండవ సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1989లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయి తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయింది.  అయినా కుంగిపోకుండా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పారు రామారావు.  దేశంలో  కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఉన్న ప్రాంతీయ పార్టీలని,  జాతీయ పార్టీలను ఒక తాటి పైకి తెచ్చారు.  జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా "నేషనల్ ఫ్రంట్" కూటమిని స్థాపించారు.  కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకుని వి.పి.సింగ్ ని ప్రధానిని చేశారు.  "నేషనల్ ఫ్రంట్"కు చైర్మెన్ గా వ్యవహరించారు ఎన్టీఆర్.  1994లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. రామారావు మూడవ సారి ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.   అయితే రామారావు భార్యగా వచ్చిన లక్ష్మీపార్వతి..  పాలనా వ్యవహారాలలో రాజ్యాంగేతర శక్తిగా కలుగజేసుకుంటున్నదనే ఆరోపణలతో 1995లో  అప్పటి రెవిన్యూ మంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పార్టీని రక్షించుకునే లక్ష్యంతో  తిరుగుబాటు చేశారు. అధికారాన్ని దక్కించుకున్నారు.  అత్యధికమంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడుకి మద్దతు ప్రకటించడంతో ఎన్.టి.రామారావుఅధికారం కోల్పోవలసి వచ్చింది. 1995వ సంవత్సరంలో ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు  చంద్రబాబు 2004వ సంవత్సరం వరకు ముఖ్యమంత్రిగా కొనసాగారు.  అత్యధిక కాలం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకునిగా  చరిత్ర సృష్టించాడు. తన పాలనలో హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మార్చారు చంద్రబాబు. హైదరాబాద్ ను ప్రపంచ పఠంలో పెట్టారు. సైబరాబాద్ నగరాన్నే నిర్మించారు. స్వర్ధాంధ్రప్రదేశ్ లక్ష్యంగా చంద్రబాబు చేసిన పాలన దేశ రాజకీయాల్లో చర్చగా మారింది. తన తొమ్మిదేండ్ల పాలనలో హైదరాబాద్ రూపురేఖలే మార్చేశారు చంద్రబాబు. 1999లో 29 ఎంపీ స్ఠానాలు గెలిచిన తెలుగు దేశం పార్టీ.. పార్లెమంట్ లో నాలుగో అతిపెద్ద పార్టీగా నిలిచింది. 1995 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో పరుగులు తీసింది. చంద్రబాబు విజన్... అన్ని రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచింది. చంద్రబాబు దార్శనికత, ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి అయువుపట్టుగా మారాయి. చంద్రబాబు విజన్ వల్లే తెలంగాణ ప్రస్తుతం ధనిక రాష్ట్రంగా నిలిచిందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర విభజన తరువాత 2014లో జరిగిన ఎన్నికలలో  తెలుగుదేశం విజయం సాధించింది. విభజిత ఆంధ్రప్రదేశ్  తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు తన విజన్ తో  రాజధాని సైతం లేకుండా, రెవెన్యూలోటుతో మిగిలిన రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించారు. ప్రపంచదేశాలే నివ్వెరపడే విధంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి అంకురార్పణ చేశారు. గతంలొ ఎన్నడూలేని విధంగా రాజధాని కోసం రైతులు స్వచ్ఛందంగా భూమి ఇచ్చారు. భూసమీకరణ ద్వారా పైసా ఖర్చు లేకుండా రైతులు తమ భూములను ఇవ్వడానికి ముందుకు వచ్చారు. ప్రధాని మోడీ అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఢిల్లీ అసూయపడేలా అమరావతి నిర్మాణం సాగాలని ఆశీర్వదించారు. కియా మోటార్స్ వంటి కంపెనీలు రాష్ట్రానికి క్యూ కట్టాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రం వరుసగా మూడు సంవత్సరాలు దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.   2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పరాజయం పాలైంది. వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని సమూలంగా తుడిచిపెట్టేయడమే లక్ష్యంగా జగన్ ఈ ఐదేళ్లలో చేయని ప్రయత్నం లేదు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలపై వేధింపులే లక్ష్యంగా ఆయన పాలన సాగింది. స్కిల్ కేసు అంటూ చంద్రబాబును సైతం అక్రమంగా అరెస్టు చేశారు.  అయితే తెలుగుదేశం పార్టీ అన్ని అడ్డంకులనూ అధిగమించి చెక్కు చెదరకుండా నిలిచింది.    ఎన్టీఆర్‌ ఆశయాలు, ఆలోచనలు, విధానాలకు అనుగుణంగానే పనిచేస్తోంది.  ఇనుమడించిన ఉత్సాహంతో రానున్నఎన్నికలలో విజయం సాధించి అధికారపగ్గాలు అందుకోవడానికి ఉరకలేస్తోంది. ప్రజల అభిమానమే ఆయుధంగా అడుగులు వేస్తోంది. తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్ఱావ దినోత్సవం సందర్భంగా   తెలుగుదేశం పార్టీ నేతలు తమ పార్టీ సుదీర్గ ప్రస్థానాన్ని, చేసిన పోరాటాలను మననం చేసుకుంటూ,  స్ఫూర్తితో  రాబోయే ఎన్నికలలో విజయం సాధించి మరోసారి తమ సత్తా చాటేందుకు సిద్ధం అవుతోంది.     తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా...
Publish Date: Mar 29, 2024 11:14AM

