టి20 వరల్డ్ కప్ లోఓపెనర్ గా కింగ్ కోహ్లీ

విరాట్ కోహ్లీ క్రికెట్ ప్రపంచంలో తిరుగులేని రారాజు. అయితే ఇటీవల కొంత కాలంగా ఆయన ఫామ్ బ్రహ్మాండంగా ఉన్నప్పటకీ స్ట్రైక్ రేట్ విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా ఐపీఎల్ ప్రస్తుత సీజన్ లో బెంగళూరు ఓపెనర్ గా ఆడుతున్న కోహ్లీ పరుగులు ధారాళంగా చేస్తున్నప్పటికీ స్ట్రైక్ రేట్ తక్కువగా ఉందన్న విమర్శలు సొంత జట్లు అభిమానుల నుంచే వెల్లువెత్తుతున్నాయి. కోహ్లీ లో స్ట్రైక్ రేట్ కారణంగానే బెంగళూరు ప్రదర్శన పేలవంగా ఉందంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. అయితే కోహ్లీ వినా ఆ జట్టులో మిగిలిన బ్యాట్స్ మన్ ఎవరూ అంచనాల మేరకు రాణించకపోవడంతోనే కోహ్లీపై ఒత్తిడి పెరిగి స్ట్రైక్ రేట్ తక్కువగా ఉంటోందని క్రికెట్ పండితులు చెబుతున్నారు. మొత్తం మీద ఐపీఎల్ లో కోహ్లీ ప్రదర్శన ఈ ఏడాది జరగనున్న టి20 వరల్డ్ కప్ లో అతడి స్థానంపై పలు అనుమానాలు రేకెత్తించింది. అసలు కోహ్లీకి వరల్డ్ కప్ ఆడే చాన్స్ ఉంటుందా అన్న అనుమానాలు కూడా క్రికెట్ అభిమానుల్లో వ్యక్తం అయ్యాయి. ఈ తరుణంలో జట్టు ఎంపికకు సమాయత్తమౌతున్న బీసీసీఐ, సెలక్షన్ కమిటీ కీలక నిర్ణయం తీసుకున్నాయి. వచ్చే టీ20 వరల్డ్ కప్ లో కింగ్ కోహ్లీ ఓపెనర్ గా ఆడతాడని సంకేతాలు ఇచ్చాయి. ఈ మేరకు ఇప్పటికే కోహ్లీకి సమాచారం ఇచ్చినట్లు క్రికెట్ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం అవుతోంది.  ఐపీఎల్ లో బేంగళూరు జట్టుకు ఓపెనర్ గా ఆడుతున్న కోహ్లీ ఆ జట్టుకు శుభారంభాన్ని అందించడమే కాకుండా మంచి స్కోర్లు కూడా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సీజన్ లో ఒక సెంచరీ సాధించి ఐపీల్ టాప్ స్కోరర్ గా ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే కోహ్లీని స్కిప్పర్ రోహిత్ శర్మతో కలిసి ఓపెన్ చేయాల్సిందిగా బీసీసీఐ కోరింది. అందుకు కోహ్లీ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.  
Publish Date: Apr 18, 2024 12:09PM

మరో బీఆర్ఎస్ వికెట్ డౌన్.. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి రాజీనామా

బీఆర్ఎస్ నుంచి వలసల పర్వం కొనసాగుతోంది. సరిగ్గా సార్వత్రిక ఎన్నికల వేళ ఆ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. పార్టీ అగ్రనాయకత్వం ఎంతగా ప్రయత్నించినా పార్టీ నుంచి వలసలను ఆపడంలో విఫలమౌతున్నది. తాజాగా ఆ పార్టీ నుంచి మరో మాజీ ఎమ్మెల్యే రాజీనామా చేసి బయటకు వచ్చారు. ఉప్పల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి కారు దిగిపోయారు. లోక్ సభ ఎన్నికలకు పార్టీ టికెట్ విషయంలో అధిష్ఠానం ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ తానీ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. మల్కాజ్ గిరి ఎంపీ టికెట్ ను లక్ష్మారెడ్డికి ఇవ్వడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనను గెలిపించాలంటూ తాను ప్రజల ముందుకు వెళ్లి ప్రచారం చేయలేనని బేతి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు గురువారం (ఏప్రిల్ 18) ఓ లేఖ రాశారు. అవకాశ వాది అయిన లక్ష్మారెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం చేయలేనని పేర్కొన్న ఆయన తెలంగాణ ఉద్యమ నేత, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కోసం తాను ప్రచారం చేయనున్నట్లు బేతి సుభాష్ రెడ్డి వెల్లడించారు. తన రాజీనామాను, కేసీఆర్ కు రాసిన లేఖను ఆయన సామాజిక మాధ్యమంలో షేర్ చేశారు.  
Publish Date: Apr 18, 2024 11:55AM

నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేష్ విడుదల

తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల నోటిఫికేష్ వెలువడింది. సార్వత్రిక ఎన్నికలు ఏడు దశలలో జరగనున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా నాలుగో దశలో  ఆంధ్రప్రదేశ్,   ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లోని లోక్‌సభ  స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. తెలంగాణ, ఏపీతో పాటు ఆయా రాష్ట్రాల్లోని 96 లోక్‌సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి గురువారం (ఏప్రిల్ 18) నోటిఫికేషన్ వెలువడింది.   దీంతో ఆయా రాష్ట్రాలలో గురువారం (ఏప్రిల్ 18) నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలైంది. నామినేషన్ల స్వీకరణకు తుది గడువు ఈ నెల 25. కాగా 26న నామినేషన్ల పరిశీల ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు ఈ నెల 29.  మే 13న పోలింగ్. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల విడుదల ఉంటాయి.  ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే ఏపీలో ఎన్నికల హీట్ తారస్థాయికి చేరింది. ఇప్పుడు ఇక నోటిఫికేషన్ కూడా విడుదల కానుండటంతో ప్రచారం మరింత జోరందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం కూటమి ప్రచారం హోరెత్తిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల కూడా జోరుగా పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు.  
Publish Date: Apr 18, 2024 11:42AM

రాయిదాడి జగన్నాటకమే.. బోండా ఉమాను ఇరికించేయత్నం?!