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజి డీసిపి రాధాకిషన్ అరెస్టు

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీసీసీ రాధాకిషన్ ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. మరో వైపు ఇదే కేసులో టాస్క్ ఫోర్స్, ఎస్ఐబి సిబ్బందిని బంజారాహిల్స్ లో పోలీసులు విచారిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురు సీఐలు, ఐదుగురు ఎస్ ఐల విచారణ పూర్తైన సంగతి తెలిసిందే. అదే విధంగా గురువారం ఈ కేసుకు సంబంధించి పలువురి వాంగ్మూలాలను పోలీసులు రికార్డు చేశారు. వారి వాంగ్మూలాల ఆధారంగానే టాస్క్ ఫోర్స్ మాజీ డీసీసీ రాధాకిషన్ ను పోలీసులు అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. అలాగే తిరుపతన్న, భుజంగరావులను కూడా పోలీసులు ఇప్పుడో ఇహనో అరెస్టు చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. తాజాగా రాధాకిషన్ ను అరెస్టు చేయడానికి  ముందు ఆయనను దాదాపు పది గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు.   రాధాకిషన్  అసెంబ్లీ ఎన్నికల సమయంలో హవాలా వ్యాపారులను నిర్బంధించి  డబ్బులు ఒక పార్టీకి చేరవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రతిపక్ష నేతలతో పాటు పలువురు వ్యాపారులపై రాధా కిషన్‌ రావు నిఘా పెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్‌రావుపై కేసు నమోదుకాగానే మాజీ డీసీసీ రాధాకిషన్‌రావు అమెరికా వెళ్లిపోయారు. లుకౌట్‌ నోటీసులు జారీ చేయడంతో హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ప్రణీత్‌ రావు డ్రైవర్‌ను కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రభాకర్‌రావుతో సమానంగా రాధాకిషన్‌ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.   ఈ కేసులో ఇప్పటికే ప్రణీత్‌రావుతో పాటు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రముఖుల వ్యక్తిగత విషయాలపై   నిఘా పెట్టి, ప్రభుత్వం మారాక హార్డ్‌డిస్క్‌లను ధ్వంసం చేసినట్లు ఆరోపణలున్నాయి. మరో వైపు భుజంగరావు, తిరుపతన్నను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌పై నాంపల్లి కోర్టులో  వాదనలు ముగిశాయి. న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌ చేసింది.
Publish Date: Mar 29, 2024 10:31AM

బీఆర్ఎస్ పనైపోయినట్లేనా? సీనియర్ల వలసల సంకేతం అదేనా?

అధికారంలో ఉన్న ప‌దేళ్ల పాటు తెలంగాణ రాజ‌కీయాల‌ను కంటిచూపుతో శాసించిన బీఆర్ ఎస్ అధినేత‌ కేసీఆర్‌..  అధికారం కోల్పోయిన త‌రువాత  పార్టీ లీడర్లు, క్యాడ‌ర్ ను కాపాడుకోలేక చతికిల పడిపోతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి ఒక్కొక్క‌రుగా బీఆర్ ఎస్ పార్టీని వీడుతుండ‌టంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.  ద్వితీయ శ్రేణి నేత‌ల నుంచి సీనియ‌ర్ల వ‌ర‌కు బీఆర్ ఎస్ కు గుడ్‌బై చెప్పేస్తున్నారు. తాజాగా కేసీఆర్‌కు ద‌గ్గ‌ర వ్య‌క్తులుగా పేరున్న నేత‌లు సైతం బీఆర్ ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న లోక్ స‌భ ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ పార్టీ నుంచి బ‌రిలో నిలిపేందుకు అభ్య‌ర్థులు సైతం క‌రువైన ప‌రిస్థితి. సిట్టింగ్ ఎంపీలు అనేక మంది బీఆర్ ఎస్ ను వీడి కాంగ్రెస్‌, బీజేపీల్లో చేర‌డంతో బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో కొత్త వారిని బ‌రిలో నిల‌పాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. మ‌రోవైపు వ‌రంగ‌ల్ ఎంపీ అభ్య‌ర్థిగా మాజీ మంత్రి, బీఆర్ ఎస్ ఎమ్మెల్యే క‌డియం శ్రీ‌హ‌రి కుమార్తెకు కేసీఆర్ టికెట్ ఇచ్చారు. ప్ర‌స్తుతం, ఆమె పోటీ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డంతో పాటు తన తండ్రి క‌డియం శ్రీ‌హ‌రితో స‌హా   కాంగ్రెస్ గూటికి చేరడానికి రెడీ అయిపోయారు.  శుక్రవారం (మార్చి 29) వీరిరువురూ  హస్తినలో ఢిల్లీ పెద్దలను కలిసి హస్తం కండువా కప్పుకోనున్నారు. కడియం కావ్యను కాంగ్రెస్ వరంగల్ అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలు ఉన్నారు. అలాగే  కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన  కే. కేశ‌వ‌రావుసైతం బీఆర్ ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పేందుకు రెడీ అయ్యారు. రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి బీఆర్ ఎస్ ప‌దేళ్ల పాల‌న‌లో జ‌రిగిన అవినీతి అక్ర‌మాల‌పై గురిపెట్టారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అవినీతి, గొర్రెల పంపిణీ ప‌థ‌కంతో  సహా ప‌లు ప‌థ‌కాల్లో అక్ర‌మాల‌ను వెలుగులోకి తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారం తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల‌ను  కుదిపేస్తోంది. కేసీఆర్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ కోసం ప్ర‌త్యేకంగా ఓ బృందాన్ని ఏర్పాటు చేసి మరీ రేవంత్ రెడ్డితో పాటు ప‌లువురు ప్ర‌తిప‌క్ష పార్టీల్లోని ముఖ్య‌నేత‌ల‌ ఫోన్ల‌ను ట్యాప్ చేసిన‌ట్లు  స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రణీత్ రావుతో పాటు ప‌లువురు పోలీస్ అధికారుల అరెస్టుతో ఫోన్ ట్యాపింగ్ డొంక క‌దులుతోంది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారం బీఆర్ ఎస్ ముఖ్య‌నేత‌ల మెడ‌కు చుట్టుకునే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయన్న అంచనాలతో  ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. దీంతో బీఆర్ ఎస్ పార్టీలో కొన‌సాగితే రాజ‌కీయ  మ‌నుగ‌డ క‌ష్ట‌మ‌ని భావిస్తున్నకొంద‌రు ముఖ్య‌నేత‌లు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. నేత‌లు పార్టీ మార‌కుండా కేసీఆర్‌, కేటీఆర్ లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నా ఫ‌లితం క‌నిపించ‌డం లేదు. ప్ర‌స్తుతం జ‌రిగే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ పార్టీ క‌నీస స్థానాలలో కూడా విజయం సాధించడం అనుమానంగానే కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతే కాకుండా పార్టీ నుంచి వలసలు కూడా రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. ముఖ్యంగా లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ ఎస్ సీనియ‌ర్ నేత‌లుగా, కేసీఆర్ కు సన్నిహితులుగా పేరొందిన కే. కేశ‌వ‌రావు, క‌డియం శ్రీ‌హ‌రి లాంటి వారు పార్టీని వీడేందుకు సిద్ధ‌మ‌య్యార‌న్న వార్త‌ల‌తో బీఆర్ ఎస్ శ్రేణుల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. వరంగల్ లోక్ సభ నుంచి బీఆర్ ఎస్ అభ్య‌ర్థిగా క‌డియం శ్రీ‌హ‌రి కుమార్తె కావ్య‌కు కేసీఆర్ టికెట్ ఇచ్చారు. ఇటీవ‌ల ఆమె కేసీఆర్ ను క‌లిసి ఆశీర్వాదం సైతం తీసుకున్నారు. కానీ  అనూహ్యంగా ఆమె పోటీ నుంచి విరమించుకుంటున్నానని   లేఖ విడుద‌ల చేయ‌డం బీఆర్ ఎస్ శ్రేణుల‌ను అయోమ‌యానికి గురిచేస్తోంది.  బీఆర్ఎస్ పై అవినీతి, భూకబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణల నేపథ్యంలో పోటీ నుండి తప్పుకుంటున్నట్లు  కావ్య‌ తన లేఖలో వివరించారు. జిల్లాలో నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని లేఖలో ప్రస్తావించారు. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ నుండి విరమించుకుంటున్నట్లు లేఖలో   పేర్కొన్నారు. అయితే  కడియం శ్రీహరి, కడియం కావ్య ఇద్ద‌రూ కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే శ్రీ‌హ‌రితో కాంగ్రెస్ ముఖ్య‌నేత‌లు ప‌లు ద‌ఫాలుగా భేటీ అయిన‌ట్లు స‌మాచారం.  వారం రోజుల క్రిత‌మే శ్రీ‌హ‌రి బీఆర్ ఎస్ ను వీడుతున్నార‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఆయ‌న కుమార్తె కావ్య‌కు ఎంపీ టికెట్ ఇవ్వ‌డంతో వారు బీఆర్ ఎస్ లోనే కొన‌సాగుతున్నార‌ని అంద‌రూ భావించారు. కానీ, ఊహించ‌ని రీతిలో కావ్య పోటీ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌ట‌కించ‌డం రాష్ట్ర రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే, ఆమె కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగనున్నారని వార్తలు వస్తున్నాయి. బీఆర్ఎస్ సీనియర్ నేత కే.కేశవరావుసైతం బీఆర్ ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధ‌మ‌య్యారు.    గురువారం (మార్చి 28) కేసీఆర్ తో భేటీ అయిన కే. కేశవరావు పార్టీని వీడుతున్న‌ట్లు చెప్పిన‌ట్లు స‌మాచారం. దీంతో కేకే తీరుపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. నీ ఫ్యామిలీకి పార్టీ ఏం తక్కువ చేసింది? అంటూ కేకేపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే  కేశ‌వ‌రావు మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధ‌మ‌య్యారని అంటున్నారు. ఇప్ప‌టికే కేశ‌వ‌రావు కుమార్తె, హైద‌రాబాద్ మేయ‌ర్ గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మీ శనివారం (మార్చి 30) కాంగ్రెస్ పార్టీ కండువా క‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఆమెతోపాటు అదేరో జు కేశ‌వ‌రావు కూడా కాంగ్రెస్ కండువా క‌ప్పుకుంటార‌ని తెలుస్తోంది. కేశ‌వ‌రావుతో పాటు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, మ‌రికొంద‌రు బీఆర్ ఎస్ నేత‌లు కాంగ్రెస్  గూటికి చేరనున్నట్లు స‌మాచారం. మొత్తానికి అధికారం కోల్పోయిన కొద్ది నెల‌ల్లోనే బీఆర్ ఎస్ పార్టీని వీడుతున్న నేత‌ల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండ‌టంతో  బీఆర్ఎస్ ఖాళీ అయ్యేందుకు ఎక్కువ కాలం పట్టదని అంటున్నారు. 
Publish Date: Mar 29, 2024 10:10AM