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై రాయి దాడి ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారింది. రాయిదాడి కేసులో నిందితుల‌ను గుర్తించేందుకు పోలీసులు ద‌ర్యాప్తును వేగ‌వంతం చేశారు. ఈ క్ర‌మంలో ప‌లువురు మైన‌ర్ల‌ను, యువ‌కుల‌ను అదుపులోకి తీసుకొని ర‌హ‌స్య ప్రాంతంలో విచారిస్తున్నారు. అయితే, జ‌గ‌న్‌పై రాయిదాడి ఘ‌ట‌న‌ను వైసీపీ రాజ‌కీయం చేసేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేసింది. అయితే జగన్ పై గులకరాయి దాడిని హత్యాయత్నంగా చిత్రీకరించడానికి వైసీపీ చేసిన ప్రయత్నాలు నవ్వుల పాలయ్యాయి.  చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలోనే జ‌గ‌న్ పై రాయిదాడి ఘ‌ట‌న జ‌రిగింద‌ని, జ‌గ‌న్ కు ప్ర‌జ‌ల నుంచి వ‌స్తున్న స్పంద‌న‌ను చూసి తెలుగుదేశం ఓర్వ‌లేక పోతుంద‌ని వైసీపీ నేత‌లు విస్తృత ప్ర‌చారం చేశారు.  అంతేకాదు.. రాయిదాడి ఘ‌ట‌న జ‌రిగిన క్ష‌ణాల్లోనే వైసీపీ సోష‌ల్ మీడియాలో చంద్ర‌బాబు,  తెలుగుదేశం నేత‌ల‌పై విష‌ప్ర‌చారం జ‌రిగింది.  వైసీపీ నేత‌లు   మైకుల ముందుకొచ్చి చంద్ర‌బాబుపై విరుచుకుప‌డ్డారు. అయితే, పోలీసుల ద‌ర్యాప్తులో వెలుగులోకి వ‌స్తున్న విష‌యాల‌నుబ‌ట్టి  రాయిదాడి ఘ‌ట‌న‌కు తెలుగుదేశంకు ఎలాంటి సంబంధం లేద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. జనం కూడా జగన్ పై రాయిదాడి సంఘటనలో తెలుగుదేశం ప్రమేయం ఉందని ఇసుమంతైనా నమ్మడం లేదు. సరే జనం నమ్మకపోతే పోనీ..  ఈ కేసును ఎలాగైనా టీడీపీ నేత‌ల‌పై నెట్టేసి వారిని అదుపులోనికి తీసుకుంటే తెలుగుదేశం ఎన్నికల ప్రచారంలో దూకుడునైనా ఆపవచ్చన్న తలంపుతో జ‌గ‌న్ మోహన్ రెడ్డి సూచ‌న‌ల‌తో పోలీసులు ఈ కేసులో తెలుగుదేశంను ఇరికించేందుకు విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. తెలుగుదేశం విజ‌య‌వాడ‌ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం అభ్య‌ర్థి బోండా ఉమాపై రాయిదాడి కేసును బలవంతంగా రుద్దే దిశగా పోలీసుల ద‌ర్యాప్తు కొన‌సాగుతున్నద‌ని ఏపీ రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది.  జ‌గ‌న్‌పై రాయిదాడి కేసులో మంగ‌ళ‌వారం (ఏప్రిల్ 16) తెల్ల‌వారు జామున వ‌డ్డెర కాల‌నీకి చెందిన ఎనిమిది మంది మైన‌ర్ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని ర‌హ‌స్య ప్రాంతానికి త‌ర‌లించి విచారిస్తున్నారు. జ‌గ‌న్‌పై దాడి జ‌రిగిన ప్రాంతానికి వ‌డ్డెర ప్రాంతానికి కేవ‌లం 400 మీట‌ర్ల దూరమే ఉంటుంది. అయితే, త‌మ పిల్ల‌ల‌ను రెండు గంట‌ల్లో వ‌దిలిపెడ‌తామ‌ని తీసుకెళ్లార‌ని, పోలీస్ స్టేష‌న్ కు వెళ్లినా వారి స‌మాచారం ఇవ్వ‌డం లేద‌ని కాల‌నీ వాసులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. జ‌గ‌న్ బ‌స్సుయాత్ర స‌మ‌యంలో రోడ్డుప‌క్క‌న నిల‌బ‌డితే రూ. 200 నుంచి 300 ఇస్తామ‌ని చెబితే వెళ్లామ‌ని, రూ. 200కు ఆశ‌ప‌డి వెళ్తే మా పిల్ల‌ల‌పై కేసులు పెట్టారంటూ వ‌డ్డెర కాల‌నీ వాసులు పోలీసుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కేసు ద‌ర్యాప్తులో 10మంది వ‌ర‌కూ న‌గ‌రంలోని వ‌డ్డెర కాల‌నీ యువ‌కుల్ని ప్ర‌శ్నించిన పోలీసులు అందులో స‌తీష్ అనే యువ‌కుడిని రాయి విసిరిన వ్య‌క్తిగా గుర్తించారు. ఆ త‌రువాత బుధ‌వారం బోండా ఉమ కార్యాల‌యంలో ప‌నిచేసే వేముల ద‌ర్గారావు అనే మ‌రో యువ‌కుడిని తీసుకెళ్లారు. అత‌ని నుంచి కీల‌క స‌మాచారం రాబ‌ట్టేందుకు పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు తెలుస్తోంది. రాయిదాడి కేసును ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై నెట్ట‌కుంటే ఎన్నిక‌ల్లో న‌ష్ట‌పోతామ‌ని భావిస్తున్న వైసీపీ పెద్ద‌లు  ఎలాగైనా తెలుగుదేశంకి ఈ కేసును అంట‌గ‌ట్టాల‌ని పోలీసుల‌కు ఆదేశాలు ఇచ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ క్ర‌మంలోనే  తెలుగుదేశం నేత బోండా ఉమ‌ను ఈ కేసులో ఇరికించి రాయిదాడి ఘ‌ట‌న‌ను తెలుగుదేశంపై నెట్ట‌డం ద్వారా ప్ర‌జ‌ల్లో సానుభూతిని పొంద‌వ‌చ్చున‌న్నది జ‌గ‌న్ ప్లాన్‌గా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  వైసీపీ కుట్ర‌ల‌ను గుర్తించిన టీడీపీ నేత‌లు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఈ విష‌యంపై బోండా ఉమ స్పందిస్తూ..  సీఎం జ‌గ‌న్ పై రాయి దాడి ఘ‌ట‌న‌కు తనకు ఎలాంటి సంబంధం లేక‌పోయినా కొంద‌రు పోలీసు అధికారులు త‌న‌ను ఇరికించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆరోపించారు. ఇందులో భాగంగానే త‌న ఆఫీసులో ప‌నిచేసే దుర్గారావును అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు  రాయిదాడి ఘ‌ట‌న‌లో తాజాగా ప‌రిణామాల‌పై తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు స్పందించారు. రాయిదాడి కేసులో నిందితులంటూ వ‌డ్డెర కాల‌నీ యువ‌కుల‌ను తీసుకుపోయారు. టీడీపీ నేత‌ల ప్రోద్భ‌లంతోనే దాడి జ‌రిగింద‌ని చెప్పించ‌డానికి య‌త్నిస్తున్నారంటూ  ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పోలీసు శాఖ‌తో ప్ర‌భుత్వం త‌ప్పులు చేయిస్తోంది. బోడా ఉమా ఎన్నికల ప్ర‌చారాన్ని త‌ప్పుడు కేసుల‌తో అడ్డుకోవాల‌ని య‌త్నిస్తున్నారు. అలా జ‌రిగితే సంబంధిత అధికారుల‌ను కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక శిక్షిస్తామంటూ చంద్ర‌బాబు హెచ్చ‌రించారు. సీఎంకు భ‌ద్ర‌త క‌ల్పించ‌డంలో విఫ‌ల‌మైన వారిని ఈ కేసు విచార‌ణ బాధ్య‌త‌ల‌నుంచి త‌ప్పించి,  ఈసీ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో  వేరే అధికారుల‌తో స‌మ‌గ్ర విచార‌ణ చేప‌ట్టాల‌ని చంద్ర‌బాబు డిమాండ్ చేశారు. రాయి దాడి కేసులో పోలీసులు నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తే  ఇదేమంత సంక్లిష్టమైన కేసు కాదు. కానీ, రాయి దాడి కేసులో తెలుగుదుశం నేతలను ఇరికించాలని పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ పై రాయిదాడి జరగకుండా భద్రత కల్పించడంలో విఫలమైన పోలీసులపై చర్యలు తీసుకోకుండా.. వారితోనే కేసు దర్యాప్తు చేయిస్తుండటాన్ని పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు అంతేకాదు. మైనర్లకు విచారణ పేరుతో తీసుకెళ్లి వారి ద్వారా తెలుగుదేశం నేతలే రాయిదాడి చేయాలని సూచించారని చెప్పించడం కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోందని విశ్లేషిస్తున్నారు.  ఐదేళ్ల జగన్ ప్రభుత్వంపై  ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ విషయం   ఇప్పటి వరకూ వెల్లడైన పలు సర్వేల   ఫలితాల్లో వెల్లడైంది. జగన్ ను  గద్దె దింపి సాగనంపడానికి ఏపీ ప్రజలు ఇప్పటికే నిర్ణయానికి వచ్చేశారని సర్వేలు తేల్చేశాయి.  జగన్ బస్సు యాత్రకు ప్రజల నుంచి స్పందన కరవవ్వడం కూడా ఆయన పాలన పట్ల ప్రజలు విముఖంగా ఉన్నారని తెలియజేస్తున్నది.  దీంతో వైసీపీ నేతలు డబ్బులు ఇచ్చి ప్రజలను బలవంతంగా బస్సుయాత్రకు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొనాలంటే సానుభూతి పొందేలా ఏదో ఒక ఘటనను క్రియేట్ చేసి అయినా ప్రయోజనం పొందాలని జగన్ అండ్ కో రచించిన ప్రణాలికలో భాగమే  జగన్ రాయిదాడి ఘటన అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికల ముందు తెలుగుదేశం ప్రమేయంతోనే జరిగినట్లుగా కోడికత్తి దాడి, బాబాయ్ గొడ్డలి పోటు ఘటనలను ప్రచారం చేసుకుని లబ్ధి పొందిన విధంగానే ఇప్పుడు రాయిదాడి కేసును ఉపయోగించుకుని గట్టెక్కాలన్నది వైసీపీ వ్యూహంగా కనిపిస్తోందంటున్నారు.   రాయిదాడి ఘటనను తెలుగుదేశం నేతలపై నెడితే ప్రజల్లో జగన్ పై సానుభూతి ఏర్పడుతుందన్నది వైసీపీ పెద్దల భావనగా పరిశీలకులు చెబుతున్నారు.  అందుకే  పక్కా ప్లాన్ ప్రకారం రాయిదాడి కేసును తెలుగుదేశం నేతలపైకి నెట్టేందుకు కసరత్తు జరుగుతోందని అంటున్నారు.   
Publish Date: Apr 18, 2024 10:57AM