రేణిగుంట గోడౌన్లలో చెవిరెడ్డి ఎన్నికల తాయిలాలు

ప్రజలను ప్రలోభాలకు గురి చేసి  ఎన్నికలలో ఓట్లు దండుకోవడానికి  తిరుపతి వైసీపీ ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి దాచిన టన్నల కొద్దీ తాయిలాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  అలా స్వీధీనం చేసుకున్నవాటిలో చేతిగడియారాలు ఉన్నాయి. డుగులు, కండువాలు, జెండాలు, ఆమ్ప్లిఫైర్లు, టోపీలు , టీషర్స్ ఉన్నాయి. ఆ పరిసర ప్రాంతాలలోని మరిన్ని గోడౌన్లలో కుక్కర్లు, ఫ్యాన్లతో పాటు నోట్ల కట్టలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. విషయం బయటపడగానే వాణిజ్య పన్నుల శాఖ అధికారులు హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అయితే మీడియాను అనుమతించకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. వాటన్నిటికీ బిల్లులు ఉన్నాయంటూ అధికారులు చెప్పడంపై తెలుగుదేశం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చే స్తున్నారు. ఎన్నికల అధికారులు ఏం చేస్తున్నారంటూ నిలదీస్తున్నారు. వెంటనే ఎస్పీ, కలెక్టర్ స్పందించి చెవిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విశేషమేమిటంటో ఆ గోడౌన్లో డమ్మీ ఈవీఎంలు కూడా ఉన్నాయి. దీంతో ఎన్నికలలో ఏ స్థాయిలో అక్రమాలకు పాల్పడేందుకు వైసీపీ తెగించేసిందో అవగతమౌతోందని పరిశీలకులు అంటున్నారు.  
Publish Date: Mar 28, 2024 5:49PM

మేడిగడ్డ బ్యారేజి రిపేర్ పై  కెటీఆర్ తీరు ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే

పదేళ్ల కెసీఆర్ ప్రభుత్వం కుప్పకూలడానికి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజి అని చిన్న పిల్లాడైనా ఠక్కున చెప్పేస్తాడు.  కాళేశ్వరం ప్రాజెక్టు కల్దకుంట్ల ఫ్యామిలీకి ఎటిఎం మాదిరిగా మారిందని గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ప్రజలు నమ్మారు. 10 ఏళ్ల విరామం తర్వాత ఆ పార్టీకి పట్టం కట్టారు. కానీ కల్వకుంట్ల వారసుడైన కెటీఆర్ మాత్రం ఇందులో తమ తప్పేమి లేదన్నట్టుగా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. దొంగనే పోలీస్ అధికారిని దొంగ దొంగ అన్నట్టు ఉంది. దీన్నే ఉర్దూలో ఉల్టా చోర్ కొత్వాల్ కో డాటే  అంటారు.  అహో ధార్ష్ట్య మసాధూనాం నిందతా మనఘాః స్త్రియః మృష్ణతా మివ చోరాణాం తిష్ఠ చోరేతి జల్పతాం పవిత్రలూ, శీలవతులూ అయిన స్త్రీలను నిందించే దుర్మార్గులైన పురుషులను ఏమనవచ్చు  తెలంగాణలో కరువు పరిస్థితులు ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అయితే, ఇది కాలం తెచ్చిన కరువు కాది, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అని చెప్పారు. గత ఏడాది ఇదే కాలంలో రైతులకు పుష్కలంగా సాగు నీటిని అందించామని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ మీద కోపంతో మేడిగడ్డ ప్రాజెక్టును రిపేర్ చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ఢిల్లీకి, హైదరాబాద్ కి మధ్య తిరగడం తప్ప.. రైతులను పరామర్శించేందుకు సీఎం రేవంత్ కు సమయం లేదని అన్నారు.  ఇప్పటి వరకు సుమారు 200 మంది రైతులు చనిపోయారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను ఆదుకోవాలని... ఎండిపోయిన పంటకు నష్ట పరిహారం అందించాలని చెప్పారు. ఎకరానికి రూ. 10 వేలు ఇస్తారో, రూ. 25 వేలు ఇస్తారో ఇవ్వండని అన్నారు. రైతులకు ఇస్తామన్న బోనస్, కౌలు రైతులకు ఇస్తామన్న రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు.  రైతుబంధు కోసం కేసీఆర్ రూ. 7 వేల కోట్లు పెట్టిపోతే... ఆ డబ్బులు రైతులకు ఇవ్వకుండా... కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. రైతుల దీన పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతోందని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఈరోజు కేటీఆర్ పర్యటించారు. తంగళ్లపల్లి మండలం సారంపల్లి వద్ద పంట నష్టాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.  
Publish Date: Mar 28, 2024 4:51PM

బండి సంజయ్ పై కేసు నమోదు 

ఒక వర్గానికి చెందిన వారు మరో వర్గానికి చెందిన మ హిళలపై  దాడి చేసిన ఘటనలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన బిజెపి  జాతీయ ప్రదాన కార్యదర్శి బండి సంజయ్ పై కేసు నమోదైంది.   కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పై మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయింది. విధి నిర్వహణలో ఉన్న తనపై దాడి చేశారని నాచారం సీఐ నందీశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో ఈ కేసు నమోదు చేశారు. బండి సంజయ్‌తో పాటు ఘట్‌కేసర్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, మరికొందరిపై కేసు నమోదయింది. చెంగిచెర్లలో  ఓ వర్గం దాడిలో గాయపడిన మహిళలను పరామర్శించేందుకు బండి సంజయ్ నిన్న చెంగిచెర్లలోని పిట్టలబస్తీకి వెళ్లారు.బండి సంజయ్ అక్కడకు రావడంతో పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక్కడకు రావడానికి అనుమతి లేదని పోలీసులు చెప్పారు. ఎవరినీ లోనికి అనుమతించకుండా బారీకేడ్లను ఏర్పాటు చేశారు. అక్కడకు చేరుకున్న బండి సంజయ్, కార్యకర్తలు బారీకేడ్లను తోసుకొని లోనికి వెళ్లారు. ఘటనలో గాయపడిన మహిళలను పరామర్శించారు. వారికి రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు.మహిళలపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలీసులు, కబేళా నిర్వాహకులు కక్షతో పేద గిరిజన మహిళలపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. బస్తీకి వచ్చి మరీ మహిళలు, పిల్లలపై దాడులు చేశారని, ఇందుకు కారకులైన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో తన విధులకు ఆటంకం కలిగించారని, తనపై దాడి చేశారని నాచారం సీఐ ఫిర్యాదు చేశారు.
Publish Date: Mar 28, 2024 4:14PM

భూమా అఖిలప్రియ అరెస్ట్ 

ఎపిలో వైఎస్ ఆర్ అరాచకపాలనను ప్రశ్నిస్తే నేరుగా కటకటాలకు పంపే స్కీం అమలవుతోంది. ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి అసెంబ్లీలో లేదా వెలుపల లేవనెత్తేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ  అధి కార వైసీపీ ప్రజా స్వామ్య విలువలకు  ప్రాధాన్యత నివ్వడం లేదు.       ప్రజల జీవితాల్లో   వెలుగులు నింపాలన్న ఉద్దేశ్యంలో టిడిపి నేత భూమా అఖిల ప్రియ జగన్ ప్రభుత్వం దగ్గరకు  వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్లగానే వైసీపీ ప్రభుత్వం అరెస్ట్ చేసింది.  ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నేడు నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నంద్యాలలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో సభ వద్దకు వెళ్లిన అఖిలప్రియ సాగునీటి విడుదలకు సంబంధించి జగన్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఆమె వెంట టీడీపీ శ్రేణులు కూడా భారీగా తరలివెళ్లాయిదీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో సభా ప్రాంగణం వద్ద కలకలం రేగింది. వినతిపత్రం ఇవ్వడానికి వస్తే అరెస్ట్ చేయడం ఏంటని పోలీసులను టీడీపీ నేతలు ప్రశ్నించారు. అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తే సీఎం కార్యాలయం స్పందించలేదని, అందుకనే నేరుగా సీఎంను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించానని అఖిలప్రియ తెలిపారు.
Publish Date: Mar 28, 2024 3:29PM