పవన్ పై జగన్ దూషణలకు కారణమదేనా?

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. బుధవారం (ఏప్రిల్ 17) స్వామివారిని 58 వేల690 మంది దర్శించుకున్నారు. వారిలో 20 వేల 744 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.  స్వామి వారి హుండీ ఆదాయం 3 కోట్ల రెండు లక్షల రూపాయలు వచ్చింది.  ఇక గురువారం (ఏప్రిల్ 18)  ఉదయం స్వామివారి ఉచిత దర్శనం కోసం రెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామి వారి ఉచిత దర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. అలాగే టైమ్ స్లాట్ దర్శనం కోసం భక్తులు ఒక కంపార్ట్ మెంట్ లో వేచి ఉన్నారు. టైం స్లాట్ భక్తులకు శ్రీవారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది.  పవన్ పై జగన్ దూషణలకు కారణమదేనా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్  ప్రత్యర్థులపై కక్ష సాధింపు ధోరణిలోనే వ్యవహరిస్తారన్నది ఈ ఐదేళ్లుగా ఆయన తీరు చూసిన అందరికీ  అవగతమైంది. అయితే జనసేనాని పవన్ కల్యాణ్ పై జగన్ రెడ్డికి ప్రత్యేక కోపం ఉందని కూడా అర్ధమౌతోంది. కనీసం పవన్ కల్యాణ్ పేరు కూడా ఉచ్ఛరించకుండా దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అని ప్రస్తావిస్తూ పవన్ పై వ్యక్తిగత దూషణలకు పాల్పడడాన్ని చూస్తునే ఉన్నాం. జగన్ మోహన్ రెడ్డికి జనసేనాని పవన్ కల్యాణ్ పట్ల అంతటి వ్యతిరేకత ఎందుకు. సాధారణంగా రాజకీయ నాయకులు పాటించాల్సిన కనీస సంయమనాన్ని కూడా పాటించకుండా పవన్ పై వ్యక్తిగత దూషణలకు సైతం తెగపడేంత ద్వేషభావం ఎందుకు?  అన్న ప్రశ్నకు పదేళ్ల వెనక్కు ఒక్కసారి వెళ్లాల్సి ఉంటుంది. ఔను నిజమే.. రాష్ట్ర విభజన తరువాత జరిగిన తొలి ఎన్నికలలో అంటే 2014లో తన పార్టీ ఓటమికి అధికారానికి దూరం కావడానికి పవన్ కల్యాణే కారణమని జగన్ విశ్వసిస్తున్నారు. పవన్ కల్యాణ్ పొలిటికల్ ఎంట్రీ అప్పుడు లేకపోయి ఉన్నట్లైతే అప్పుడే వైసీపీ అధికారంలోకి వచ్చి ఉండేదని జగన్ భావనగా ఆయనకు సన్నిహితంగా ఉండే వారు ఇప్పటికీ చెబుతున్నారు.  అయితే వాస్తవానికి విభజనతో అన్నిందాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ను గాడిన పెట్టే అనుభవం, దార్శనికత ఉన్న వ్యక్తిగా ఏపీ జనం చంద్రబాబును విశ్వసించారు కనుకనే ఆయన విజయం సాధించారన్నది విశ్లేషకులు మాట. విశ్లేషకుల మాట ఎలా ఉన్నా కేవలం పవన్ కల్యాణ్ అప్పట్లో తన పార్టీని ఎన్నికల బరిలో దించకుండా చంద్రబాబుకు మద్దతు పలకడం వల్లనే వైసీపీ పరాజయం పాలైందని జగన్ గట్టిగా నమ్ముతున్నారు. 2019 ఎన్నికలలో పవన్ పోటీలోకి దిగారు. పొత్తులు లేకుండా ఒంటరిగానే పోటీ చేశారు. దీంతో ఆ ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించింది. ఇప్పుడు మళ్లీ 2014 నాటి పొత్తులు పొడవడంతో ఓటమి తప్పదన్న భయంతోనే ఆయన పవన్ కల్యాణ్ పై ఇష్టారీతిన వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తున్నారనీ, దూషణలకు తెగబడుతున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పవన్ పేరు ప్రస్తావించడానికి కూడా జగన్ ఇష్టపడటం లేదనీ, ఎప్పడు పవన్ ప్రస్తావన వచ్చినా ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడు అనే సంబోధిస్తున్న సంగతి తెలిసిందే.   సాధారణంగా రాజకీయ నాయకులు తమ విమర్శలలో ప్రత్యర్ధుల వ్యక్తిగత విషయాలను ప్రస్తావించకుండా నియంత్రణ పాటిస్తారు. మర్యాద రేఖ దాటకుండానే విమర్శలు చేస్తారు. కానీ ముఖ్యమంత్రి మాత్రం అటువంటి నియంత్రణ అనేదే లేకుండా పవన్ కల్యాణ్ వివాహాలపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తుంటారు.  అయితే ఇటీవల ఓ రెండు నెలల కిందట జనసేనాని తనకు  జగన్ నాలుగో భార్యా అంటూ ఘాటుగా రిటార్డ్ ఇవ్వడంతో వైసీపీ అధినేత కొంచం వెనక్కు తగ్గారు. ఈ రెండు నెలలుగా పవన్ కల్యాణ్ వివాహాలపై ఎటువంటి కామెంట్లూ చేయకుండా నియంత్రణ పాటించారు. అయితే మనమంతా సిద్ధంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఆయన మళ్లీ నియంత్రణ కోల్పోయి జగుప్పాకరమైన భాషలో పవన్ వివాహాలపై వ్యాఖ్యలు చేశారు. దీంతో పరిశీలకులు గోదావరి జిల్లా వేదికగా జగన్ పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై తమదైన విశ్లేషణలు చేస్తున్నారు.  గోదావరి జిల్లాలలో కాపు సామాజికవర్గం, బీసీ సామాజిక వర్గాల మధ్య స్వతహాగా ఉండే వైరాన్ని దృష్టిలో ఉంచుకుని బీసీలను దగ్గర చేసుకునే వ్యూహంతో జగన్  ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారంటున్నారు.  అయితే పవన్ పై అనుచిత, దిగజారుడు వ్యాఖ్యలు  జగన్ ఆశించిన ఫలితాన్ని ఇవ్వవని చెబుతున్నారు. తెలుగుదేశం కూటమిలో భాగస్వామిగా ఉన్న జగన్ కు  ఇటు కాపుల మద్దతు, అటు బీసీల మద్దతూ కూడా ఉందనీ, ఆ కారణంగా జగన్ వ్యాఖ్యల కారణంగా వైసీపీకే నష్టం వాటిల్లుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
Publish Date: Apr 18, 2024 10:29AM