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు బహుజనుల సెగ

బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ గూటికి చేరి లోక్ సభ ఎన్నికలలో ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బీఎస్పీ మాజీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు బహుజనుల సెగ గట్టిగా తగిలింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో బీఎస్పీ అభ్యర్థిగా సిర్పూర్ నియోజకర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలైన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. ఆ తరువాత బీఎస్పీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ గూటికి చేరారు. అలా చేరడానికి ముందు లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ తో బీఎస్పీ పొత్తు పెట్టుకుంటున్నట్లు ఏకపక్షంగా ప్రకటించారు. అయితే బీఎస్పీ అధినేత్రి మాయావతి పోత్తును గుర్తించలేదు. ఏ పార్టీతోనూ బీఎస్పీకి పొత్తు లేదని విస్పష్టంగా ప్రకటించారు. దీంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీకి రాజీనామా చేసి కారెక్కేశారు. ఇలా కారెక్కారో లేదో అలా బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయనను నాగర్ కర్నూల్ లోక్ సభ నియోజవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించి టికెట్ ఇచ్చేశారు. అయితే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో ఆయన పోటీ చేసిన సిర్పూర్ నియోజకవర్గ పరిధిలో బహుజనులు ప్రవీణ్ కుమార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయనను బహుజన ద్రోహిగా అభివర్ణిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో  సిర్పూరు నియోజ‌కవ‌ర్గంలో బీఆర్ఎస్ కార్యక‌ర్తల స‌మావేశంలో పాల్గొనేందుకు ప్రవీణ్ కుమార్ హాజరు కానున్న తరుణంలో ఆయనకు వ్యతిరేకంగా కొమురం భీం జిల్లా కౌటలలో పెద్ద ఎత్తున పోస్టర్లు వెలిశాయి.  ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీని వీడి బీఆర్ఎస్ లో చేరడంనూ  బహుజనుల వ్యతిరేత ఆయన పోటీ చేస్తున్న నాగర్ కర్నూల్ లోక్ సభ నియోజకవర్గంలో ప్రతికూల ప్రభావం చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. 
Publish Date: Mar 28, 2024 1:57PM

వైసీపీ సిట్టింగ్ ఎంపీ మార్గాని భరత్ కు స్మగ్లర్లతో సంబంధాలు...హవ్వా 

స్వాతంత్ర సమరయోధులు, నిస్వార్థ సేవకుల స్తూపాలను ఏర్పాటు చేయడం వాటిని ప్రజాప్రతినిధులు ఆవిష్కరించడం సర్వసాధారణం. అయితే అడవి దొంగగా, గంధపు చెక్కల స్మగ్లర్​గా పేరుగాంచిన వీరప్పన్ స్మారక స్థూపాన్ని వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ ఆవిష్కరించడం ఇటీవల  చర్చనీయాంశంగా మారింది. ఈ వార్త మరువకముందే తాజాగా వైసీపీ ఎంపీ ఒకరు స్మగ్లర్లతో సంబంధాలు అనే వార్త ఎపి ప్రజలను కలవరపెడుతోంది .వైసీపీ ఎంపీ మార్గాని భరత్ పై రాజమండ్రి సిటీ టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మార్గాని భరత్ కు స్మగ్లింగ్ బ్యాచ్ లతో సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులకు రూ. 2 కోట్ల విలువైన బంగారంతో పట్టుబడ్డ నరేశ్ కుమార్ జైన్ తో భరత్ కు సంబంధాలు ఉన్నాయని చెప్పారు. నరేశ్ జైన్ తో మార్గాని భరత్ కలిసి ఉన్న ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్ తో భరత్ కు సంబంధాలు ఉన్నాయని అన్నారు. మార్వాడీలను, ఒడిశా బ్రాహ్మణులను గుద్ది చంపుతానని వైసీపీ నేత ఒకరు ఫోన్ లో బెదిరించారని.. దీనిపై జిల్లా ఎస్సీకి ఫిర్యాదు చేశానని చెప్పారు.   ప్రస్తుతం వైసీపీ ఎంపీగా ఉన్న మార్గాని భరత్ ఇప్పుడు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు. భరత్ తో వాసు పోటీ పడుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తరపున ఆదిరెడ్డి భవానీ గెలుపొందారు. ఈసారి ఆమె భర్త ఆదిరెడ్డి వాసు బరిలోకి దిగారు.  గంధపు చెక్కల స్మగ్లర్‌ వీరప్పన్‌ స్మారక స్థూపాన్ని  వైసీపీ ఎమ్మెల్సీ భరత్‌  ఆవిష్కరించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికీ హల్‌చల్‌ చేస్తున్నాయి.  గత నెల చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం కాకర్లవంకలో వీరప్పన్ స్మారక స్థూపాన్ని స్థానికులు ఏర్పాటు చేసుకున్నారు. అయితే కాకర్లవంకలో పర్యటించిన ఎమ్మెల్సీ భరత్‌ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి స్థానికులు ఏర్పాటు చేసుకున్న వీరప్పన్‌ స్మారక స్థూపాన్ని ఆయన ఆవిష్కరించారు. ఇది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో  ఇప్పటికీ చక్కర్లు కొడుతున్నాయి. స్మగ్లర్లతో వైసీపీ నేత మార్గాని భరత్ కు సంబంధాలు ఉండటం ఎన్నికల ముంగిట్లో ఉన్న ఎపి ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.   
Publish Date: Mar 28, 2024 1:08PM

జగన్ నిర్వాకం.. త్రిశంకు స్వర్గంలో హైదరాబాద్ లోని ఏపీ ప్రభుత్వ కార్యాలయాలు!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో హైదరాబాద్ మహానగరాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకూ పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా నిర్ధారించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు హైదరాబాద్‌  పదేళ్లపాటు   ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. అయితే ఆ గడువు ఈ ఏడాది జూన్ 2తో ముగిసిపోతుంది. అంటే ఆ తేదీ నాటికి హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భవనాలన్నిటినీ ఖాళీ చేసి ఏపీకి తరలించేయాలి. అయితే ఏపీకి రాజధానే లేని పరిస్థితి. కార్యాలయాలను ఎక్కడికి తరలించాలో అర్ధంకాని అయోమయ స్థితి. అయితే  ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ గడువు ముగిసిపోతుండటంతో  ఏపీ ప్రభుత్వ కార్యాలయాలన్నింటినీ తెలంగాణకు అప్పగించేసి అక్కడి ఫర్నీచర్, సిబ్బందిని ఏపీకి తరలించేసి తీరాలి.  అలా చేయలేకపోతే.. ఆ భవనాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అద్దెలు చెల్లించాల్సి ఉంటుంది.  ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ జూన్ రెండు వరకూ మాత్రమే. ఆ తరువాత హైదరాబాద్ మహానగరం పూర్తిగా తెలంగాణకు చెందుతుంది.   ఐదేళ్ల పదవీ కాలంలో అమరావతిని నిర్వీర్యం చేసి మూడు రాజధానులంటూ హడావుడి చేసిన జగన్ సర్కార్ మూడు రాజధానులలో ఒక్కటంటే ఒక్క ఇటుక కూడా పేర్చిన పాపాన పోలేదు. దీంతో  హైదరాబాద్ లోని ప్రభుత్వ కార్యాలయాలను ఇక్కడకు తరలించినా వాటిని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న విషయంలో స్పష్టత లేని స్థితి. దీంతో హైదరాబాద్ ను మరో ఏడాది పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని  జగన్ సర్కార్ అభ్యర్థించింది. అయితే ఆ అభ్యర్థనను సహజంగానే తెలంగాణ సర్కార్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది.  అయితే, రెండు ప్రభుత్వ కార్యాలయాలు మరియు లేక్ వ్యూ అతిథి గృహాన్ని ఉపయోగించుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుమతి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.   ఆదర్శ్ నగర్‌లోని హెర్మిటేజ్ భవనం, లక్డీకాపూల్‌లోని సీఐడీ భవనం, లేక్ వ్యూ అతిథి గృహాలను అద్దె చెల్లించైనా సరే వినియోగించుకునేందుకు జగన్ సర్కార్ రెడీగా ఉన్నట్లు తెలుస్తున్నది.   ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం హైదరాబాద్‌లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను పదేళ్లపాటు పంచుకునే హక్కు ఆంధ్రప్రదేశ్‌కు ఉన్నప్పటికీ.. సొంత రాజధాని నిర్మాణం వేగవంతంగా జరగాలంటే ప్రభుత్వ కార్యాలయాలు ఏపీలోనే ఉండాలన్న ఉద్దేశంతో విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు   2017లో నే చాలా వరకూ ప్రభుత్వ కార్యాలయాలను అమరావతికి తరలించారు. ఆ తరువాత 2019 ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన జగన్ మాత్రం అమరావతిని నిర్వీర్యం చేసి ఆంధ్రప్రదేశ్ ను రాజధాని లేని రాష్ట్రంగా మార్చేయడమే కాకుండా హైదరాబాద్ లో ఉన్న ఏపీ ప్రభుత్వ కార్యాలయాలకు అద్దెలు చెల్లిస్తాం అక్కడే కొనసాగించుకునేందు అనుమతించండి మహప్రభో అని వేడుకుంటున్నారు.  
Publish Date: Mar 28, 2024 12:41PM