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. బుధవారం (ఏప్రిల్ 17) స్వామివారిని 58 వేల690 మంది దర్శించుకున్నారు. వారిలో 20 వేల 744 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.  స్వామి వారి హుండీ ఆదాయం 3 కోట్ల రెండు లక్షల రూపాయలు వచ్చింది.   ఇక గురువారం (ఏప్రిల్ 18)  ఉదయం స్వామివారి ఉచిత దర్శనం కోసం రెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామి వారి ఉచిత దర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. అలాగే టైమ్ స్లాట్ దర్శనం కోసం భక్తులు ఒక కంపార్ట్ మెంట్ లో వేచి ఉన్నారు. టైం స్లాట్ భక్తులకు శ్రీవారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. ఇక 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది.
Publish Date: Apr 18, 2024 10:21AM

చోటే బేటియా గుట్టల్లో నక్సలిజంపై సర్జికల్ స్ట్రైక్.... 

దేశ ప్రగతికి నక్సలిజం ఆటంకంగా మారింది. అందుకే త్వరలోనే దేశం నుంచి నక్సలిజాన్ని తుడిచిపెట్టేస్తామంటున్నారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.  డెడ్‌బాడీలు వచ్చాకే చనిపోయిన మావోయిస్టులు ఎవరనేది తేలుతుంది! చోటే బేటియా గుట్టల్లో, నక్సలిజంపై జ‌రిగిన సర్జికల్ స్ట్రైక్ ను విజయవంతం చేసిన పోలీసు అధికారుల సాహసాన్ని అమిత్ షా అభినందించారు.  ఛత్తీస్ గఢ్ జిల్లాలో మావోయిస్టుల ఉనికి ఉంది. దీంతో వారిని లేకుండా చేయాలని రాష్ట్ర‌, కేంద్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయి. ఇందులో భాగంగానే వారిని అంతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నాయి. ఈనేపథ్యంలోనే భారీ ఎన్ కౌంటర్. పోలీసులు అడవిలో జల్లెడ పడుతున్నారు. మావోయిస్టులను దాదాపు ఏరిపారేశారు. ఎక్కడైనా ఆనవాళ్లు ఉంటే వారిని కూడా తుదముట్టిస్తున్నారు. ఇంకా పోలీసులు అడవిని గాలిస్తున్నారు. నక్సల్స్ ఆచూకీ కోసం తిరుగుతూనే ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌ చరిత్రలో అతిపెద్ద ఎన్‌కౌంటర్‌ ఇదే.  పచ్చని అడవులు రక్తంతో ఎరుపెక్కాయి. బస్తర్‌ రీజియన్‌లోని కాంకేర్‌ జిల్లాలో  జ‌రిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో దాదాపు 40 మంది మావోయిస్టులు హతమయ్యారు.  ఎన్‌కౌంటర్‌ ఘటనను నక్సలిజంపై సర్జికల్‌ స్ట్రైక్ గా ఛత్తీస్‌గఢ్‌ హోంమంత్రి విజయ్‌ శర్మ అభివర్ణించారు. గత ఐదేండ్లలో జరిగిన ఎన్‌కౌంటర్లలో ఇదే అతిపెద్దదిగా తెలుస్తున్నది. 2018 ఆగస్టులో ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల్లో 15 మంది మావోయిస్టులు చనిపోయారు. అదే ఏడాది మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా రేల్‌-కస్నాసుర్‌ అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో సుమారు 40 మంది మావోయిస్టులు మరణించారు. మళ్లీ 2021 నవంబర్‌లో గడ్చిరోలిలో జరిగిన యాంటీ మావోయిస్టు ఆపరేషన్‌లో భాగంగా జరిగిన ఎన్‌కౌంటర్‌లో 26 మంది మావోయిస్టులు మృతిచెందారు. 2016లో 30 మంది నక్సలైట్లను గ్రేహౌండ్స్‌ బలగాలు చంపేశాయి. తాజాగా నక్సల్స్‌ ప్రభావిత బస్తర్‌ రీజియన్‌లోని కాంకేర్‌ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన భీకర ఎదురు కాల్పుల్లో దాదాపు 40 మంది మావోయిస్టులు మృతిచెందారు.  ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టుల్లో డివిజన్‌ కమిటీ సభ్యులు నలుగురు ఉన్నట్లు తెలుస్తున్నది. ఇందులో ఒకరు తెలంగాణలోని భూపాలపల్లి జయశంకర్‌ జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన శంకర్‌రావు అలియాస్‌ మురళి అలియాస్‌ శ్రీపల్లి సుధాకర్‌ కాగా.. మరొకరు బీజాపూర్‌ జిల్లా భామర్‌గఢ్‌ ప్రాంతానికి చెందిన లలితగా గుర్తించినట్లు సమాచారం. అయితే ఎన్‌కౌంటర్‌లో పలువురు మావోయిస్టు ముఖ్య నేతలు మృతిచెందినట్లు వస్తున్న వార్తలపై ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది. భూస్వా ముల బారి నుంచి గిరిజనులు, వ్యవసాయ కూలీలను రక్షించడానికి వామపక్ష తీవ్రవాదులు సాయుధ పోరాటా న్ని ప్రారంభించారు. దానికే నక్సలిజం అనే పేరు వచ్చిం ది. తదనంతర కాలంలో మావోయిస్టు పార్టీగా పేరు మారింది. భూస్వాములను అంతమొందిస్తే వ్యవసాయ కూలీలకు, నిరుపేదలకు విముక్తి లభిస్తుందన్నది మావో యిస్టుల వాదన. అయితే, వ్యవస్థలో లోపాలను సరిదిద్ద కుండా వ్యక్తులను అంతమొందించడం వల్ల ప్రయోజనం ఏమిటని మేధావుల ప్రశ్న. మావోయిజం (నక్సలి జం) వ్యాప్తి పెరిగిన కొద్దీ, భూస్వాముల వేధింపులు పెరిగిపోతున్నాయి. ఆర్థిక అసమానతలు పెరిగి పోతున్నాయి. మావోయిస్టులను అణచివేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయిలు ఖర్చు చేస్తున్నాయి. ఇప్పటికి వేలమంది పోలీసులు బలి అయ్యారు. ఈ ఉద్యమం పేరు చెప్పి, అటు మావోయిస్టుల్లోను, ఇటు పోలీసుల్లోనూ ప్రాణాలు కోల్పోతోంది బలహీనవర్గాల వారే. పోలీసు శాఖలో రిస్క్‌ ఉన్న ఉద్యోగాల్లో ఎక్కువ మంది బలహీనవర్గాల వారే చేరుతున్నారు. మావోయి స్టుల కాల్పుల్లో సమిధలు అవుతున్నదీ వారే. అలాగే, నక్సలైట్‌ ఉద్యమంలో చేరిన వారిలో అధికంగా బలహీన వర్గాలకు చెందినవారే ఉంటున్నారు. పోలీసుల ఎదురు కాల్పుల్లో మరణిస్తున్నదీ ఎక్కువగా వారే.
Publish Date: Apr 17, 2024 7:35PM