పాపం స్పీకర్ తమ్మినేని.. నిద్రపడితే ఒట్టు!

స్పీకర్ తమ్మినేని ఇప్పుడు నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వైసీపీ క్యాడరే చెబుతున్నారు. ఆయన ఆముదాల వలస నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో బలంగా ఉన్న సెంటిమెంట్ ప్రకారం అసెంబ్లీ స్పీకర్ గా పని చేసిన ఎవరూ కూడా ఆ తరువాతి ఎన్నికలలో విజయం సాధించలేరు. అయితే తమ్మినేనికి ఆ సెంటిమెంట్ బెంగే కాకుండా నియోజకవర్గ వైసీపీలో గ్రూపు తగాదాలూ కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. స్పీకర్ గా తమ్మినేని వ్యవహార శైలిపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుండటం అటుంచితే.. నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడంతో ఆముదాలవలసలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది.   వైసీపీ సీనియర్ నాయకుడు సువ్వారి  గాంధీ ఇప్పటికే పార్టీ వీడి  ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి నిర్ణయించుకున్నారు. వాస్తవానికి గత ఎన్నికలలో సువ్వారి గాంధీ ఆముదాలవలసలో తమ్మినేని విజయం కోసం అంతా తానై పని చేశారు. అందుకు అప్పట్లో జగన్ వచ్చే ఎన్నికలలో అంటే 2024 ఎన్నికలలో పార్టీ టికెట్ సువ్వారి గాంధీకి ఇస్తానని ఇచ్చిన హామీయే కారణమని చెబుతారు. అయతే జగన్ ఆ హామీ నిలబెట్టుకోకపోవడంతో సువ్వారి గాంధీ వైసీపీకి రాజీనామా చేశారు. అంతే కాదు ఆయన సోదరుడి సతీమణి  కూడా తన నామినేటెడ్ పోస్టుకు రాజీనామా చేశారు. గాంధీ ఆముదాలవలస నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలవనున్నారు. వైసీపీ అధిష్ఠానం అంటే జగన్ తనను మోసం చేశారని గాంధీ ఆరోపిస్తున్నారు. సువ్వారీ గాంధీ పార్టీకి రాజీనామా చేసి, స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగుతుంటే.. తమ్మినేని సీతారాంకు ఖంగారెందుకు అంటే గాంధీ నియోజకవర్గంలో బలమైన కళింగ సామాజిక వర్గానికి చెుందిన వ్యక్తి. పైగా ఆ సామాజిక వర్గంలో గట్టి పట్టున్న నేత. దీంతోనే తమ్మినేని సీతారాం తన విజయంపై ధీమా కోల్పోయారు. అలాగే వైసీపీలో కూడా ఖంగారు మొదలైంది. దీంతో గాంధీని బుజ్జగించడానికి జగన్ దూతగా వైవీ సుబ్బారెడ్డి శతధా ప్రయత్నించారు. కానీ ఆ ప్రయత్నం విఫలమైంది.  అదీగాక చాలా కాలంగా సువ్వారి గాంధీ నియోజకవర్గంలో తనదంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుని పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తమ్మినేని సీతారాం చేపట్టే అధికార కార్యక్రమాలకు దూరంగా ఉంటూ.. పార్టీలోనే తన వర్గాన్ని ఏర్పాటు చేసుకుని సమాంతరంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఆ విషయం పార్టీ అధినేత జగన్ కు తెలిసినా పెద్దగా పట్టించుకోలేదు.   ఇక ఆముదాలవలస నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేయనున్న కూన రవికుమార్ తమ్మినేనికి సమీప బంధువు కూడా కావడంతో దానినే సువ్వారి గాంధీ తన ప్రచారానికి అనుకూలంగా మార్చుకుంటున్నారు.  తమ్మినేతి, కూన రవికుమార్ లు డబుల్ గేమ్ ఆడుతున్నారనీ, వారి రాజకీయ నాటకానికి తెరదించేందుకు తనకు ఓటు వేయాలంటూ ఇప్పటికే ప్రచారం కూడా ప్రారంభించేశారు.  అంతే కాకుండా స్థానిక వైసీపీ క్యాడర్ లో కూడా తమ్మినేని పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుండటంతో ఆముదాలవలసలో వైసీపీ క్యాడర్ చాలా వరకూ  తమ్మినేనికి మద్దతుగా ఆయన వెంటే నడుస్తున్నారు.  దీంతో తమ్మినేని నిద్రలేని రాత్రుళ్లు గడుపుతున్నారన్న సెటైర్లు పార్టీ వర్గాల నుంచే వస్తున్నాయి.  మొత్తం మీద ఆముదాలవలస నుంచి తమ్మినేని ఓటమి ఇప్పటికే ఖరారైపోయిందంటూ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. 
Publish Date: Mar 28, 2024 12:24PM