ఇంకా నెల రోజులు భరించాలా? జగన్ సర్కార్ పై జనంలో ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు నెల రోజుల వ్యవధిలోకి వచ్చేశాయి. అయితే రాష్ట్ర ప్రజలు మాత్రం ఇంకా నెలరోజులా అని నిట్టూరుస్తున్నారు. ఎందుకంటే చాలా కాలంగా వారు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? జగన్ ను అధికారం నుంచి ఎప్పుడు సాగనంపుతారా అని ఎదురు చూస్తున్నారు. అందుకే ఏడాదికి ముందే ప్రభుత్వ  సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ముందస్తు ఎన్నికల గురించి ప్రస్తావించినప్పుడు జనం హర్షామోదాలు వ్యక్తం చేశారు. ఆ తరువాత కనీసం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటైనా ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరగకపోతాయా అని ఆశపడ్డారు. సరే అవేమీ కార్యరూపం దాల్చలేదు. ఓటమి భయమో, మరో కారణమో జగన్  ముందస్తుపై ముచ్చట పడలేదు. ఇప్పుడు ఇక సమయం వచ్చేసింది. 2019లో జగన్ కు రాష్ట్రంలో ఐదేళ్లు అధికారం అప్పగిస్తూ ప్రజలు ఇచ్చిన తీర్పు గడువు ముగింపునకు వచ్చింది. 2014 ఎన్నికలలో మరోసారి అధికారంలోకి రావాలని జగన్ కలలు కంటుంటే కంటుండొచ్చు కానీ జనం మాత్రం ఆయన అధికార అహంకారాన్ని భరించలేం అన్న నిర్ణయానికి వచ్చేశారు. ఆ విషయాన్ని ఎటువంటి దాపరికం లేకుండా బాహాటంగానే చెబుతున్నారు. ఆయన సభలకు జనం ముఖం చాటేస్తున్నారు. దీంతో ఓటమి ఖాయం అన్న నిర్ధారణకు వచ్చేసిన జగన్ తెగించేశారు. ఎటూ తప్పని ఓటమిని తప్పించుకునేందుకు ఉన్న మార్గాల అన్వేషణలో పడ్డారు.  ఆ అన్వేషణలో భాగంగానే హత్యాయత్నం అంటే సెంటిమెంటాయుధాన్ని ప్రయోగించారు. అయితే జనం మనస్సుల్లో కోడికత్తి డ్రామా సజీవంగా ఉండటంతో.. కోడికత్తి 2 అదే గులకరాయి దాడితో హత్యాయత్నం డ్రామా రక్తికట్టడం మాట అటుంచి నవ్వుల పాలైంది. జగన్ ను నవ్వుల పాలు చేసింది. సొమ్ముల కోసమే జనం జగన్ సభలకు వస్తున్నారని పోలీసుల విచారణ సాక్షిగా తేలిపోయింది.   దీంతో జగన్ ఎన్నికల గండాన్ని గట్టెక్కేందుకు ఇంకేం  చేయాలో తెలియని అయోమయంలో పడిపోయారు. 
Publish Date: Apr 17, 2024 3:55PM

రేపటి నుంచి నామినేషన్ల పర్వం షురూ 

ఏపీలో రేపు (ఏప్రిల్ 18) ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. రేపటి నుంచి నామినేషన్ల పర్వం షురూ కానుంది.  దేశవ్యాప్తంగా ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్‌ జరగనుంది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న ప్రారంభమయ్యే ఎన్నికల ప్రక్రియ జూన్ 1న ముగుస్తుంది. ఏప్రిల్‌ 19న తొలి దశ పోలింగ్‌ జరుగుతుంది. నాలుగో దశలో ఏపీ, తెలంగాణకు ఎన్నికలు జరుగుతాయి. తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజున.. మే 13న ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు సైతం మే 13న జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలను జూన్ 4వ తేదీన ప్రకటించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. లోక్ సభ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పొలిటికల్ హీట్ పెరిగింది.
Publish Date: Apr 17, 2024 3:52PM

జగనే ఎందుకు ?

ఏపీలో ఎన్నికల వేళ ఎక్కువగా వినిపిస్తున్న ప్రశ్న మళ్లీ జగన్ ఎందుకు?  ఈ ప్రశ్న వేస్తున్నది విపక్షాలు కాదు. జనం. సామాన్య జనం. కొన్ని నెలల కిందట జగన్ శిబిరమే ఏపీకి జగనే ఎందుకు కావాలో వివరిస్తూ పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రజల జ్ణాపకశక్తి చాలా తక్కువ అన్న నమ్మకంతో కావచ్చు  ధైర్యంగా వైనాట్ 175 అంటూ స్వయంగా జగన్ ఒక ప్రశ్నను సంధించి రాష్ట్రంలో 175 కు 175 స్థానాలలోనూ వైసీపీ అభ్యర్థులే గెలవాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. ప్రజల జ్ణాపకశక్తిపై జగన్ కు ఉన్న నమ్మకాన్ని ఎవరూ కాదనలేరు కానీ నడుస్తున్న చరిత్ర , పడుతున్న కష్టాలు, కళ్ళ ముందు  కదులుతున్న అరాచక పాలనను జనం క్షమిస్తారనీ, పట్టించుకోరనీ ఆయన భావించడం అయితే అతి విశ్వాసం లేదా అహంభావం అయి ఉండాలి. లేదా అమాయకత్వం అయ్యి ఉండాలి. కానీ జనగ్ ను అమాయకుడని ఎవరూ భావించజాలరు. వైనాట్ 175 అన్న తన నమ్మకాన్ని నిలుపుకోవడానికి, ఆ అసాధ్యాన్ని సాధ్యం చేయడానికీ జగన్ ఎంతకైనా తెగిస్తారనడానికి బోలెడు ఉదాహరణలు ఉణ్నాయి   నిజానికి ఐదేళ్ల  జగన్  పాలనలో రాష్ట్రం అన్ని విధాల అధోగతి పాలైంది. అప్పుల ఊబిలో కూరుకుపోయింది. రాజధాని లేని రాష్ట్రంగా నవ్వుల పాలైంది. ఇంకా చెప్పాలంటే, అరాచకం రాజ్యమేలింది. ఈ అరాచక, అవినీతి పాలనను తట్టుకొనలేక   పెట్టుబడి దారులు పక్క రాష్టాలకు వెళ్లి పోతున్నారు. కొత్త పరిశ్రమలు రావడం లేదు. దీంతో రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు . యువత వలసబాట పట్టక తప్పని అనివార్య పరిస్థితి ఏర్పడింది.   అవి చాలవన్నట్లు, జగన్ రెడ్డి, కుట్ర పూరితంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు,మాజీ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేయడంతో రాష్ట్రం అట్టుడికి పోయింది. వేధింపులు, అరాచకాలు తప్ప జగన్ ఏలుబడిలో రాష్ట్రంలో ఇంకేం లేకుండా పోయింది. దీంతో జగన్  కి ఒక్క ఛాన్స్ ఇచ్చి తప్పు చేశామని, ప్రజలు భావించే పరిస్థితి వచ్చింది.  దీంతో వారు  చేసిన తప్పు  మళ్ళీ చేయబోమని ప్రతిజ్ఞ చేస్తున్నారు. జగన్ ను అధికారం నుంచి దింపాలన్న నిర్ణయానికి ప్రజలు వచ్చేశారు. ఆ ప్రజాభిప్రాయమే సర్వేలలో ప్రతిఫలిస్తోంది.   జగన్ రెడ్డిని ఓడించి సాగనంపడం ఒక్కటే  కాదు, చంద్రబాబును గెలిపించుకుని రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పథంలో పరుగులెట్టేలా చేయాలన్న జనం నిశ్చయాన్ని కూడా సర్వేల ఫలితాలు చెబుతున్నాయి.  ఎన్నికలు నెల రోజుల వ్యవధిలోకి వచ్చిన తరువాత కూడా జనం ఇంకా నెలరోజులా అని భావిస్తున్నట్లుగా వారిలో ఆవేశం కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  వై నాట్ 175 అన్న తన ఆశ పగటి కలేనని జగన్ కే తెలిసిపోయినట్లుంది. దీంతో  గత ఎన్నికలలో తనకు లబ్ధి చేకూర్చిన సెంటిమెంటుపై పడ్డారు. గులకరాయి దాడిని తనపై హత్యయత్నంగా చూపి సానుభూతి పొందడానికి చేసిన యత్నం నవ్వుల పాలు కావడానికి జనం కోడికత్తి దాడి డ్రామాను జనం ఇంకా మరచిపోకపోవడమేనని పరిశీలకులు అంటున్నారు.   దీంతో మళ్ళీ జగనే ..ఎందుకు కావలి?’ అని వైసీపీ రూపొందించిన ప్రచార కార్యక్రమం  అవును జగనే ఎందుకు ? వద్దే వద్దు అన్న జనవాక్యంగా మారిపోయిందని చెబుతున్నారు. 
Publish Date: Apr 17, 2024 3:01PM

ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ ... రాములోరికి పట్టు వస్త్రాలు సమర్పించిన సిఎస్ 

భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో వైభవంగా సీతారాముల కల్యాణం జరిగింది.  ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి  స్వామివారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. తెలుగు రాష్ట్రాల నుంచి కల్యాణం చూసేందుకు ఎత్తున భక్తులు భారీగా తరలి వచ్చారు. కల్యాణ మహోత్సవంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి కల్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఎట్టకేలకు ఎన్నికల కమిషన్ అనుమతినిచ్చింది. ఎన్నికల నియమావళికి లోబడి ప్రత్యక్ష ప్రసారం చేయాలని ప్రభుత్వానికి ఈసీ స్పష్టం చేసింది. సీఎం లేదా దేవదాయ శాఖ మంత్రి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించడంతో పాటు కల్యాణ మహోత్సవం ప్రత్యక్ష ప్రసారానికి అనుమతివ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం గత నెల 30న ఈసీకి లేఖ రాసింది.సీఎం రేవంత్​రెడ్డి, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించడానికి అనుమతి నిరాకరించిన ఎన్నికల కమిషన్ అవసరమైతే అధికారులు సమర్పించవచ్చునని ఈనెల 4న పేర్కొంది. అయితే లైవ్​ టెలికాస్ట్​ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయరాదని ఆంక్షలు విధించింది. ఆలయం, కల్యాణ మహోత్సవం విశిష్టత, సంప్రదాయం, చరిత్రను పరిగణనలోకి తీసుకొని ప్రత్యక్ష ప్రసారానికి అనుమతివ్వాలని ఈనెల 17న ప్రభుత్వం తరఫున మంత్రి కొండా సురేఖ మరోసారి లేఖ రాశారు.సుమారు నలభై ఏళ్లుగా కుల, మత, జాతులకు అతీతంగా దేశ, విదేశాల్లోని లక్షల మంది వీక్షిస్తారని తెలిపారు. బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని కోరారు. ఎట్టకేలకు ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ప్రభుత్వానికి ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఒంటిమిట్టలో 22న సీతారాముల కల్యాణం ఆంధ్రప్రదేశ్‌లోని ఒంటిమిట్టలో కోదండరాముడి వార్షిక మహోత్సవాలు నేటి నుంచి 26వ తేదీ వరకు జరగనున్నాయి. ఉదయం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. 22వ తేదీన రాత్రి సీతారాముల కల్యాణ మహోత్సవం జరుగుతుంది. రాములవారి కల్యాణం లక్షమంది వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఒంటిమిట్టలో 23న రథోత్సవం నిర్వహిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఒంటిమిట్టలో శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి
Publish Date: Apr 17, 2024 1:46PM

మోడీ హ్యాట్రిక్ ధీమా వెనుక ఉన్నది ప్రజాభిమానం కాదు.. విపక్షాల వైఫల్యమే!