పార్టీ టికెట్ దక్కలేదని సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్య

ఎన్నికలలో పోటీ చేసేందుకు పార్టీ టికెట్ దక్కలేదన్న మనస్తాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్య చేసుకున్న సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తమిళనాడుకు రాష్ట్రానికి చెందిన సిట్టింగ్ ఎంపీ గణేష్ మూర్తి ఎన్నికలలో పోటీ చేసే అవకాశం పార్టీ ఇవ్వలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈడోర్ నియోజకవర్గ ఎండీఎంకే ఎంపీ గురుమూర్తికి పార్టీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వలేదు. దీంతో  ఆయన మూడు రోజుల కిందట ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ( మార్చి 28) ఉదయం కన్నుమూశారు.  ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా గుండెపోటు రావడంతో మరణించారని ఆస్పత్రివర్గాలు తెలిపాయి.   ఎండీఎంకే పార్టీ అభ్యర్థిగా  గణేశమూర్తి 2019 పార్లమెంట్ పార్లమెంట్ ఎన్నికల్లో ఈరోడ్ నుండి భారీ మెజార్టీతో  విజయం సాధించారు. అయితే 2024 ఎన్నికలలో పోటీ చేసేందుకు పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు.  ఎన్నికలలో పోటీకి అవకాశం లేదన్న మనస్తాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యకు పాల్పడటం తమిళనాట మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 
Publish Date: Mar 28, 2024 11:59AM

ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్.. ఇద్దరు మహిళలు సహా ఆరుగురు మావోలు మృతి

ఛత్తీస్‌గఢ్‌లో మావోలు, పోలీసుల మధ్య జరిగిన భారీ ఎన్‌కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు. మృతులలో ఇద్దరు మహిళా మావోలు ఉన్నారు.   బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాల్పేరు నది సమీపంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది.  యాంటీ నక్సల్ ఆపరేషన్‌లో భాగంగా సీఆర్పీఎఫ్ జవాన్లు   డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, కోబ్రా సిబ్బంది కూంబింగ్ జరుపుతుండగా తొలుత నక్సల్స్‌ కాల్పులు జరపడంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపినట్లు చెబుతున్నారు.   ఘటనా స్థలం నుంచి భారీ పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కాల్పుల్లో మరి కొందరు నక్సల్స్ గాయపడి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. 
Publish Date: Mar 28, 2024 11:42AM

జ‌గ‌న్‌..! ఇక ఏడ్చేస్తాడేమో?!