కేంద్రంలో వరుసగా మూడో సారి మోడీ సర్కార్ కొలువుదీరడం ఖాయమన్న విశ్వాసాన్ని బీజేపీ వ్యక్తం చేస్తున్నది. అయితే  ఆ విశ్వాసం, ధీమా ప్రజాభిమానాన్ని చూరగొనడం వల్ల వచ్చింది కాదనీ, కేవలం విపక్షాల వైఫల్యంతో వచ్చిందేననీ పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. దేశంలో  సార్వత్రిక ఎన్నికల ప్రచారం హీట్ పెరిగింది. మాటల తూటాలు పేలుతున్నాయి. బీజేపీ హ్యాట్రిక్  విజయాల కోసం, కాంగ్రెస్ రెండు ఓటముల తరువాత ఎలాగైనా గెలిచి అధికారంలోకి రావాలన్న పట్టుదలతో  చెమటోడుస్తున్నాయి. ప్రచారం తీరు, దూకుడు చూస్తే ఎవరైనా కేంద్రంలో మోడీ మరో సారి అధికారంలోకి రావడం ఖాయమనే అంటున్నారు. అయితే పరిశీలకులు, రాజకీయ పండితులు మాత్రం అదంత వీజీ కాదంటున్నారు. వరుసగా పదేళ్ల పాటు అధికారంలో ఉన్న మోడీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి మిత్రపక్షాలను దూరం చేసుకుంది. మళ్లీ ఎన్నికల ముందు మిత్రపక్షాలతో పొత్తు కోసం వెంపర్లాడింది. ఏకపక్ష విజయం పట్ల నిజంగానే అంత ధీమా ఉంటే.. పొత్తుల కోసం ఎందుకు తహతహలాడుతుందన్న ప్రశ్న సహజంగానే అందరిలో ఉదయిస్తుంది. మరో వైపు ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు కాంగ్రెస్ వెనుక ర్యాలీ అయ్యే విషయంలో ముందు వెనుకలాడుతున్నాయి. దీంతో సహజంగానే ఎన్డీయే బలంగా ఉంది. ఇండియా కూటమి బలహీనంగా ఉందన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తం అవుతోంది. అయితే పరిస్థితి బయటకు కనిపించేంత క్రిస్టల్ క్లియర్ గా లేదనీ బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేకు హ్యాట్రిక్ విజయం సునాయాసంగా దక్కే అవకాశాలు అంతగా కనిపించడం లేదనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దేశంలో ప్రభుత్వ వ్యతిరేకత చాపకింద నీరులా విస్తరిస్తోందంటున్నారు.  2004లో బీజేపీ భారత్ వెలిగిపోతోంది అనే నినాదంతో  ముందస్తు ఎన్నికలకు వెళ్లిన   బీజేపీకి పరాభవం ఎదురైన సంగతి గుర్తు చేస్తున్నారు. అప్పుడు ఉన్నదీ ఎన్డీయే నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వమే. మిత్రధర్మాన్ని పాటించడంలో కానీ, ప్రజామోద పాలన విషయంలో కానీ మోడీ సర్కార్ కంటే వాజ్ పేయి సర్కారే బెటరనీ పరిశీలకులు చెప్పడమే కాదు. అప్పటి ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నాయకులు కూడా ఎలాంటి  సంకోచం లేకుండా చెబుతారు. అయినా అప్పటి వాజ్ పేయి  ప్రభుత్వం పై వ్యతిరేకత  కాంగ్రెస్ కు కలిసి వచ్చింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ అధికారంలోకి వచ్చింది. అప్పట్లో వాజ్ పేయి ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను ఎన్నికల తరువాత పరిశీలకులు నిశ్శబ్ద విప్లవం అని అభివర్ణించారు.  ప్రస్తుతం మోడీ నేతృత్వంలోని ప్రభుత్వంపై కూడా ప్రజా వ్యతిరేకత నిశ్శబ్ధ ఉందనీ, జనం బాహాటంగా ఆ విషయాన్ని వెల్లడించకపోయినా.. ఎన్నికలలో ఆ వ్యతిరేకత ప్రభావం కనిపించే అవకాశం ఉందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అయోధ్య రామమందిర ని్మాణం,  హిందూత్వ అజెండా,  ఉమ్మడి పౌరస్మృతి వాగ్దానం, తలాక్ రద్దు, జమ్మూ కాశ్మీర్ వంటి అంశాలు తమను మరో సారి అధికార పీఠంపై కూర్చోపెడతాయన్న విశ్వాసం మోడీలో స్పష్టంగా గోచరిస్తోంది. అయితా ఓ తాజా సర్వే భారతీయులు హిందుత్వ కంటే సర్వమత సామరస్యాన్నే కోరుకుంటున్నారనీ, రామ భక్తి సామ్రాజ్యం కంటే ప్రజాస్వామ్య భారతాన్ని ఇష్టపడుతున్నారనీ తేల్చింది. జనాభాలో దాదాపు 79శాతం మంది బీజేపీ అజెండా హిందుత్వ అయినా తాము బహు మత భారత ప్రజాస్వామ్యాన్నే కోరుకుంటున్నామని కుండ బద్దలు కొట్టేశారు. ఆ తాజా తీసుకున్న శాంపిల్స్ తక్కువే అయి ఉండొచ్చు. కానీ మెజారిటీ ప్రజల మనోభావాలను స్పష్టంగా ప్రతిఫలించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    ఈ సందర్భంగా 2004 ఎన్నికల ఫలితాన్ని గుర్తు చేస్తున్నారు. అప్పటి ఎన్నికలలో యూపీఏ ప్రధాని అభ్యర్థిగా సోనియా అన్న నినాదంతోనే ఎన్నికలు వెళ్లంది. అప్పట్లో సోనియా విదేశీయతను బీజేపీ చాలా ప్రముఖ అంశంగా ప్రచారం చేసింది. అయినా జనం సోనియా విదేశీయత అంశాన్ని పట్టించుకోలేదు.  ఇప్పుడు అయోధ్య రామమందిర నిర్మాణాన్ని మోడీ సాధించిన ఘన విజయంగా చెప్పుకుంటూ బీజేపీ ప్రజలలోకి వెడుతోంది. అదే సమయంలో మోడీ సర్కార్ వైఫల్యాలను ప్రజలలోకి తీసుకువెళ్లడంలో కాంగ్రెస్, కూటమి  పార్టీలూ పెద్దగా సఫలం కావడం లేదు. అయినా ప్రజలలో రామ మందిర నిర్మాణం పట్ల సానుకూలత కంటే  దేశంలో పెచ్చరిల్లుతున్న విద్వేష భావనల పట్లే ఎక్కువ ఆందోళన వ్యక్తమౌతోందని పరిశీలకులు అంటున్నారు.  ఇప్పటి ఇండియా ఫ్రంట్ నేతలు, ముఖ్యంగా రాహుల్ గాంధీ బీజేపీ వైఫల్యాలు ప్రజలలోకి తీసుకు వెళ్లడంలో విఫలం అవుతున్నారు.గత ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ యంత్రాలపై విమర్శలు వచ్చాయి. కొన్ని యంత్రాలు కనిపించకండా పోయాయనే వార్తలు వచ్చాయి. దేశంలో విలయతాండవం చేస్తున్న నిరుద్యోగ రక్కసి కారణంగా మధ్యతరగతి ప్రజలలో మోడీ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమౌతోందని, అలాగే రైతుల ఆదాయం రెట్టిపు అన్న నినాదంతో అధికారంలోకి వచ్చిన మోడీ సర్కార్.. రైతులను దగా చేసిందన్న అభిప్రాయం కూడా బలంగా వ్యక్తం అవుతోంది. ఎలాంటి రాజకీయ మద్దతు లేకుండానే రైతులు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తున్నారు. మోడీ సర్కార్ ను నిలదీస్తున్నారు.  నిత్యావసరాల ధరలు ఆకాశానికి చేరుతున్నాయి.వీటిని అదుపు చేయలేక ప్రభుత్వం చేతులెత్తేసింది.  ఉత్పత్తి రంగాలు కార్పొరేట్ల చేతిలోకి వెళ్లాయి.వారికి ప్రభుత్వం అండ ఉండడంతోపాటు ఆర్ధికవ్యవస్థ ను గుప్పిట్లో పెట్టుకొని ఉన్నారు.ఫ లితంగా వారు నిర్ణయించినదే ధరగా మారుతోంది. దీంతో అదుపులేకుండా నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. దీనితో అన్ని వర్గాలలోనూ కేంద్రంలోని మోడీ సర్కార్ పట్ల ఏదో స్థాయిలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అదే సమయంలో  ఈ విషయాలపై ప్రజలలోకి బలంగా దూసుకెళ్లాల్సిన కాంగ్రెస్, దాని మిత్రపక్షాలూ ఘోరంగా విఫలమయ్యాయి.   పంజాబ్,హర్యానాలో రైతుల్లో గిట్టుబాటు బాటు ధర,రైతు చట్టాలు ఉపసంహరణ చేయకపోవడంపై అసంతృప్తి ఉంది. సీఏఏ   అమలులోకి తేవడం వల్ల పౌరసత్వం పై మైనార్టీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మేధావులు ప్రభుత్వ తీరును విమర్శ చేస్తే అర్బన్ నక్సలైట్లు గా పిలుస్తూ అరెస్టు చేయడంతో ఆయా వర్గాల్లోనూ ఆగ్రహం వ్యక్తం అవుతోంది.   అయితే కేంద్రంలోని మోడీ సర్కార్ పై వ్యక్తమౌతున్న ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంలో కాంగ్రెస్ కూటమి, ఇతర బీజేపీయేతర పార్టీలూ విఫలం కావడం బీజేపీకి కలిసి వచ్చే అంశంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. 
Publish Date: Apr 17, 2024 1:39PM

కేసీఆర్ కు ఎన్నికల సంఘం నోటీసులు

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఈ నెల 5న సిరిసిల్లలో కేసీఆర్ ప్రసంగంలో చేసిన అభ్యంతర కర వ్యాఖ్యలపై బుధవారం ( ఏప్రిల్ 18) లోగా వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. ఆయన ప్రసంగంలో చేసిన పరుష వ్యాఖ్యలు ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకే వస్తాయని ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ కార్యదర్శి అవినాష్ కుమార్ జారీ చేసిన ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ ఫిర్యాదు మేరకు ఈ ఎన్నికల సంఘం కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది.  లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏప్రిల్ 5న సిరిసిల్లలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరుష పదాలతో చేసిన కామెంట్లను సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఆయనకు మంగళవారం నోటీసులు జారీచేసింది. పార్టీ అధినేతగా, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని, అందుకు తగిన ప్రాథమిక ఆధారాలను కమిషన్ పరిశీలించిందని ఈసీ ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసుకు గురువారం (ఏప్రిల్ 18) ఉదయం 11 గంటలకల్లా కమిషన్‌కు చేరేలా వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో పాటు సిరిసిల్ల జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ నుంచి వాస్తవాలతో కూడిన రిపోర్టును తెప్పించుకున్న తర్వాత ఈ నోటీసు జారీ చేయాల్సి వచ్చిందని అవినాశ్ కుమార్ పేర్కొన్నారు. సిరిసిల్లలో తన ప్రసంగంలో కేసీఆర్ ప్రతిపక్ష నేతలపై కుక్కల కొడుకుల్లారా, లతుకోరులు, చవటదద్దమ్మలు వంటి పరుష పదాలను ప్రయోగించారు. అలాగే లతుకోరు ప్రభుత్వం, గొతుల్ని కోసేస్తాం, చంపేస్తాం వంటి  వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకే వస్తాయంటూ ఎన్నికల సంఘం కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది.  
Publish Date: Apr 17, 2024 12:36PM

చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ లో పెరిగిన మృతుల సంఖ్య...29 మావోయిస్టులు దుర్మరణం 

మరో పది రోజుల్లో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చత్తీస్ గఢ్ లోని కాంకేర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఇటీవల కాలంలో ఛతీస్ గఢ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల సంచారం ఎక్కువగా ఉండటంతో భద్రతా దళాలు జల్లెడపడుతున్నాయి. దీంతో మావోలు కూడా నిన్న పోలీస్ బేస్ క్యాంప్ పై బాంబులు విసిరారు.దీంతో భద్రతాదళాలు వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.  ఈ క్రమంలో ఛోటేబేథియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు, మవోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు బీఎస్ఎఫ్ తెలిపింది. మృతుల్లో మావోయిస్టు కీలక నేత శంకర్ రావు కూడా ఉన్నాడని, ఆతని మీద రూ.25 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మరో 40 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది.  ఈ ఎదురుకాల్పుల్లో బీఎస్ఎఫ్ ఇన్స్ పెక్టర్, ఇద్దరు జవానులు గాయపడినట్లు సమాచారం. ఘటనా స్థలంలో ఏకే 47 తుపాకులు, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన భద్రత సిబ్బందిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.ఇదిలా ఉండగా, కాంకేర్ లోక్ సభ స్థానానికి రెండో దశలో భాగంగా ఈ నెల 26న పోలింగ్ నిర్వహించనున్నారు.
Publish Date: Apr 17, 2024 12:36PM

ముష్టి 350 కోసం జగనన్న ప్రాణాలతో ఆడుకున్నారు కదరా!

ఏవయ్యా విజయవాడ వైసీపీ నాయకులు, కార్యకర్తలూ.. మీరు మన ప్రియతమ నాయకుడు జగనన్న ప్రాణాలతో ఆడుకున్నారు కదరా! మీరు ఆ రాయి విసిరిన పిల్లోడికి కమిట్ అయిన ఆఫ్ట్రాల్ 350 రూపాయలు ఇవ్వకపోవడం వల్ల ఎంత దారుణం జరిగిందో చూశారుగా. ముందుగా ఒక పాయింట్ ఏంటంటే, ఆ రాయి విసిరిన పిల్లోడిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒలింపిక్స్.కి రికమండ్ చేయాల్సిన అవసరం వుంది. ఆ పిల్లోణ్ణి ఒలింపిక్స్.లో ఏ గురిచూసి కొట్టే పోటీలోనో ఆడిస్తే మన దేశానికి గోల్డ్ మెడల్ ఖాయంగా వస్తది. ఆ చీకట్లో, ఆ జనంలో, వాహనం మీద అంతమంది వుండగా, కరెక్ట్.గా జగనన్న ముఖానికే తగిలే విధంగా రాయి విసిరాడు చూడూ.. టాలెంటంటే వాడిదిరా. సరే, ఇక అసలు పాయింట్లోకి వెళ్తే, జగనన్న పేరు చెప్పుకుని జనాలను పీడించి బాగానే కోట్లకు కోట్లు సంపాదించుకున్నారుగా. ఆల్రెడీ ఆ పిల్లోడికి క్వార్టర్ బాటిల్ ఇచ్చారుగా, దానితోపాటు ఇంకో 350 రూపాయలు ఇస్తే మీ సొమ్మేం పోయేదిరా సచ్చినోళ్ళారా. మీరు కమిట్ అయింది ఇవ్వలేదు.. దాంతో ఆ పిల్లోడు మీ నాయకుడి మీద రివెంజ్ తీర్చుకున్నాడు.  ఆ పిల్లోడు విసిరిన రాయి కంటికి కొంచెం పైన తగిలి చిన్న గాయం అయి, జగనన్న ప్లాస్టర్ వేసుకోవడానికి అనుకూలంగా కూడా వుంది కాబట్టి సరిపోయింది. అదే రాయి జగనన్న కంటికి తగిలితే పరిస్థితి ఏంటి? జగనన్న జీవితాంతం గాజు కన్నుతోనే వుండాల్సి వచ్చేది. జీవితమంతా ఎడమవైపు ఎవరున్నారో తెలియకుండా పోయేది. సరే, కంటి విషయం వదిలేయండి, అదే రాయి జగనన్న మూతికి తగిలి వుంటే పరిస్థితి ఏంటి? ఆయన మూతి ఆంజనేయ స్వామి మూతి లాగా వాచిపోయి వుండేది. వారం రోజులపాటు బయటకి వచ్చే అవకాశం వుండేది కాదు. అసలే ఎన్నికల ప్రచారం జరుగుతున్న సమయంలో ఇలా బ్రేక్ వస్తే బాగుంటుందా చెప్పండి. ఒకవేళ వాచిపో్యిన మూతితోనే ఆయన మాట్లాడితే వినేవాళ్ళకు, చూసేవాళ్ళకి ఎంత కామెడీగా వుండేదో తెలుసా?  సరే, మూతి కూడా వదిలేయండి. ముక్కుకు తగిలితే పరిస్థితి ఏంటి? ముక్కు పచ్చడి అయిపోయి, ముక్కు చీదుకోవడానికి కూడా అవకాశం లేకుండా పరిస్థితి తయారయ్యేది. జగనన్న ముక్కుకి బ్యాండేజ్ కట్టడం కూడా చాలా కష్టం.. అలాంటి పరిస్థితుల్లో జగనన్న ఎంత ఇబ్బంది పడేవారో మీరు అర్థం చేసుకున్నారా? సరే, ముక్కు కూడా వదిలేయండి, రాయి డైరెక్ట్.గా వెళ్ళి జగనన్న చిన్న మెదడుకు తగిలి వుంటే, ఆయన చిన్నమెదడు చిట్లిపోయి వుంటే పరిస్థితి ఎంత దారుణంగా వుండేదో తెలుసా? జగన్ జ్ఞాపకశక్తి అంతా తుడిచిపెట్టుకుని పోయి వుండేది. ఆయన ఆస్తులు ఎక్కడెక్కడ వున్నాయో కూడా మర్చిపోయి వుండేవాడు. ఎవర్నీ గుర్తుపట్టలేకపోయేవాడు. వచ్చిన కాస్తా కూస్తా తెలుగు కూడా మర్చిపోయి ఏదో వింత భాష మాట్లాడేవాడు. మన పార్టీ మహిళామణులు బాధపడుతున్నట్టు ఆ రాయి డైరెక్ట్.గా వచ్చి జగనన్నకి ‘తగలరాని చోట’ తగిలినట్టయితే పరిస్థితి ఇంకా ఎంత దారుణంగా తయారయ్యేదో ఒక్కసారి ఊహించండి. అందువల్ల, ఈసారి ఎవరికి ఎంత కమిట్ అయితే ఇచ్చేయండి. మీరు డబ్బుకోసం కక్కుర్తి పడి జగనన్న ప్రాణాల మీదకి తీసుకురాకండి.
Publish Date: Apr 17, 2024 12:30PM