నేను ఒక్క‌ చెడ్డ‌ప‌ని కూడా చెయ్య‌లేదు..! అన్నీ మంచి ప‌నులే చేశా..!! నేను నిజాయితీ ప‌రుడ్ని. ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబే అన్నీ దుర్మార్గ‌పు ప‌నులు చేస్తున్నాడు.. నా చెల్లెళ్ల‌ను నాపై ఉసిగొల్పుతున్నాడు.. ఇవీ.. ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఆర్తనాదాలు. తాను క‌లియుగ హ‌రిశ్చంద్రుడిని   అని చెప్ప‌డం మిన‌హా,    ప్ర‌జ‌ల ముందు ప‌డాల్సిన క‌థ‌ల‌న్నీ ప‌డేశాడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. ఐదేళ్ల పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంది.   స‌ర్వేల‌న్నీ బీజేపీ, జ‌న‌సేన‌, టీడీపీ కూట‌మికే జై కొడుతుండ‌టంతో జ‌గ‌న్ శిబిరం కంగారెత్తిపోతున్నది. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో అధికారంలోకి వ‌చ్చేందుకు జ‌గ‌న్, ఆయ‌న వ‌ర్గీయులు చేసిన పాపాలు అన్నీఇన్నీకావు.. ఏకంగా బాబాయ్ హ‌త్య‌, కోడి క‌త్తి  దాడి.. ఇలా చాలానే ఉన్నాయి. పోనీ ఇన్ని చేసి అధికారం దక్కించుకున్న తరువాత పాలన అయినా సక్రమంగా  సాగించారా అంటే అదీలేదు.. అమ‌రావ‌తి రాజ‌ధాని రైతుల‌ను రోడ్డున ప‌డేశారు. అంతెందుకు ఉన్న కంపెనీల‌ను పంపించేసి నిరుద్యోగుల‌కు ఉపాధి లేకుండా చేశారు. ఫ‌లితంగా చిన్న‌చిన్న ప‌నుల‌కోసం సైతం ఏపీ ప్ర‌జ‌లు హైద‌రాబాద్ బాట ప‌డుతున్నారంటే ఏపీలో   ప‌రిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు. చంద్రబాబు హయాంలో అమరావతి నిర్మాణం జరుగుతున్న సమయంలో హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున వలసలు ఉండేవి. ఇప్పుడా పరిస్థితి రివర్స్ అయ్యింది.  వీట‌న్నింటిని వ‌దిలేసిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి. అన్నీ వేదాల్లోనే ఉన్నాయష.. అన్నట్లుగా అన్నిటికీ  చంద్రబాబే కారణమని జనం ముందు ప్రసంగాలు ఇస్తున్నారు.   వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారంలో ఉన్న‌న్నిరోజులు బ‌య‌ట‌కు రావాలంటే ప‌ర‌దాలు కట్టుకుని జనానికి ముఖం చూపకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవలసిన పరిస్థితి. అయితే ఇప్పుడు  ఎన్నిక‌ల స‌మ‌యం కావ‌డంతో ఎన్నిక‌ల ప్ర‌చారాన్ని జ‌గ‌న్‌ ప్రారంభించాడు. మేమంతా సిద్ధం పేరుతో బ‌స్సు యాత్ర చేప‌ట్టిన జ‌గ‌న్.. ప్రొద్దుటూరులో ప్ర‌జ‌ల‌నుద్దేశించి మాట్లాడారు. జ‌గ‌న్ ప్ర‌సంగం మొత్తం.. క‌లియుగ స‌త్య హ‌రిశ్చంద్రుడిని నేనే అని డ‌బ్బాకొట్టుకోవ‌డానికి పరిమితమైంది.  ఐదేళ్ల కాలంలో చేసిన అభివృద్ధిని చెప్ప‌కుండా.. నేను మీ బిడ్డ‌ను.. అంద‌రూక‌లిసి నాపై దండ‌యాత్ర చేస్తున్నారు.. మీరే న‌న్ను కాపాడాలి అంటూ ప్ర‌జ‌ల‌ను  దీనంగా జ‌గ‌న్ అభ్య‌ర్ధించారు. ఐదేళ్ల పాల‌న‌పై ఆగ్రహంతో ఉన్న ప్ర‌జ‌ల‌ను సానుభూతి అస్త్రంతో త‌న‌వైపుకు తిప్పుకునే ప్ర‌య‌త్నం చేశారు. బాబాయ్ హ‌త్య‌కేసు విష‌యంపై మాట్లాడిన జ‌గ‌న్‌.. తన వాళ్ల‌నే చంద్ర‌బాబు తన మీద ఉసిగొల్పుతున్నారంటూ ప్ర‌జ‌ల ముందు క‌న్నీరు పెట్టుకునంత ప‌నిచేశాడు. వివేకానందను అన్యాయంగా, అతిదారుణంగా చంపారు.. ఆ హంత‌కులెవ‌రో ఆ దేవుడికి, ఈ జిల్లా ప్ర‌జ‌ల‌కు తెలుసు.. అని చెప్పిన జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి.. వారి పేర్ల‌ను మాత్రం చెప్ప‌లేదు.  గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో బాబాయ్ హ‌త్య‌కు కార‌ణం చంద్ర‌బాబే అంటూ మొత్తుకున్న జ‌గ‌న్‌.. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత బాబాయ్ హ‌త్య‌కేసును ఎందుకు సీరియ‌స్ గా తీసుకోలేద‌నే విష‌యాన్ని మాత్రం జ‌గ‌న్ త‌న ప్ర‌సంగంలో  ఎక్కడా పొరపాటున కూడా ప్ర‌స్తావించ‌లేదు. త‌న ఇద్ద‌రు చెల్లెళ్లు, సీబీఐ అధికారులు వివేకా హ‌త్య‌కేసులో కీల‌క ముద్దాయి వైసీపీ ఎంపీ అవినాశ్  రెడ్డి అని బ‌హిరంగంగానే చెబుతున్నారు.  సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని అరెస్టు చేసేందుకు   క‌డ‌ప వెళ్లారు.. బాబాయ్ పై జ‌గ‌న్ కు నిజంగా ప్రేముంటే అవినాశ్ అరెస్టును ఎందుకు అడ్డుకోవాల్సి వ‌చ్చింద‌నే విష‌యంపై ప్ర‌జ‌లకు చెప్పేందుకు జ‌గ‌న్ సాహ‌సించ‌లేదు. కేవ‌లం అభాండాలు వేయ‌డమే తన పని అన్నట్లుగా జగన్ తీరు ఉందని జనం బాహాటంగానే అంటున్నారు త‌న ఇద్ద‌రు చెల్లెళ్ల‌ను చంద్ర‌బాబు త‌న‌పై ఉసిగొల్పుతున్నాడ‌ని జ‌గ‌న్ పేర్కొనడం విడ్డూరంగా ఉంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. ష‌ర్మిల‌, సునీత‌లు అడిగే ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌లేక వారిని కూడా చంద్ర‌బాబు మ‌నుషులుగా వైసీపీ నేత‌లు చిత్రీక‌రించే ప్ర‌య‌త్న చేస్తూ వ‌చ్చారు. తాజాగా జ‌గ‌న్ కూడా త‌న ప్రంస‌గంలో అదే విష‌యాన్ని ప్ర‌స్తావించ‌డం జ‌గ‌న్ లో ఓట‌మి భ‌యాన్ని బ‌య‌ట‌పెట్టింది. ఇన్నాళ్లు చెల్లెళ్లు రోడ్డెక్కి మొత్తుకుంటున్నా క‌నీసం మాట‌ కూడా మాట్లాడ‌ని జ‌గ‌న్‌  ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌ల ఓట్లు కావాలి కాబ‌ట్టి సానుభూతికో సం అంతా చంద్ర‌బాబే చేస్తున్నారని చెప్ప‌డం వైసీపీ నేత‌ల‌ను సైతం ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది. జ‌గ‌న్ చెల్లెళ్లు అడిగే ప్ర‌శ్న‌ల‌కు ముందు స‌మాధానం చెప్పిన త‌రువాత చంద్ర‌బాబు పేరు ఎత్తితే బాగుంటుంద‌ని   విశ్లేష‌కులు సూచిస్తున్నారు.   ఇటీవ‌ల విశాఖ తీరంలో దొరికిన డ్ర‌గ్స్ కేసుపైనా జ‌గ‌న్‌ స్పందించాడు. డ్ర‌గ్స్ తో ఉన్న కంటైన‌ర్ లో పేర్కొన్న అడ్ర‌స్సు చంద్ర‌బాబు వ‌దిన చుట్టం కంపెనీది అంటూ జ‌గ‌న్ అన్నాడు. అయితే, ఆ కంపెనీ వాళ్లు వైసీపీ నేత‌ల‌ని, ఇటీవ‌ల సంక్రాంతి పండుగ‌కు వాళ్లు జ‌గ‌న్ ఫొటోతో కూడిన ఫ్లెక్సీల‌ను ఎందుకు వేయించార‌నే విష‌యంపై మాత్రం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నోరువిప్ప‌క పోవ‌టం గ‌మ‌నార్హం. త‌న‌పై, త‌న వ‌ర్గీయుల‌పై వ‌చ్చే ప్ర‌తీ ఆరోప‌ణ‌ను చంద్ర‌బాబు చేసేదే అని చెప్ప‌డం మిన‌హా బ‌స్సు యాత్ర ప్ర‌సంగంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మాట్లాడింది పెద్ద‌గా ఏమీలేద‌నే చెప్పొచ్చు. ఎన్నిక‌ల స‌మ‌యంలో కేవ‌లం ప్ర‌జల సానుభూతికోసం  జ‌గ‌న్ పాకులాడిన‌ట్లు క‌నిపించింది. మొత్తంగా చెప్పాలంటే.. క‌న్నీళ్లు పెట్ట‌డం త‌ప్పితే అన్ని విన్యాసాలు ప్ర‌జ‌ల ముందు జ‌గ‌న్ చేశాడ‌ని చెప్పొచ్చు.
Publish Date: Mar 28, 2024 11:04AM